
చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం
● నాడు ఎంతో ఆర్భాటంగా ప్రారంభం ● నేడు నిర్వహణలేక దీనావస్థ ● పట్టించుకోని దేవస్థానం అధికారులు
హైందవ సంప్రదాయం ప్రకారం జన్మనక్షత్రాలు, వాటి ప్రభావాలపై చాలా మందికి విశ్వాసం.
అందుకే నక్షత్ర ప్రభావ పరిహారం కోసం ఆయా నక్షత్రాలకు చెందిన వృక్షాలు/చెట్ల చుట్టూ, వాటి శ్లోకాలు పఠిస్తూ, ప్రదక్షిణలు చేస్తే మంచిదని చెప్తుంటారు. అలాంటి వారిందరికీ వీలుగా సింహగిరిపై 27 జన్మ నక్షత్రాలకు చెందిన చెట్లతో నక్షత్ర వనాన్ని 2021లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం కారణంగా నక్షత్ర వనానికి వెళ్లాలంటేనే భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తీరా అక్కడికి వెళ్లాక ఏయే నక్షత్రాల చెట్లు ఉన్నాయో.. ఏవి లేవో తెలియదు. ఉన్నా.. వాటి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయలేని దుస్థితి.
పూర్వవైభవం తీసుకురావాలి
నక్షత్రవనం అన్నిచోట్ల అందుబాటులో ఉండదు. అతి తక్కువగానే ఏర్పాటు చేస్తుంటారు. సింహాచలం క్షేత్రంలో నక్షత్రవనం ఉండటం స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఒక వరం. అంతటి విశిష్టమైన నక్షత్ర వనం దీనావస్థలో ఉండటం బాధాకరం. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు నక్షత్రవనాన్ని అభివృద్ధి చేసి, పూర్వ వైభవం తీసుకురావాలి.
– నారాయణరావు, అయ్యన్నపేట,
విజయనగరం
అన్ని వైపుల నుంచి వెళ్లేలా..
నేను కుటుంబ సమేతంగా సింహాచలం వచ్చాను. స్వామి ని దర్శించుకున్న తర్వాత నక్షత్రవనంలోకి వెళ్లేందుకు కొంత ఇబ్బందిపడ్డాను. ఏ వైపు నుంచి వెళ్లాలో తెలియని పరిస్థితి. కేవలం కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానికి వెళ్లినవారు మాత్రమే నక్షత్రవనంలోకి వెళ్లేందుకు వీలవుతోంది. గతంలో వలే అన్ని వైపుల నుంచీ నక్షత్రవనంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి.
– నాయుడు, గిరివిడి
సింహగిరిపై నక్షత్రవనం
సింహాచలం: సింహగిరిపై ఏర్పాటు చేసిన నక్షత్ర వనం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వనాన్ని నాలుగేళ్లకే మూలకు చేర్చారు. దేవస్థాన ఆదాయ మార్గాలపై ఆలోచించే అధికారులు.. అందుకు కాకులైన భక్తులకు తగిన సంతృప్తి, ఆనందాన్నివ్వడంలో మాత్రం అశ్రద్ధ చూపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి నక్షత్ర వనంలో చెట్ల చుట్టూ పెరిగిన తుప్ప లు, విరిగిన బోర్డులు నిలుస్తున్నాయి.
అర ఎకరంలో ఏర్పాటు
కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానికి శ్రీగోకులానికి మధ్య ఉన్న ఉన్న అర ఎకరం స్థలంలో 2021లో అప్పటి దేవదాయ శాఖ ఆదేశాల మేరకు నక్షత్ర వనం ఏర్పాటు చేశారు. 27 జన్మ నక్షత్రాలకి సంబంధించిన వృక్షాలను నాటి, పచ్చిక లాన్తో సుందరంగా తీర్చిదిద్దారు. ఏయే జన్మనక్షత్రం వారు ఏ వృక్షం వద్ద ప్రదక్షిణలు చేయాలో కూడా ఆయా వృక్షాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డుల్లో నక్షత్రం, వృక్షం, అధిదేవత పేర్లు, చేయాల్సిన ప్రదక్షిణలు, పఠించాల్సిన శ్లోకం, తద్వారా చేకూరే ఫలితాన్ని తెలుగు, ఒరియా భాషల్లో పొందుపరిచారు. కొండకు వచ్చే భక్తులకు నక్షత్రవనం గురించి తెలిసేలా వనానికి నలువైపులా పెద్దపెద్ద సూచిక బోర్డులు పెట్టారు. స్వామిని దర్శించుకున్న తర్వాత నక్షత్రవనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లేవారు.
ప్రస్తుత పరిస్థితి దయనీయం
నక్షత్రవనంలో ప్రస్తుతం కొన్ని జన్మనక్షత్రాలకు చెందిన వృక్షాలు కనిపించవు. కొన్ని వృక్షాల వద్ద బోర్డులు లేవు. ఉన్న బోర్డుల పరిస్థితి కూడా అధ్వానం. దీంతో నక్షత్రవనంలోకి వెళ్లిన వారు తమ జన్మనక్షగ్రానికి చెందిన వృక్షం ఏమిటో? ఎక్కడ ఉందో? తెలియక ఇబ్బందులు పడుతున్నారు. బోర్డు ఉండీ... వృక్షం లేకపోవడంతో కొందరు నిరాశగా వెనుదిరుగుతున్నారు. కొన్ని వృక్షాల వద్ద తుప్పలు పెరిగి, రాళ్లు, ముళ్లు గుచ్చుకోవడంతో ప్రదక్షిణలు చేయలేకపోతున్నారు.
వనంలోకి వెళ్లే మార్గం మూసివేత
నక్షత్రవనంలోకి వెళ్లేందుకు ఉన్న మార్గాన్ని కూడా మూడు నెలల నుంచి మూసేశారు. రాజగోపురం ఎదురుగా ఉన్న మార్గంలో భక్తుల రాకపోకలను నిషేధించారు. కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం వద్ద కూడా గేట్లు అడ్డంగా పెట్టేశారు. గతంలో ఆంక్షలు లేనప్పుడు రాజగోపురం ఎదురుగా ఉన్న మార్గంలో వెళ్లే భక్తులు, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు, ప్రసాదాలశాల, శ్రీగోకులం వెళ్లే భక్తులు నక్షత్రవనాన్ని సందర్శించేవారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల నుంచి భక్తులు వెళ్లలేని దుస్థితి నెలకొంది.

చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం

చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం

చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం

చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం

చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం

చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం

చుక్కలు చూపిస్తున్న సింహగిరి నక్షత్ర వనం