breaking news
weekly plan
-
వందల మంది రాజీనామా..దెబ్బకి దిగొచ్చిన కంపెనీ..వారానికి 4 రోజులే పని!
కోవిడ్ మహమ్మారి ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పిచ్చింది. సుదీర్ఘమైన షిఫ్ట్లు, లే ఆఫ్లు, వేతనాల కోతలతో తమని కంపెనీలు వాడుకుంటున్నాయనే భావన నెలకొంది. అయితే ఇప్పుడు వైరస్ తగ్గుముఖం పట్టి వ్యాపారాలు పుంజుకోవడంతో కంపెనీలు ఆకర్షణీయమైన వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్న ఉద్యోగులు ఉండడం లేదు. రాజీనామా చేసి కొత్త మార్గంలో పని వెతుక్కునే పనిలో పడ్డారు. భవిష్యత్తును భద్రం చేసుకునేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగులు రిజైన్ చేశారు. చివరికి ఏమైందంటే. అమెరికా బ్యూరో ఆఫ్ ల్యాబర్ స్టాటిస్టిక్స్ వివరాల ప్రకారం..గతేడాది నవంబర్లో 4.5మిలియన్ల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఉద్యోగులకు రాజీనామా చేశారు. డిసెంబర్ నెల నుంచి ఈ ఏడాది మొత్తం వరకు 23శాతం మంది కొత్త ఉద్యోగులకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 'హెల్త్ వైజ్'ను దిగ్రేట్ రిజిగ్నేషన్ వణికిచ్చింది. అందులో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. అప్పుడే జూలియట్ షోర్ చేసిన రీసెర్చ్ ఆధారంగా..కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులు సంస్థను వదిలి పెట్టి వెళ్లి పోకుండా ఆపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టేలా చేసింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా? 'జూలియట్ షోర్' ఎవరు? బోస్టన్ కాలేజీలో జూలియట్ షోర్ ఎకనమిస్ట్ అండ్ సోషియాలజిస్ట్ విభాగంలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే జూలియట్ షోర్ లేబర్ ఎకనమిస్ట్పై చేసిన రీసెర్చ్లో భాగంగా 1990ల నుంచి ఉద్యోగులు,వారి విధుల గురించి పలు ఆసక్తికర విషయాల్ని గుర్తించింది. ఈ రీసెర్చ్లో జూలియట్ షోర్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ది గ్రేట్ రిజిగ్నేషన్ను అరికట్టేందుకు ఉద్యోగులు కోరుకున్న జీతాలు, డిజిగ్నేషన్తో పాటు పని దినాల్ని కుదించాలని, వారంలో 4రోజుల పాటు విధులు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయని గ్రహించింది. అందుకే తన నిర్ణయాన్ని హెల్త్ వైజ్ కంపెనీకి సూచించింది. అప్పటికే జూలియట్ షోర్ ప్రొఫెసర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, ఆథర్గా ఆమె రాసిన బుక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడంతో హెల్త్ వైజ్ ఆమె నిర్ణయాన్ని అంగీకరించింది. ప్లాన్ వర్కౌట్ అయ్యింది! గతేడాది ఆగస్ట్ నుంచి హెల్త్ వైజ్ సంస్థ జూలియట్ షోర్ చెప్పినట్లు వారానికి 4రోజుల పనిదినాలపై ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్లో ఉద్యోగులు పనితీరు బాగుంది. సంస్థకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఉద్యోగులకు ఎలా ఉపయోగపడింది? వారంలో 4రోజుల పనితో ఉద్యోగుల్లో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఒత్తిడి తగ్గడంతో ప్రొడక్టివిటీ పెరిగింది. ఎక్కువ గంటల పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. వారంలో మిగిలిన 3రోజుల పాటు ఉద్యోగులు వారి వ్యక్తి గత జీవితాల్ని కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నట్లు హెల్త్ వైజ్ సంస్థ గుర్తించింది. ఆ పని విధానాన్ని కంటిన్యూ చేయడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమైన వందల మంది ఉద్యోగులు తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు హెల్త్వైస్ సీఈఓ ఆడమ్ హుస్నీ వెల్లడించారు. చదవండి👉ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు! భారత్లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ! -
‘ఉపాధి’కి వీక్లీ ప్లాన్!
= డ్వామా అధికారుల ప్రత్యేక ప్రణాళిక = రోజూ 2 లక్షల మందికి ఉపాధి పనులు = మండలాల వారీగా లక్ష్యాలు = సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్లైన్ = నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు అనంతపురం టౌన్ : కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’లో వలసల నివారణ కోసం ‘ఉపాధి’ పనులు వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో లక్ష్య సాధన కోసం అధికారులు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా ‘వీక్లీ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ నెలవారీ లక్ష్యాలతో ముందుకు సాగిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు మరో నాలుగు వారాల్లో ప్రగతి సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. రోజుకు 2 లక్షల మందికి ఉపాధికల్పన జిల్లాలో 47,826 శ్రమ శక్తి సంఘాలుండగా 7,86,159 మందికి జాబ్కార్డులున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.461 కోట్లను ఖర్చు చేశారు. కోటి 50 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా, ఇప్పటికే కోటి 65 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. కరువు మండలాలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు అదనంగా కోటి పనిదినాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు అదనపు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు రోజూ వేలల్లో కూలీలు పనులకు వచ్చే వారు. అయితే ఇప్పుడు లక్షన్నర మంది పనుల్లో పాల్గొంటున్నారు. దీన్ని మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల రోజులూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రోజూ 2 లక్షల మందికి పని కల్పించాలి్సందేని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మండలాల వారీగా ‘వీక్లీ’ టార్గెట్లు : జిల్లా వ్యాప్తంగా అధికారులకు మండలాల వారీగా ‘వీక్లీ’ లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి మండలంలో 125 ఫారంపాండ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు 100, వర్మీకం పోస్ట్లు 100 పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు. రోజూ పంచాయతీకి కనీసం 300 మంది కూలీలను పనులకు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏరోజుకారోజు ప్రగతి వివరాలు సేకరిస్తూ నిర్లక్ష్యం గా ఉన్న అధికారులకు నోటీసులు చేస్తున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. అవసరమైతే విధుల్లోంచి తొలగించడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేస్తున్నారు. ‘ఉపాధి’ కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఉపాధి పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. డ్వామా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది పని చేస్తుంది. హెల్ప్ లైన్ నంబర్ : 18004258554. ఎక్కడైనా ఫీల్డ్ అసిస్టెంట్లు పని కల్పించని పక్షంలో ఈ నంబర్కు కాల్ చేయవచ్చు. వలస వెళ్లినట్లు తెలిస్తే చర్యలు జిల్లాలో ఉపాధి పనులను ఉద్యమంలా చేపడతాం. అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేసి వలసలు వెళ్లకుండా చూడాలి. ఎవరైనా ఉపాధి పనులు కల్పించలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వలస వెళ్లిన వారి ఫోన్ నంబర్లు మా వద్ద ఉన్నాయి. అలాంటి వారిందరికీ ఫోన్లు చేసి పిలిపించాలని ఆదేశించాం. వలసల నివారణే ధ్యేయంగా పని చేయాలి. పనులు చేసే చోట అన్ని సదుపాయాలు ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలి. కూలీల చెల్లింపులో సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావచ్చు. హెల్ప్లైన్ కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – నాగభూషణం, డ్వామా పీడీ