● ఎస్పీ అమిత్ బర్దర్
● వేసవి నేపథ్యంలో సిబ్బందికిరక్షణ కిట్ల పంపిణీ
పాడేరు: వేసవి కాలంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, టోపీలు, చలువ కళ్లద్దాలు, హ్యాండ్ గ్లౌజులు తదితర రక్షణ వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున విధులు నిర్వహించే సమయంలో సిబ్బంది తరచుగా మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని స్పష్టం చేశారు. ఎక్కువ సేపు నేరుగా ఎండలో నిలబడకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, టోపీలను తప్పనిసరిగా ధరించి ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలని కోరారు. విధుల్లో ఉన్నప్పుడు ఎవరికై నా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ బి. అప్పలనాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరాజు, పాడేరు సీఐ దీనబంధు తదితరులు పాల్గొన్నారు.


