పాడేరు : గిరిజనుల సమస్యల పరిష్కారం విషయంలో కూటమి ప్రభుత్వం కాలయాపనతో సరిపెడుతోందని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స ఆరోపించారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ భవనంలో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది ఐటీడీఏల్లో అభిప్రాయాల సేకరణ పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ జాప్యం చేస్తున్నారన్నారు. జిల్లాలో ఆదివాసీ సంఘాలతో చర్చలకు వస్తున్న మంత్రులు జీవో నంబర్.3 పునరుద్ధరణ, 1/70 చట్టం పటిష్టంగా అమలుపై నిర్ధిష్టమైన ప్రణాళిక, ప్రతిపాదనలతో రావాలన్నారు. జీవో నంబర్.3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని సీఎం చంద్రబాబు, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ప్రకటనలు చేస్తూ... ఇప్పటి వరకు ముసాయిదా బిల్లు, నిర్ధిష్ట కాల పరిమితిని ఎక్కడా ప్రకటించాలేదన్నారు. 1/70 చట్టం నిర్వీర్యమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదివాసీలకు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్లు రాజ్యంగబద్దంగా 5వ షెడ్యూల్ ఏరియాల్లో క్లాజ్–2 ప్రకారం సాధ్యమేనన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పొంతన లేని వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లో కొనసాగించేంచేలా ప్రభుత్వం ప్రకటన చేసినా నేటి వరకు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయకపోవడం సరికాదన్నారు. ఉద్యమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులకు ముందస్తూ హెచ్చరికలు జారీ చేయడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మన్న పడాల్, బాల్దేవ్, డీఎల్వో నాయకులు కొత్తయ్య, కాంతారావు, గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు కుడుముల కాంతారావు, రూడీ అప్పారావు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ పాత్రుడు, సింహాచలం, మానవ హక్కుల సంఘం నాయకులు చిన్ని, రాము, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నాయకు డు వి.కొండబాబు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, గంగాధర్, ఆదివాసీ మాతృభాషా విద్య వలంటీర్ల సంఘం అధ్యక్షుడు జగన్, మహిళ సంఘం నేత విమల, గిరిజన సంఘం నాయకులు దాస్, జిల్లా నిరుద్యోగుల సంఘం నాయకులు కె.వై. కుమార్, భాను, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవన్, కార్తీక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కృష్ణ, చిన్నారావు, నరేష్, ఆదివాసీ సేన నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స


