వాటర్షెడ్లో అవినీతి ఊట
► రాత్రిళ్లు యంత్రాలతో ... పగలు కూలీలతో పనులు ఉపాధికి అడ్డుపడుతున్న యంత్రాలు
తర్లుపాడు : అధికారం మనది అయితే కూలీల స్థానంలో యంత్రాలు వాడినా బిల్లులు వస్తాయనేది వారి ధీమా. అంతా అనుకున్నట్లుగా జరిగింది. పనులు వేగంగా చేసేందుకు ఉదయం కూలీలను పనులకు రప్పిస్తారు. రాత్రయ్యే సరికి యంత్రాలు రంగంలోకి దిగుతాయి. పనులను చకాచకా పూర్తి చేసేందుకు అనువుగా ప్రణాళికలు తయారు చేశారు. ఇదీ ఏదో ప్రైవేటు వ్యవహారం కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు వాటర్ షెడ్ పథకాన్ని ఏర్పాటు చేసింది. అయితే నిబంధనలకు నీళ్లు వదిలి వాటర్షెడ్ పనుల్లో అవినీతి ఊట సాగుతుంది. అధికారం ఉపయోగించి పనులు దక్కించుకున్న లబ్ధిదారులు యంత్రాలతో రాత్రుళ్లు పనులు చేయిస్తూ నామమాత్రంగా ఒకరిద్దరు కూలీలను పిలిపించి కూలీలతో పనులను చేయిస్తున్నట్లుగా ఫోటోలు చూపించి నిధులు స్వాహా చేస్తున్నారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు లేక, ఉపాధి పనులు లేక కూలీలు వలసబాట పట్టారు. అధికారులు మాత్రం మాముళ్ల మత్తులో కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ యంత్రాలతో పనులు చేయించినా బిల్లులు చెల్లిస్తున్నారు. 10 రోజులుగా తర్లుపాడు మండలంలో రైతు వారీ కుంటలను యంత్రాలతో చేయిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఉపాధి కూలీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వర్క్ ఆర్డర్ తెచ్చుకున్నటువంటి సర్వే నంబర్లలో కాకుండా ప్రభుత్వ భూములు, పొరంబోకు భూముల్లో పను లు చేయిస్తూ బిల్లులు చేయించుకుంటున్నారు. తర్లుపాడు చెరువు, అలుగు వైపు, ఈతచెట్ల వాగు, అంకాలమ్మ మాన్యం భూముల్లో ఇటీవల రైతు వారీ కుంటలను యంత్రాలతో చేశారు. గ్రామానికి చెందిన ఆవులమంద గంగమ్మ పొలంలో తమకు తెలియకుండానే అధికార పార్టీ నాయకులు పంట సంజీవని కుంటలను తీశారని వాపోతుంది. ఈ విషయంపై వాటర్షెడ్ అధికారులను వివరణ కోరగా పనులను పరిశీలించి యంత్రాలతో పనులు చేసినట్లు రుజువు అయితే బిల్లులు నిలుపుదల చేస్తామంటున్నారు.
మాకు తెలియకుండానే పొలంలో గుంతలు తీశారు: మాకు ఈతచెట్ల వాగు సమీపంలోని అంకాలమ్మ మాన్యంలో 3ఎకరాల పొలం ఉంది. ఇటీవల వర్షాలు లేక బీడు పెట్టాం. నాలుగు రోజుల కిందట గ్రామానికి చెందిన నాయకులు తమ పొలంలో ప్రొక్లెయిన్లతో గుంతలు తీయించారు. ఆవులమంద రమణయ్య