breaking news
V. K. Sasikala
-
జయ, నేను స్నేహానికి ప్రతిరూపాలం!: శశికళ
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తాలూకు అనుమానాల నివృత్తి కోసం ఆమె నెచ్చెలి శశికళపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశముంది. మాజీ ఆరోగ్య మంత్రి సి.విజయభాస్కర్, శశికళ బంధువు, వైద్యుడు కేఎస్ శివకుమార్, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి జె.రాధాకృష్ణన్లపై కూడా దర్యాప్తు చేయాలని జస్టిస్(రిటైర్డ్) ఎ.ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ ప్రభుత్వానికి ఇంతకు ముందే సమర్పించిన ఈ నివేదికను.. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ద్వారా బహిర్గతం చేసింది డీఎంకే ప్రభుత్వం. అయితే.. దర్యాప్తు కమిషన్ తమ నివేదికలో పొందుపర్చిన ఆరోపణలను వీకే శశికళ తోసిపుచ్చారు. జయలలితకు యాంజియోగ్రామ్ అవసరం ఎప్పుడూ తలెత్తలేదని, చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి తాను ఎలాంటి అడ్డుపడలేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న శశికళ.. ‘‘జయ, నేను స్నేహానికి ప్రతీరూపాలం. మమ్మల్ని విడదీయడానికి చేసిన కుట్ర వాస్తవికతను అర్థం చేసుకోవడానికే మేము ఉద్దేశపూర్వకంగా విడిపోయాం. ఆ కుట్ర వెనుక ఉన్న పరిణామాలను అర్థం చేసుకున్నాకే నేను మళ్లీ జయ దగ్గరికి చేరాను’’ అని శశికళ పేర్కొన్నారు. ఇక జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదికపై శశికళ తరఫు న్యాయవాది రాజా సెంథుర పాండియన్ స్పందిస్తూ.. జయలలితకు అందిన చికిత్సతో శశికళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూర్తిగా డాక్టర్ల సమక్షంలోనే వైద్యం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎయిమ్స్ వైద్యులు జయలలిత ఆరోగ్యాన్ని చూసుకున్నారు. యాంజియోగ్రామ్ విషయంలోనూ ఆమె ప్రమేయం లేదు అని వెల్లడించారు. జస్టిస్ ఆర్ముగస్వామి సమర్పించిన నివేదికలో.. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామమోహనరావు, ఇద్దరు వైద్యులపైనా విచారణ జరిపించాలని సూచించింది. జయలలితకు చికిత్స జరిగిన అపోలో ఆస్పత్రి చైర్మన్ను విచారించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమని కమిషన్ అభిప్రాయపడింది. ఆరోగ్యంగా ఉన్న జయలలిత హఠాత్తుగా 2016 సెప్టెంబర్ 22న ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీనిపై, ఆమెకు చేసిన చికిత్సలపై, మరణంపై నిజానిజాలను నిర్ధారించేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటవడం తెల్సిందే. శశికళతో సత్సంబంధాలు నెరిపిన జయలలిత 2011 నుంచి ఏడాది పాటు ఆమెను తన నివాసం నుంచి గెంటేసిన అంశాన్ని కమిషన్ ప్రత్యేకంగా పేర్కొంది. ‘‘రాజకీయాల్లో కలగజేసుకోనని శశికళ లిఖితపూర్వక హామీ ఇచ్చాకే ఆమెను జయ మళ్లీ చేరదీశారు. జయ హృదయంలో సమస్య ఉందని, ఆమెకు శస్త్రచికిత్స అత్యావశ్యకమని అమెరికాకు చెందిన కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శమీన్ శర్మ జయను ఆస్పత్రిలో 2016 నవంబర్ 25న హెచ్చరించారు. కానీ, అంత ఇబ్బందేమీ లేదని బ్రిటన్కు చెందిన మరో డాక్టర్ వారించారు. ఆమెకు యాంజియోగ్రఫీ కూడా చేయకుండా ‘ఇంకెవరో’ అడ్డుకున్నారు. ఈ అంశంలో అపోలో ఆస్పత్రి డాక్టర్ హస్తముంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరు డాక్టర్లతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఒకే ఒక వ్యక్తి శశికళ’ అని నివేదిక బహిర్గతంచేసింది. ఆగస్ట్ 27న ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే. ఇదీ చదవండి: ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే! -
నోరు అదుపులో పెట్టుకోండి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, దానికి సంబంధించిన విషయాలను మరింత వివాదాస్పదం చేయడం సరికాదనీ, ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ తన కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తుండటంపై ఆవేదన, ఆగ్రహంతో ఆమె ఉత్తరం రాశారు. ‘మన కుటుంబంపై కేంద్రానికి ఇప్పటికే ఓ నివేదిక అందింది. దాని పర్యావసనమే ఐటీ దాడులు. హోంశాఖ తన నివేదికలో పేర్కొన్న అంశాలు నిజమన్నట్లుగా మీరంతా ఇలానే వ్యవహరిస్తే నేను జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత చనిపోయిన వెంటనే ఓ కేంద్ర మంత్రి తనకు ప్రీతిపాత్రమైన వారికి సీఎం పదవి కట్టబెట్టేందుకు యత్నించారని దినకరన్ ఇంతకుముందు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హోంశాఖ.. వెంకయ్య నాయుడే సదరు వ్యక్తి అని కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా శశికళ ఉత్తరం అందుకోవడం వల్లే కొత్త పార్టీ ఏర్పాటుపై దినకరన్ వెనక్కుతగ్గారని తెలుస్తోంది. -
శశికళకు వీఐపీ ట్రీట్మెంట్: భారీగా ముడుపులు!
బెంగళూరు: జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక సదుపాయాల కోసం రూ.2 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు ఎలాంటి ప్రత్యేక వంటగది వసతి కల్పించలేదని, కోర్టు ఉత్తర్వులు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలే ఆమెకు కల్పిస్తున్నామని చెప్పారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ డీ రూప.. డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. అయితే శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ అంటూ ఆ లేఖలో పేర్కొన్న ఆరోపణలను సత్యనారాయణ ఖండించారు. ముడుపులు తీసుకున్నట్లు డీఐజీ రూప స్వయంగా గుర్తిస్తే అప్పుడు ఈ విషయంపై చర్చించాల్సి ఉందన్నారు. నేనే డబ్బులు తీసుకున్నట్లు డీఐజీ రూప భావిస్తే నాపై విచారణకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. మరోవైపు ఏడాదిన్నర లీవ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన తనకు పరప్పన అగ్రహార జైలులో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిందని రూప చెబుతున్నారు. ఆ జైల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే విచారణకు ఆదేశించడమే ఏకైక మార్గమని రూప అభిప్రాయపడ్డారు. స్టాంప్ పేపర్ స్కాంలో ఇరుక్కుని జైలుశిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీమ్ తెల్గీకి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నట్లు జైళ్లశాఖ డీఐజీ రూప వివరించారు.