యలమంచిలి రూరల్ : మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేయడంతో భార్య మృతి చెందిన ఘటన యలమంచిలి పట్టణానికి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ తెలిపిన వివరాలివి. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం ఈదులబయలు గ్రామానికి చెందిన వంతల కుమారి (40) ఏడాది క్రితం భర్తతో విభేదాల కారణంగా ఇద్దరు పిల్లలు, భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది. అల్లూరి జిల్లా పాడేరు మండలం చీడిమెట్ట గ్రామానికి చెందిన మర్రి కామేష్తో కుమారికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వివాహం చేసుకుని యలమంచిలి సమీపంలో ఎర్రవరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనున్న ఒక తుక్కు దుకాణంలో ఖాళీ మద్యం సీసాలు వేరు చేసే పని చేస్తున్నారు. దుకాణ యజమాని ప్రతి ఆదివారం వీరికి ఖర్చుల కోసం రూ.1000 అదనంగా ఇస్తూంటారు. గత ఆదివారం వీరిద్దరూ యజమాని ఇచ్చిన వెయ్యి రూపాయలతో మద్యం తాగారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త కామేష్ ఆమె ముఖంపై పిడికిలితో బలంగా గుద్దాడు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై తుక్కు దుకాణం యజమాని కాకి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కుమారి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్టు తెలిపారు.


