breaking news
vineetha
-
ఏమంటావు?
‘‘వినీతా! ఓ నాలుగుసార్లు ఇంటికి రాగానే మనిషి ఎలాంటోడో తెల్సిపోడు...’’ అంటూ కూతురుకు ఇంకేదో చెప్పబోయాడు. తండ్రి మాటలకు అడ్డు పడుతూ వినీత, ‘‘డాడీ! ప్రాక్టికల్గా ఆలోచించు. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసే కాలం కాదిది. సుదీప్ నాకు ఇంజనీరింగ్ నుంచి తెలుసు. హాలిడేస్లో తప్ప మేము కలవని రోజులు తక్కువే. చివరి సెమిస్టర్లోనే మాది స్నేహం కాదు, ప్రేమ అని గ్రహించాం. చదువయ్యాక ఇద్దరం ఒకే కంపెనీలో ప్లేస్ కావాలనుకున్నాం. ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుసు. సుదీప్ నా కన్నా ఓపికవంతుడు కూడా. ఒక ఇంటివారమవడం తప్ప ఏ విషయంలోనూ మేం తక్కువ లేము. ఇంత పాజిటివ్నెస్ని వదిలి తెలియని ముఖాన్ని పెళ్లి చేసుకుని బతికే అవసరం నాకేముంది!’’ అంది. తండ్రీ కూతుళ్ల సంవాదం వినేందుకు భానుమతి పిల్లిలా హాల్లోకి వచ్చింది. భర్తను కూతురు నిలదీయడం చూస్తుంటే ఆమెకు లోలోపల ఎందుకో కొత్త కొత్తగా, ఆత్మతృప్తిగా ఉంది. మరి ఆయనకెలా ఉందో! గయ్యిమని లేస్తే ఎలా అనుకుంటూ కూతురు వైపు ‘నాన్నతో ఇంత వాదన పెట్టుకుంటావా’ అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది.నేలకేసి చూస్తూ ఆలోచనలో ఉన్నాడు సుగుణారావు. ‘ఎదిగిన కూతురు మాట వినాలా, నేను చూసిన వాణ్ణే పెళ్లి చేసుకోవాలి అని ఆంక్షలు పెట్టాలా’ అనే సందిగ్ధం ఆయన్ని పరీక్షిస్తోంది. సుగుణరావుకు జాతి పట్టింపులు ఎక్కువ. రూపురేఖలతో, పేర్లతో, మాటలతో ఎవరే ఇంట్లో పుట్టారో చెప్పగలడు. ఇదే అదునుగా తల్లి సమక్షంలోనే దాని క్లారిటీ కూడా ఇచ్చేస్తే ఓ పనైపోతుంది అనుకుంది వినీత.‘‘అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వచ్చాక క్యాస్ట్ ఫీలింగ్ చాలా తగ్గింది డాడీ! మా క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ ఎందరో కాలేజీలో ప్రేమించుకొని, జాబ్స్ వచ్చాక పెళ్లి చేసుకున్నారు. హాయిగా ఉంటున్నారు. ఇప్పటికి వాళ్ళు ఫ్రెండ్సా, మ్యారీడ్ కపుల్సా అన్నట్లు ఉంటారు. లక్కీ ఫెలోస్ కదా!’’ అంది భుజాలు ఎగరేస్తూ. వినీత మాటల ఘాటుకు మారిన సుగుణారావు బాడీ లాంగ్వేజీని గమనించినా, భానుమతికి ఎందుకో లేవాలనిపించలేదు. కూతురు ముచ్చట్లు ఆమెకు చాలా ముచ్చటగా ఉన్నాయి. వినీత ఇలాగే ఇంకా మాట్లాడితే బాగుండు అనుకుంది. కూతురు వాదన బేషుగ్గా ఉన్నా, నోరిప్పి ఓ మాట చెప్పే సాహసం మాత్రం తనకు చేతనవడం లేదు. ఉండబట్టలేక ‘మీ నాయన పోజు చూశావా’ అన్నట్లు కూతుర్ని చూస్తూ కళ్లతో సైగ చేసింది. భర్త అంటే భయం, బిడ్డ అంటే ప్రేమ– ఆమెకు రెండూ అపారమే! తండ్రీ కూతుళ్ల వాదన గాలివానలా కావద్దని ఉందామెకు. ఇద్దరి మధ్యన ఖాళీ త్రాసును సమానంగా పట్టుకొన్న న్యాయదేవతలా ఉంది తన పరిస్థితి.తండ్రి తల పైకెత్తకపోవడంతో వినీత ముక్తాయింపుగా ‘‘ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి డాడీ! కాలం మారుతోంది. మనమూ మారాలి అంతే. లేకుంటే పాచిపోతాం!’’ అంది. కిచెన్లోకి వెళ్లకుండా, ఇంకేమంటుందా అన్నట్లు కూతురు ముఖంలోకి ఆశగా చూస్తున్న భానుమతిని గమనించిన సుగుణారావుకు ఒళ్ళు మరింత మండింది. అసహనంతో మీ ఇద్దరికీ ఇదే నా సమాధానం అన్నట్లు హాల్లోంచి లేచి ముందు గదిలోకి వెళ్ళాడు. ముఖంలో వెనుకడుగు ఛాయలు కనబడకుండా చదివిన పేపర్నే తీసి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. భర్త తప్పుకోవడం చూసి భానుమతి వంటగది వైపు నడిచింది. ఎదిగిన ఆడపిల్ల మాటలే తల్లులకు కొండంత బలం అన్నట్లుగా ఉంది ఆమె నడక తీరు. అదే రూపం సుగుణారావుకు మరోలా కనబడింది. తల్లీ కూతుళ్లు ఒకరిపై ఒకరు నిలబడి తన కన్నా పొడుగైనట్లు తలెత్తి చూశాడు ఆమె వైపు.తండ్రితో ‘ఊ’ అనిపించడమెలాగో అర్థం కాక సోఫాలో అలాగే జారగిలబడి మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది వినీత. కొద్దిసేపు వాట్సాప్ మెసేజ్లు చూశాక ఒక్కసారిగా ‘‘మమ్మీ! నూన్ షోకి టికెట్స్ బుక్ అయ్యాయంట. లంచ్ చేసి నేను బయటికెళ్లాను’’ అంటూ మెట్లెక్కి పైనున్న బెడ్ రూంలోకి వెళ్ళింది.3 ఊర్లో వ్యవసాయం, రైస్ మిల్ నడిపిన సుగుణరావు రెండుసార్లు గ్రామ సర్పంచ్గా కూడా చేశాడు. మారిన రాజకీయ పరిస్థితులు, యువనేతల జోరుకు తట్టుకోలేక పదవులకు దూరం జరిగాడు. అమెరికాకు వెళ్లిన కొడుకు ఎం.ఎస్. చేసి, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కూతురుని చదివించి, మంచి ఇంటికి ఇచ్చి హాయిగా కాలం గడపాలని అనుకున్నాడు. అసలు ఊరు దాటాలనే ఆలోచనే ఆయనకు లేకుండేది. ఇంజినీరింగ్ చదువులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా వలసలు కలగలిపి ఆయన్ని నగరానికి సుడిగాలిలా నెట్టుకొచ్చాయి. ఊరికి రాకపోకలు సాగక భూమిని కౌలుకి, మిల్లును లీజుకు ఇచ్చి పిల్లలు చెప్పినట్లు రింగు రోడ్ పక్కన ఓ విల్లా కొనేసి బతుకును అందులో దించేశాడు. కాలం గడుస్తుంటే ఊరును తాను పట్టించుకోవడం మానేశాడా, లేక అక్కడి వాళ్లే తనను లెక్కలోంచి తీసేశారా అనే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఊరే మారింది. తనలా అంతో ఇంతో స్తోమత ఉన్నవారు పిల్లల వెంట వచ్చి హైదరాబాద్ చుట్టూ వాలిపోయారు. ఈ కాలం పిల్లలు జీవిత నిర్ణయాల్లో తల్లిదండ్రుల్ని వెనక్కి నెట్టేస్తున్నారని పొద్దునే బంధువు హనుమంతరావు నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అర్థమై చికాకును మరింత పెంచింది.ఊర్లో ఉన్న రోజుల్లో సుగుణరావు తన కూతుర్ని హనుమంతరావు కొడుక్కి ఇవ్వాలని అనుకునేవాడు. పిల్లాడు ఎక్కడ జారిపోతాడోనని ముందు జాగ్రత్తగా వారి కుటుంబానికి స్పెషల్ గౌరవమర్యాదలు ఇచ్చేవాడు. పక్కన పట్టణంలో మెడికల్ షాప్ ఉన్న హనుమంతరావు– ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా మొదలుపెట్టి నాలుగు లారీలు కొన్నాడు. చదువు వంటబట్టని ఆయన కొడుకు వ్యాపారం చూసుకుంటూ, ఎవరు భూమి అమ్మినా కొని ఆస్తులు పెంచుతున్నాడు. ఎప్పుడు ఊరికి వచ్చినా, పెద్ద కార్లో అమ్మా నాన్నలను వేసుకొని హంగామా చేసేవాడు. ఆ కారులో ఆయన పక్కన తన కూతురు కూచుంటే చూడాలని సుగుణరావు ఎన్నో కలలు కన్నాడు. తన నిర్ణయం సరైనదని గట్టిగా నమ్మాడు. తలవంచి తన నిర్ణయం వినవలసిన కూతురు ఇప్పుడు తనకే ఏదో తెలియంది నేర్పుతున్నట్లు, మీరీకాలంలో లేరన్నట్లు మాట్లాడుతుంటే జవాబు చెప్పలేకపోతున్నాడు. ఇదే ఊర్లోనయితేనా వినీతని, భానుమతిని కలిపి చెడామడా తిట్టేవాడు. కోపం తగ్గకపోతే అమ్మాయిని పెంచే విధానమిదేనా అని భానుమతిపై లేచేవాడు. అదేదీ సాగేట్లు లేదు. కుబుసం వదిలినట్లు తనలోంచి ఊరు సుగుణరావు వెళ్ళిపోతున్నట్లు ఆయనకే తెలుస్తోంది. మరోవైపు అమ్మాయి వాలకం చూస్తుంటే ‘నీవు ‘ఊ’ అన్నా అనుకున్నా, ఆ పిల్లాడితో ఎగిరిపోతాను’ అన్నట్లుంది. సిటీ గాలికి ఇలా నిమిత్తమాత్రుడిని అవుతానని ఆయన కలలో కూడా ఊహించలేదు. ఇంతలో అమ్మాయి మెట్లు దిగుతున్న చప్పుడు విని, పేపర్ను మరింత ముఖం మీదికి జరుపుకున్నాడు. డైనింగ్ టేబుల్ పైనున్నవి పళ్లెంలో వేసుకొని, గబగబా తింటున్న వినీత పక్కనే ఉన్న ఫోను రింగయింది.‘‘ఇదిగో.. వచ్చేస్తున్నా!’’ అంటూ లేచి, చేయి కడుక్కుని ఇద్దరినీ ఉద్దేశించి ‘బై బై’ చెప్పి బయటపడింది. ఆ లోపే విల్లా ముందు కారు ఆగిన చప్పుడైంది. పేపర్ పక్కకు జరిపి సుగుణరావు కారు వైపు చూశాడు. డ్రైవింగ్ సీట్లో సుదీప్ కనబడ్డాడు. వినీత ఆ వైపు నుంచి వెళ్లి కార్లో అతని పక్కన కూచుంది. ఒకవైపు వినీత తీసుకుంటున్న స్వేచ్ఛ గుచ్చుకుంటుంటే, మరోవైపు పొద్దునే ఫోన్లో హనుమంతరావు ‘మావాడు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దంటున్నాడు. జాబ్ మాన్పిస్తావా?’ అన్నమాట ఆయన్ని పూర్తి తికమకలో పడేసింది. తన ప్రశ్నకు సుగుణరావు నోట మాట రాకపోవడంతో జవాబు దొరికినట్లు హనుమంతరావు ఫోన్ పెట్టేశాడు. పరాభవంతో ‘ఛీ’ అనుకున్నాడు. తాను కట్టుకున్న ఆశాసౌధాలు కూలిపోతుంటే, మరోదారి లేక కూతురి కలల హర్మ్యాల్లోకి వెళ్లే తప్పనిసరి పరిస్థితికి సిగ్గనిపిస్తోంది. తన కన్నా తెలివి గల భార్య అని తెలిసినా కంటిచూపుతో నోరు మూయించినట్లు కూతురిని అదిమి పెట్టేందుకు తన అస్త్రాలు సరిపోవడం లేదు. పైగా కూతురు మాటలు చూస్తుంటే అన్ని నిర్ణయాలూ తీసుకుని, కేవలం ఆమోదముద్ర కోసం వేచి చూస్తున్నట్లు ఉన్నాయి.భార్య భోజనానికి పిలవగానే మౌనంగా తినేసి పైనున్న బెడ్ రూంలోకి వెళ్ళిపోయాడు. మెట్లెక్కుతున్న భర్త ఎప్పుడూ అంత నెమ్మదిగా కదలలేదు. ఎందుకోగానీ ఆయనలో ఈ కుంగుబాటు భానుమతికి బాధను కలిగించలేదు. నాన్న మాట వినమని కూతురుకు చెప్పాలని అనిపించలేదు. తలెత్తి ఆయన్నే చూస్తున్న ఆమె కళ్ళలో ఒక వెలుగురేఖ, ముఖంలో ఒక గెలుపు ఛాయ వాటంతట అవే వచ్చాయి. వాటిని ఆమె కూడా గమనించినట్లే లేదు. భర్త తిన్న పళ్లెం ముందుకు జరుపుకొని అన్నం కలుపుతుంటే భానుమతికి తన పెళ్లి రోజులు కళ్ల ముందుకొచ్చాయి. జీవిత భాగస్వామి ఎంపికలో వినీత సొంత నిర్ణయం చూస్తుంటే తన పెళ్లి విషయంలో తాను రాజీ పడక తప్పనిస్థితి గుర్తుకొస్తోంది.భానుమతి రంగు, ఎత్తు తక్కువుండే సాధారణ స్త్రీ. చదువుకొనే రోజుల్లో ఆమెను ఎవరూ పట్టించుకొనేవారు కాదు. వాటిని అధిగమించేలా పట్టుబట్టి డిగ్రీలో కాలేజీ టాపర్గా నిలిచింది. తన ప్రతిభను నిరూపించుకునేలా ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్న ఆకాంక్షను ఇంట్లోవారు ముందుకు సాగనీయలేదు. ఎదిగిన పిల్ల పెళ్లే పరమావధిలా ఇంట్లో ఒకటే సంబంధాల వెదుకులాట. పెళ్లి చూపుల ఏర్పాట్లు వరుసగా కొనసాగేవి. ఉద్యోగులెవ్వరూ భానుమతిని ఇష్టపడలేదు. ‘ఇక ఈ పిల్లనెవరు చేసుకుంటారు’ అని తల్లిదండ్రులు బెంగతో ఓ మెట్టు దిగి దగ్గరి పట్టణాల్లో ఏదో సొంత వ్యాపారం చేసుకుని బతికే కుటుంబాల్లో ప్రయత్నించారు. పట్టణాలు కూడా అందానికే పట్టం కట్టాయి. మరో మెట్టు దిగి గ్రామాల్లో ఉన్న బంధువులతో ఆరా మొదలుపెట్టారు. ఊరు పట్టుకొని ఉండే సుగుణరావుకు నచ్చిన అమ్మాయిలు ఈయన్ని మెచ్చలేదు. వయసు దాటిపోతోందని ఇంట్లోవారు పోరడంతో ఆయన భానుమతి మెడన మూడు ముళ్ళు వేశాడు. అప్పుడు గాని ఆమె తల్లిదండ్రుల గుండెల మీది కుంపటి చల్లారలేదు. జీవితమంటే భానుమతికి ఎన్నో ఆశలుండేవి. భర్త వెంట సినిమాలకు, షికార్లకు వెళ్లాలని కోరిక ఉండేది. పత్రికల్లో కథలు, నవలలు చదివిన యువతిగా తనకో ఊహల ప్రపంచముండేది. సుగుణరావుకు మాత్రం దాంపత్యమంటే ఒక ఆడ తోడు, ఆపై పిల్లలు, అంతే! దాన్ని దాటి ఆయనలో మరో ఏ కోణం భానుమతికి కనిపించలేదు. తన జీవితంలోకి వచ్చిన కొత్త మనిషి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి అనే ఆలోచన లేని మనిషిని తమ తిరుపతి యాత్రతో ఆమెకు స్పష్టమైంది. పెళ్లయిన కొత్తలో భానుమతి అడిగిందేమో మైసూరు, ఊటీ... ఆయనేమో పెళ్ళయితే వెంకన్న దర్శనం చేసుకుంటామని తల్లి మొక్కినందుకు మొక్కుబడిగా తిరుపతి తీసుకెళ్ళాడు. ఇక మరో ఆలోచన లేకుండా సుగుణారావు తనపై దయతో మూడు ముళ్ళు వేసిన మహానుభావుడు అని సర్దుకుంది. పిల్లలు కలిగి, వారు పెరుగుతుంటే ఆమె ప్రపంచం మరో రూపు దిద్దుకుంది. కుటుంబం ఎదుగుతుంటే తన ఆశలన్నీ తీరినట్లుగానే తృప్తి పడుతోంది. వంట గిన్నెలు సర్దినాక భానుమతి రోజుటిలా బెడ్ రూమ్లోకి వెళ్ళింది. భర్త ఆ వైపు తిరిగి పడుకున్నాడు. పక్కనే నడుం వాల్చిన ఆమె ఆలోచన కూతురు వైపు వెళ్ళింది. తనలా వినీత కూడా అందగత్తె కాదు. తన నోట్లోంచి వచ్చినట్లే కాకుండా తండ్రి నలుపుని కూడా పూసుకొని వచ్చింది. అయితే ఏనాడు తానెలా ఉన్నాను, ఇలా ఎందుకున్నాను అనే భావన కూతురులో లేశమాత్రం కనిపించలేదు. బుద్ధి తెలిశాక తన రూపానికి నప్పే డిజైన్ బట్టలు, హెయిర్ స్టైల్, ఫేషియల్ పట్టింపులతో చలాకీగా అందరిలో కలిసిపోయేది. రకరకాల ఆడ మగ ఫ్రెండ్స్తో సినిమాలు, షికార్లకు వెళ్ళేది. వినీత ఫ్రెండ్స్లోనూ అందం చందం ఎక్కువ తక్కువ ఉన్నవారిని తను చూసింది. సినిమా యాక్టర్లలా మెరిసిపోయేవారు కూడా ఉన్నారు. విచిత్రమేమిటంటే వారిలో ఆ పొగరు, స్పృహ కనబడేది కాదు. తమ ఫ్రెండ్స్లో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయి ప్రపోజ్ చేశాడని వినీత చెబితే ఆశ్చర్యపోయేది. ఇంత చక్కని పిల్లాడికి ఆ అమ్మాయిలో ఏం నచ్చింది అనిపించేది. ఆ అమ్మాయి కన్నా ఫలానా పిల్ల ఇంకా అందంగా ఉంది కదా మరి ఈ పిల్లను ఎందుకు ఇష్టపడ్డాడో అర్థం కాకపోయేది. అదే ప్రశ్న వినీతను అడిగితే ‘నీకేం తెలువదు’ అన్నట్లు నొసలు కొట్టుకునేది. వినీత ఫ్రెండ్స్తో పాటు సుదీప్ కూడా అప్పుడప్పుడు ఇంటికొచ్చాడు. సుదీప్ ఎత్తు, చక్కని వర్చస్సు గల అబ్బాయి. కావాలనుకుంటే తనకి వినీత కన్నా అందమైన అమ్మాయి భార్యగా లభిస్తుంది. కాని వినీత అంటే అతనికి ఎంతో ఇష్టం. ఇలా అందాన్ని దాటి తనకు అర్థం కాని శక్తి ఏదో యువతను ఒక్కటి చేస్తోంది అనుకుంది భానుమతి. అది తెలివా... చదువా... సంస్కారమా... ఏదైతేనేం ఆడపిల్ల పెళ్లి అనే తతంగం గుండెలపై కుంపటి కారాదు. ఇలా కొందరికైనా పెళ్లి చూపుల గంగిరెద్దు పాత్ర తప్పుతోంది. నచ్చలేదట అనే కుంపటి రాజేసే మాటల ఊసు లేదు. నూనూగు మీసాల ప్రేమలో అందానిదే పైచేయి. అది ప్రేమ కాదు మోహమే! అయితే, పై చదువులు, ఉద్యోగాల తర్వాత వివేచనతో కూడిన భాగస్వామి ఎంపిక ఓ పరిపక్వ ప్రక్రియ. సుఖ సంతోషాలతో బతకడమే కదా ప్రేమ పరమార్థం. దాన్ని వీళ్లు సాధిస్తున్నారు. అలా సాగుతున్న ఆమె ఆలోచనలు తానేదో గెలిచినట్లు కొత్త సంతృప్తిని ఇస్తున్నాయి. వారి దాంపత్య చరిత్ర చూస్తే ఒక్కసారి కూడా సుగుణరావు ఏ విషయంలోనూ భానుమతి అభిప్రాయాన్ని తీసుకోలేదు. మంచీ చెడూ చెప్పమనలేదు. అంతా ఆయన నిర్ణయమే సాగింది. పైగా ఆమెకేం తెలుసనే అలుసు. అందుకే ఈ రోజు కూడా తండ్రి కూతుళ్ల మధ్య ఆమె మౌన సాక్షిలా ఉండిపోయింది. కనీసం అమ్మాయి నిర్ణయంపైనైనా తల్లిగా తనను ఒక్కమాటైనా చెప్పనిస్తే బాగుండు అని ఆశ పడుతోంది. నిద్ర లేచిన సుగుణరావు కిందికి వచ్చి ముందు గదిలో కూచున్నాడు. టీ తీసికెళితే తల ఎత్తకుండానే పక్కన టీపాయ్ మీద పెట్టమన్నాడు. ఆయన ముభావం చూస్తుంటే అమ్మాయిని వారించేందుకు మాట సాయం చేయలేదని తనపై కినుక వహించాడా అనే అనుమానం భానుమతికి కలుగుతోంది. అయినా వినీత నిర్ణయానికి తానెలా వ్యతిరేకంగా మాట్లాడగలదు. ఇంతకాలం ఇంట్లో అన్ని నిర్ణయాలకు మౌనమే తన భాష అయినప్పుడు దీనికి కూడా మౌనమే తనకు నచ్చిన జవాబు అనుకుంది.ఇంటి ముందు కారు ఆగిన చప్పుడయింది. వెంటనే పేపర్ తీసుకుని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు సుగుణరావు.లోపలికి వస్తూనే వినీత తండ్రి చేతుల్లోంచి పేపర్ లాక్కుంటూ, ‘‘ఇంకా పేపర్ చదవడం అయిపోలేదా డాడీ!’’ అంది నవ్వుతూ.‘లేదు’ అన్నట్లు తలాడించాడు ముభావంగా. తండ్రిని కూల్ చేసేందుకు ఆయన పక్కన కూర్చుంటూ వినీత, సుగుణరావు తలను తనవైపు తిప్పుకొని ‘‘డాడీ! మీ రోజుల్లో ఆడపిల్ల ఇంటి గడప దాటి రాలేదు. పేరెంట్స్ కూడా తిరిగి తిరిగి వరుణ్ణి వెతికే వాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. లోకాన్ని అర్థం చేసుకుంటున్నారు. మాకు తెలియని రోజుల్లో మా కోసం సంబంధాల్ని వెదికారు. ఇప్పుడు లైఫ్ పార్టనర్ను పట్టుకోవడంలో మీకన్నా మేమే ముందున్నాం. కావాలంటే బోలెడు ఉదాహరణలు ఇస్తాను. సుదీప్ను కాదనడానికి మీరొక్క బలమైన కారణం చెప్పండి, లేదా సంతోషంగా ఒప్పుకోండి!’’ అంది. కూతురు ఎంత మొండిగా వాదిస్తున్నా, విషయాన్ని ఎంతో ఓపిగ్గా వివరిస్తూ తండ్రిగా తనకు ఇస్తున్న గౌరవాన్ని కాపాడుకొమ్మని సుగుణరావు మనసు గుర్తుచేస్తోంది. కూతురుతో ఇక వాదించలేక సుగుణారావు తల ఎత్తి భానుమతి వంక చూస్తూ, ‘‘ఏమంటావు?’’ అన్నాడు. ఇన్నేళ్ల బండరాయి మంచు గడ్డలా కరగడం ఇదే మొదటిసారి. ఈ ఒక్క ప్రశ్న చాలు, ఇంట్లో తానున్నానని గుర్తించడానికి. బిడ్డ భవిష్యత్తు విషయంలో తన మాటకూ విలువుందనడానికి. భర్త నోట ఆ పదాన్ని వినగానే బిత్తరపోయిన పరవశం నుండి భానుమతి కోలుకొని సరే అన్నట్లు తలాడించింది. భార్య కూడా కూతురు వైపే ఉన్నందుకు ఆయన చూపులో ఒక మెట్టు దిగిన ఓటమి కనిపించినా అది గమనించనట్లే భానుమతి నటించింది. మానై వంగుతున్న భర్తను విరక్కుండా కాపాడుకోవడం ఆమెకు తెలుసు.- బద్రి నర్సన్ -
వెంకటేష్తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రం చాలామంది చూసే ఉంటారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే, ఇందులో నేపాలి అమ్మాయిగా నటించిన టాప్ హీరోయిన్ 'వినీత' గుర్తుందా..? కథలో భాగంగా ఒకమారు వెంకటేష్ నేపాల్కు వెళ్లినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని ఆ నేపాలి అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆపై కథ అనేక మలుపులు తిరుగుతుంది. వినీత విషయానికి వస్తే.. 2003 వరకు సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఒక్కసారిగా చిత్రపరిశ్రమకు ఎందుకు దూరం అయింది..? మళ్లీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుందా..?ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు 'వినీత' పేరు బాగా పాపులర్. ముఖ్యంగా కోలీవుడ్లో ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో అక్కడి స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో మెప్పించింది. ఆపై మలయాళంలో కూడా మోహన్ లాల్ లాంటి హీరోతో నటించింది. ఆపై బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇలా వరుస విజయాలతో వెళ్తున్న వినీతకు 2003లో తగిలిన ఎదురుదెబ్బతో ఆమె ఇప్పటికీ కోలుకోలేదు. ఆ ఏడాదిలో కొందరి ఫిర్యాదుతో వినీతపై వ్యభిచారం కేసును పోలీసులు నమోదుచేశారు. తల్లి, సోదరుడితో కలిసి ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ, 2004లో ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు వెళ్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా కేసు నమోదు చేశారని కోర్టు తప్పుబట్టింది. ఆమెపై ఎటువంటి అభియోగాలు లేకుండా ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. అయతే, ఆమెకు జరగాల్సిన నష్టం అంతా ఇంతలోనే జరిగిపోయింది. విచారణ పేరుతో తనను మానసిక వేదనకు గురిచేశారని ఆ సమయంలో వినీత పేర్కొంది. సమాజంలో తన పేరును నాశనం చేసేలా పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె తెలిపింది. ఈ కేసు తర్వాత వినీతకు సినిమా ఛాన్సులు ఎవరూ ఇవ్వలేదు. తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినీ కెరీర్ను కావాలనే కొందరు నాశనం చేశారని ఆమె అభిమానులు పేర్కొన్నారు. సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఆమె చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పలు కథనాలు కూడా వచ్చాయి. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు పరిశ్రమకు దూరంగానే ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన రెండు, మూడు సినిమాల్లో మాత్రమే ఛాన్సులు వచ్చాయి. అవి కూడా సహాయక పాత్రలు మాత్రమే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన వినీత ఇలా చిన్న చిన్న పాత్రలలో ఆమె నటించడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే, వినీత ఇప్పుడు మరోసారి చిత్రపరిశ్రమలో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదురితే తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని ఆమె చూస్తున్నట్లు సమాచారం. -
BRS కౌన్సిలర్లకు ఊహించని షాక్
-
ఏడాదికి 5లక్షల ఆదాయం.. ఈ యువ రైతు గురించి తెలుసా?
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తనకున్న 6.5 ఎకరాల్లో ఏడాది పొడవునా బహుళ పంటలను సాగు చేస్తూ రూ. 5 లక్షల వరకు నికరాదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన యువ మహిళా రైతు పొంగి వినీత(20). అల్లూరి సీతారామరాజు జిల్లా బలియగూడ మండలం డుంబ్రిగూడ గ్రామంలో ఆమె ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు స్ఫూరినిస్తున్నారు. ఆమెకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘డాక్టర్ ఎం.వి.రెడ్డి ఉత్తమ రైతు పురస్కారా’న్ని ఇటీవల ప్రదానం చేసింది. అరకు మండలం కిలోగుడలో సంజీవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 15వ దేశీ విత్తనోత్సవంలో కూడా ఉత్తమ రైతుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సాగు పద్ధతులను తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలోని ఎర్ర నేలలో సార్వా, దాళ్వా, వేసవి సీజన్లలో వరుసగా భర్త బాలకృష్ణతో కలసి వినీత ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందుతుండటం విశేషం. కొండ వాగుల్లో నీటిని సేకరించి పంటలకు మళ్లించడం ద్వారా ఖరీఫ్తో పాటు రబీ, వేసవి పంటలను కూడా సాగు చేస్తున్నారు. వర్షాధారంగా వరి, గుళి రాగి పద్ధతిలో రాగులు, కూరగాయలు, పండ్లు, పూలు, చింతపండుతో పాటు కొద్ది సంఖ్యలో నాటుకోళ్లు, గొర్రెలు,మేకలను సైతం పెంచుతూ అనుదినం మంచి ఆదాయం పొందుతున్నారు. వినీత అన్ని పంటలకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలనే అవలంభిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ కషాయలను తయారు చేసి తమ పంటలకు వాడటంతో పాటు గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తున్నారు. పంట మార్పిడి ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఏడాది పొడవునా మూడు సీజన్లలోనూ అంతర పంటలు, బహుళ అంతస్తుల పంటలు సాగు చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదనతో పాటు గడ్డిని ఆచ్ఛాదనగా వాడుతూ నేల తేమను సమర్థవంతంగా సంరక్షించుకుంటున్నారు. చింతపల్లి, అనకాపల్లి ఆర్ఎఆర్ఎస్ల శాస్త్రవేత్తల సూచనల మేరకు జీవ నియంత్రణ పద్ధతులను అనుసరిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్టును పంటలకు వాడుతున్నారు. అంతర పంటల సాగును అనుసరిస్తారు. మొక్కజొన్న+ముల్లంగి, టొమాటో+ ముల్లంగి, పసుపు+అల్లం, బీన్స్+వంకాయ, కొత్తిమీర+టమోటాలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తున్నారు. టమోటా, కొత్తిమీర, ముల్లంగిని దశలవారీగా విత్తటం ద్వారా సంవత్సరం పొడవునా పంట దిగుబడి తీస్తున్నారు. ఏడాది పొడవునా ఆదాయ భద్రత ఒకటికి పది పంటల సాగుతో వ్యవసాయ భూమి నుంచి సురక్షితమైన ఆదాయాన్ని పొందడంలో వినీత విజయం సాధించారు. దేశీ వరి, కూరగాయలతో పాటు పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. మొత్తంగా 6.5 ఎకరాల ద్వారా సుమారు రూ. ఐదు లక్షలను ఏడాదికి సగటు నికరాదాయం పొందుతున్నారు. దేశీ వరిని వరుసలుగా విత్తటం, గుళి పద్ధతిలో రాగి నారు మొక్కలను నాటేసి సాగు చేయటం, అంతర పంటలు, మొక్కజొన్న ఇతర పంటలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయటం వినీత ప్రత్యేకత. పాత విత్తనాలనే వాడుతున్నాం. విత్తనాలను మునుపటి పంట నుండి సేకరించి తదుపరి సీజన్కు వినియోగిస్తాం. ఎక్కువగా దేశీ రకాలనే వాడుతున్నాం. సహజ పద్ధతిలో పండించిన నాణ్యమైన ఆహారోత్పత్తులను థిమ్సా ఎఫ్.పి.ఓ. ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్నందున మంచి ఆదాయం వస్తోంద’ని వినీత తెలిపారు. గత ఏడాది ఖరీఫ్లో 4.3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 2 ఎకరాల్లో వరి (దిగుబడి 32 క్విం./రూ. 26 వేల నికరాదాయం), అరెకరం మొక్కజొన్న (9 క్విం./రూ.12,500), ఎకరంలో రాగులు (7.5 క్విం./ రూ.11,500), అరెకరంలో టొమాటో (4.8 క్విం./రూ.4,200), 30 సెంట్లలో సామలను వినీత సాగు చేశారు. రబీలో 3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అరెకరంలో వరి (9 క్విం./రూ. 8,550 నికరాదాయం), అరెకరంలో మొక్కజొన్న (6 క్విం./రూ.8,000), ఎకరంలో టొమాటో (12.6 క్విం./ రూ.12,100), అరెకరంలో ముల్లంగి (1.25 క్విం/రూ.2వేలు), 30 సెంట్లలో పచ్చిమిరప, కూరగాయలను సాగు చేశారు. అదేవిధంగా ఎండాకాలంలో ఎకరంన్నరలో పంటలు సాగు చేశారు. 30 సెంట్లలో కొత్తిమీర, 20 సెంట్లలో ముల్లంగి, అరెకరంలో కూరగాయలు, అరెకరంలో టొమాటోలు సాగు చేశారు. ఎకరంన్నరలో బొప్పాయి, అరటి, అల్లం, పసుపు వంటి వార్షిక పంటలను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక పంటలు కాఫీ, మిరియాలు 40 సెంట్లలో సాగు చేస్తున్నారు. 30 పనస, 6 చింత చెట్లున్నాయి. అన్ని పంటలు, కోళ్లు, గొర్రెలు, మేకల ద్వారా ఏటా సగటున రూ. 5 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు వినీత తెలిపారు. -
శభాష్.. వినీత!
నంద్యాల, న్యూస్లైన్: ప్రతిభకు వికలత్వం అడ్డురాదని ఓ విద్యార్థిని నిరూపిస్తోంది. మాటలు రాకపోయినా క్రీడాపోటీల్లో రాణిస్తోంది. ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రన్నరప్గా నిలిచి తనకు సాటి ఎవరూ లేరని చాటింది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచింది. నంద్యాల పట్టణానికి చెందిన రమణారెడ్డి, నాగలింగేశ్వరిల కుమార్తె వినీత పుట్టు మూగ. వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలోని బధిర కళాశాలలో రెండో సంవత్సరం సీఈసీ చదువుతోంది. నంద్యాల పట్టణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చింది. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో ఏకైక బధిర విద్యార్థి వినీత కావడం గమనార్హం. కర్నూలు, వరంగల్, చిత్తూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులపై ఈమె విజయం సాధించింది. మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థినితో తలపడి ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. ఈ విద్యార్థిని గత ఏడాది వైఎస్సార్ జిల్లాలో బధిరులకు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ప్రతిభకనబరిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సలహాలతో తాను క్రీడల్లో రాణిస్తున్నట్లు వినీత తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తన ఆశయమని ఆమె పేర్కొన్నారు. తమ కుమర్తె క్రీడల్లోనే కాకుండా చదువులో ముందంజలో ఉందని తల్లిందండ్రులు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయని వారు వివరించారు. వచ్చే ఏడాది వినీతకు కేరళలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే విధంగా కృషి చేస్తామని రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కోచ్ మహేశ్వరరావు తదితరులు చెప్పారు.


