మద్యంపై వ్యాట్ ఎత్తివేత!
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలావరకు మద్యం ఉత్పత్తుల మీద వ్యాట్ ఎత్తేసింది. వైన్, బీర్, హార్డ్ లిక్కర్ మీద ఈ పన్నును తీసేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక శాఖను కూడా తనవద్దే ఉంచుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం నాడు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అందులోనే ఆయన ఈ చర్యల గురించి చెప్పారు.
మద్యం మీద విలువ ఆధారిత పన్ను ఎత్తేయడంతో పాటు తమిళనాడులోని 'అమ్మ క్యాంటీన్ల' తరహాలో 'నమ్మ క్యాంటీన్లు' ఏర్పాటు చేయనున్నట్లు కూడా సిద్దరామయ్య చెప్పారు. వీటిలో పేదలకు ఉదయం అల్పాహారం 5 రూపాయలకు, మధ్యాహ్న భోజనాన్ని 10 రూపాయలకు అందించనున్నారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ. 5080 కోట్లు కేటాయించారు. అన్నభాగ్య పథకం కింద రాష్ట్రంలో పేద కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న 5 కిలోల బియ్యం కోటాను 7 కిలోలకు పెంచారు. బడ్జెట్లో మొత్తం ఖర్చును రూ. 1.86 లక్షల కోట్లుగా అంచనా వేశారు.