రుషికొండలో డీఐజీ పర్యటన
కొమ్మాది: తుఫాన్ నేపథ్యంలో రుషికొండ బీచ్ను డీఐజీ గోపినాథ్ జెట్టీ, అడిషనల్ ఎస్పీ మధుసూదన్తో కలిసి సోమవారం సాయంత్రం పర్యటించారు. పర్యాటకులు బీచ్కు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులను మైరెన్ పోలీసులు అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. పర్యటక ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు తుఫాన్ గురించి అవగాహన కలిగించాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూసుకోవాలని, తీర ప్రాంతాలకు ఆనుకొని నివాసాల్లో ఉన్న మత్స్సకారులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో మైరెన్ పోలీసులు సమన్వయంగా పనిచేసి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
వెలవెలబోయిన పర్యాటక ప్రాంతాలు
తుఫాన్ ప్రభావంతో సాగర్నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలు వెలవెలబోయాయి. ఎప్పుడు సందడిగా ఉండే ఈ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు లేక బోసిపోయాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ, తిమ్మాపురం, మంగమారిపేట, చేపలుప్పాడ, భీమిలి తీర ప్రాంతాల మత్స్యకారులు, పడవలు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు.


