తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు అవుతోంది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. అయితే ఇందుకోసం దశాబ్దానికిపైగా మలిదశ పోరాటం జరిగింది. ఈ ఉద్యమంలో సబ్బండవర్గాలు భాగస్వాములయ్యాయి. పడుచు పోరగాండ్ల నుంచి పండు ముసలి వరకూ అందరూ జైతెలంగాణ అంటూ పోరాటంలో పాల్గొన్నారు. పలువురిపై కేసులు నమోదయ్యాయి. జైలుశిక్షలు సైతం అనుభవించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఉద్యమ జ్ఞాపకాలు కొన్ని..
తెలంగాణ తల్లి
పార్టీలకు అతీతంగా..
నిర్మల్: తెలంగాణ ఉద్యమంలో ప్రతిఒక్కరూ కలిసి వచ్చారు. నిర్మల్ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా జేఏసీ కార్యాచరణకు అనుగుణంగా ఉద్యమంలో భాగమై స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. – కూచాడి శ్రీహరిరావు,
డీసీసీ మాజీ అధ్యక్షుడు
స్వరాష్ట్రమొచ్చేదాకా..
నిర్మల్: ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు నడిపించాం. స్వరాష్ట్రం వచ్చేదాకా ఆపేది లేదంటూ ముందుకు సాగినం. నిర్మల్ ప్రాంతమంతా ఉద్యమంలో భాగమైంది.
– కొట్టె శేఖర్, రాజకీయ జేఏసీ కన్వీనర్
ఒకే వాదం..ఒకే నినాదం..
నిర్మల్: ఉద్యమ సమయంలో అందరిదీ ఒకటే వాదం, ఒకే నినాదం. డాక్టర్ దామెర రాములు, మేమందరం కలిసి తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆరో రాష్ట్ర మహాసభలు నిర్మల్లో పెట్టినం. – డాక్టర్ అప్పాల చక్రధారి
పలుమార్లు జైలుకెళ్లా..
ఆదిలాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నోసార్లు జైలుకు వెళ్లా. ఉద్యమకారుల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది. నీళ్లు, నిధులు, నియామకాలు సమపాలలో అందరికీ అందినప్పుడే ప్రత్యేక తెలంగాణకు సార్ధకత వస్తుంది. – చందు, ఉద్యమకారుడు
కేసులకూ భయపడలేదు..
నిర్మల్: ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా ముందుండి నడిచాం. ముధోల్ మండలం కిర్గుల్(బి)లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సభలో జై తెలంగాణ నినాదా లు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. – కూస వనిత, భైంసా
నిరవధికంగా దీక్షలు చేశాం..
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో 2010 జనవరి 4న జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభించాం. 2014 మార్చి 6 వరకు 1,523 రోజుల పాటు దీక్షలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ వేదికగా ఎక్కువ రోజులు నిరవధిక దీక్షలు
నిర్వహించిన చరిత్ర ఉంది. – కారింగుల దామోదర్


