అరకులోయ టౌన్(డుంబ్రిగుడ): 1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. గిరిజన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం గిరిజన ఉద్యోగ, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అరకులోయ పట్టణంలో ఎన్టీఆర్ పార్క్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవో నంబర్ 3 స్థానంలో గిరిజన ఉద్యోగ నియామక నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, హైడ్రోపవర్ ప్రాజెక్టుల ఏర్పాటు ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే ఎలాంటి ప్రయత్నమైనా సహించబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాకై ్సట్ మైనింగ్ వంటి కార్యక్రమాల పేరుతో గిరిజనుల భూములు, అడవులు, జీవన హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే అలాంటి ఆలోచనలను విరమించుకోవాలని లేకపోతే గిరిజన ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. గిరిజనుల భూమి, అడవి, ఉద్యోగ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం మరింత బలంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో గిరిజన జేఏసీ నాయకులు మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు చిన్నరావు, పరశురామ్, ఆనంద్రావు, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


