విశాఖ విద్య: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని ఎన్సీటీఈ సభ్యుడు, ది మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి ఆచార్య కె.పుష్పనాథం అన్నారు. ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదురోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్డీపీ)ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020ను తరగతి గదుల్లో సమర్థంగా అమలు చేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. ఏ దేశమూ తన ఉపాధ్యాయుల స్థాయిని మించి ఎదగదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో జాతీయ విద్యా విధానం ముడిపడి ఉందన్నారు. సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఏఐ సమర్థంగా పనిచేస్తున్నందున ఆధునిక సాంకేతికతలను పాఠ్య ప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమర్కంఠక్ విద్యా విభాగాధిపతి ఆచార్య ఎం.టి.వి.నాగరాజు మాట్లాడుతూ జనరేటివ్ ఏఐపై ఎఫ్డీపీ నిర్వహిస్తున్న తొలి వర్సిటీగా ఏయూ నిలుస్తోందన్నారు. ఐఐఐటీ అగర్తల మాజీ సంచాలకులు ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సాంకేతికతతో కలిసి ముందుకు సాగాలని, ఏఐ రంగంలో భారత్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అతిథులను విశ్వవిద్యాలయం తరఫున సత్కరించారు.


