breaking news
Visam Ramakrishna
-
మంత్రిగారూ.. డిగ్రీ కళాశాల ఏదీ ?
నక్కపల్లి(పాయకరావుపేట) : పాయకరావుపేట నియోజకవర్గంలో గత విద్యా సంవత్సరంలోనే డిగ్రీకళాశాల ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభిస్తామని జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇచ్చిన హమీ ఏమైందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ ప్రశ్నించారు. ఏడాది ముగిసి రెండో ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా డిగ్రీ కళాశాలకు మోక్షం కలగలేదన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏడాది క్రితం ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విద్యా సంవత్సరంలోనే డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని, భవనాలు కూడా గుర్తించినట్టు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హమీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. నక్కపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, గొడిచర్లలో జూనియర్ కళాశాల, మత్య్స కారుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల, చినదొడ్డిగల్లులో అసంపూర్తిగా ఉన్న పీహెచ్సీని పూర్తిచేయడం, నక్కపల్లి 30 పడకల ఆస్పత్రిని 50 పడకల స్థాయి ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తామని, పాయకరావుపేట పట్టణంలో మెయిన్రోడ్డును విస్తరిస్తామంటూ హమీలు గుప్పించారన్నారు. వీటిలో ఏఒక్కటీ నెరవేరలేదన్నారు. ఈ ప్రాంతంలో డిగ్రీకళాశాల లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. రైన సదుపాయాలు లేక పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు కళాశాలల్లో వేలాది రూపాయలు వెచ్చించి డిగ్రీ చదవలేక చదువుకు మధ్యలో స్వస్తి పలుకుతున్నారన్నారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధిపనులు చేశామని ఉపన్యాసాలు ఇస్తున్న తెలుగు దేశం నాయకులు నెరవేరని ఈ హమీల గురించి ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు కావాల్సినవి ఇవేనన్నారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులతో రోడ్లు, పంచాయతీ భవనాలు, కాలువలు, అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని గొప్పలు చెబుతున్నారని వాస్తవంగా ఈ నిధులు కేంద్రప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా సంబంధం లేదన్నారు. డిగ్రీకళాశాల ఏర్పాటు చేసేస్తున్నామంటూ విద్యార్థులను మోసం చేశారన్నారు. నాలుగేళ్ల నుంచి వేలాది మంది విద్యార్థులు డిగ్రీకళాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
బాధితులకు ఏం పరిహారం ఇస్తారో చెప్పండి?
జన్మభూమిలో అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ నేతలు నక్కపల్లి: హూదూద్ తుఫాన్కు నష్టపోయిన రైతులకు, ఇతర బాధితులకు ప్రభుత్వం తరపున ఏ పరిహారం ఇస్తున్నారో చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు వీసం రామకృష్ణ అధికారులను నిలదీశారు. శనివారం నక్కపల్లి మండల కేంద్రంలో జరిగిన జన్మభూమి కార్యక్రమం వాడివేడిగా జరిగింది. ప్రత్యేకాధికారి శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు నాయకులు ఏకరువుపెట్టారు. తుఫాన్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఇళ్లు, ఉద్యాన వన తోటలు నష్టపోయిన వారికి ఇంతవరకు ఒక్కపైసా కూడా పరిహారం చెల్లించలేదని వీసం ఆరోపించారు. ఇళ్లకు, తోటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు పక్షపాతం చూపించారన్నారు. 90కి పైగా ఇళ్లు నష్టపోతే కేవలం 20కి మించి నష్టం వాటిల్లలేదని అధికారులు నివేదికలు తయారు చేసారన్నారు. ఇక తోటల విషయంలో ఎకరాకు 20కి మించి చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. గత ఏడాది మండలానికి మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లను అన్ని గ్రామాల్లోను పంపిణీ చేసి నక్కపల్లిలో ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్లు రద్దుచేశారంటూ పలువురు బాధితులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్లు, రేషన్కార్డుల కోసం వందలాది దరఖాస్తులు వచ్చాయి. పింఛన్లను సర్పంచ్ వీ సం వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శేషారత్నం, వీసం దేవి తదితరుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలువురు గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎంపిడీవో కృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకుడు వీసం నానాజీ, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, దేవవరపు శివ పాల్గొన్నారు.