Tuni kapu garjana
-
రెండోరోజూ ఏడున్నర గంటల విచారణ
తునిలో కాపు ఐక్యగర్జన సమావేశం సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు రెండోరోజు బుధవారం దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించారు. ఉదయం 11.30 గంటలకు విచారణకని లోపలకు తీసుకెళ్లిన పోలీసులు.. రాత్రి ఏడు గంటల వరకు ఆయనను లోపలే ఉంచారు. అయితే అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారని, ఘటనతో ఏమాత్రం సంబంధం లేని తనను వాళ్లు ప్రశ్నించడానికి.. ఆ ఘటన జరిగిన రోజున చంద్రబాబు చేసిన ప్రకటనే కారణమని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మరోవైపు రాత్రికి రాత్రే భారీగా పోలీసు బలగాలను గుంటూరుకు తరలించడంతో భూమనను అరెస్టు చేస్తారన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన గుంటూరు లేదా రాజమండ్రిలో జరిగే విచారణకు రావాలంటూ ఇటీవలే సీఐడీ అదనపు ఎస్పీ భూమనకు నోటీసులు జారీచేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజు రాలేనని, మంగళవారం విచారణకు హాజరవుతానని భూమన పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు భూమనను తొలిరోజు మంగళవారం, తర్వాత మళ్లీ బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు విచారించారు. -
ఆరుగంటల పాటు భూమన విచారణ!
కాపు రిజర్వేషన్ల కోసం గడిచిన ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఐక్య గర్జన ఆందోళన కార్యక్రమం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో చోటుచేసుకున్న విధ్వంసకర ఘటనలపై ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను టార్గెట్ చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. తునిలో రైలు బోగీల తగులబెట్టిన సంఘటన జరిగిన వెంటనే అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఆ ఘటనలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేయించారంటూ ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఈ ఘటనల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలా ప్రకటించినట్టుగానే ఒక్కొక్కరిగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా ఆ చర్యలను ముమ్మరం చేసినట్టు స్పష్టమవుతోంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ పోలీసులు దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన గుంటూరు లేదా రాజమండ్రిలో జరిగే విచారణకు రావాలంటూ ఇటీవలే సీఐడీ అదనపు ఎస్పీ భూమనకు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజున హాజరుకాలేననీ, మంగళవారం విచారణకు హాజరవుతానని భూమన ఇదివరకే పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు భూమన మంగళవారం ఉదయం 11.30 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకోగా అప్పటి నుంచి సాయంత్రం దాదాపు 6 గంటల వరకు ఆ కార్యాలయంలో ఉంచి సీఐడీ అధికారులు విచారించారు. -
'ఓపిక, ఊపిరి ఉన్నంతవరకూ పోరాడతా'
తుని: ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాపులను బీసీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి 9వ షెడ్యూల్లో చేర్చమని పంపే హామీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుర్తులేదని కాపు ఉద్యమనేత, ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికలలో కాపు రిజర్వేషన్ను పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే చంద్రబాబు అందరిన్నీ ముద్దాయిలుగా చేస్తున్నారన్నారని మండిపడ్డారు. గత తుని కాపు ఐక్య గర్జన సంఘటన సమయంలో ప్రభుత్వం అమాయకులపై కేసులు బనాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో విషయంలో ముద్రగడ పద్మనాభం సోమవారం కాపు ఉద్యమ సోదరులందరికీ మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. తుని ఘటనపై తిరిగి పునర్విచారణ పేరుతో వందల మందిని కేసులలో ఇరికించడానికి ఇటీవల మనలో కొంతమందికి నోటీసులు పంపినట్టు మీడియా ద్వారా తనకు తెలిసిందని లేఖలో తెలిపారు. మీడియాలో అనుకూలంగా వార్తలు వస్తున్నాయని మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వం ఆంక్షలు కూడా మనకు తెలిసేందనన్నారు. కేసులో విషయంలో ఏ పోలీసు అధికారి విచారణ పేరుతో నోటీసులు పంపినా తీసుకోండి' అని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి ధైర్యంగా వెళ్లండి అని చెప్పారు. కొత్త పథకాల పేరుతో చంద్రబాబు మనల్ని మోసగించే ప్రకటనలు చేస్తున్నారనీ, వారి మాటలు అబద్దాలతో నడుస్తున్నాయన్న సంగతి గమనించండి' అంటూ ముద్రగడ సూచించారు. చివరికి బేడీలు వేయించి జైలుకు పంపినా సిద్ధపడండి' అంటూ లేఖలో తెలిపారు. కేసులకు భయపడడానికి మన సోదరలందరూ ముద్దాయిలం కాదూ.. సంఘవిద్రోహులం, తీవ్రవాదులం అంతకటే కాదన్నారు. తెలగ, బలిజ, ఒంటరి బిడ్డలమని పేర్కొన్నారు. ఎక్కడా కూడా పిరికితనం, భయం ఉండకూడదన్నారు. ఈ పోరాటంలో మీతోపాటే నేను కూడా ఉన్నాను' అని చెప్పారు. 'నన్ను నా కుటుంబాన్ని అవమానించడం వల్ల ఉద్యమం నుంచి తొలగిపోను. ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తాను. ప్రలోభపెట్టి, భయపెట్టి నానుంచి మిమ్మల్ని దూరం చేసినా ఉద్యమం నుంచి పారిపోను' అని స్పష్టం చేశారు. ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంతవరకూ జాతి కోసం పోరాడతాను అని మరోసారి చెబుతున్నానంటూ ధైర్యం చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం అందరం సైనికుల్లా పోరాడుదాం' అని ముద్రగడ పిలుపునిచ్చారు. దయచేసి పోలీసు విచారణ కోసం ఎవరూ, ఏ చోటికి హాజరైంది తేది, స్థలంతో పాటు, మీ పేరు, తండ్రి గారి పేరు, సెల్ నెంబరు, ఆధార్ కార్డు నెంబర్తో ఈ దిగువ తెలిపిన నెంబర్లకు నేను కోరిన సమాచారం యస్.ఎమ్.యస్. చేయండి. 98480 38888, 98482 77199, 98497 41777 మనలో చాలా మందికి వాట్సాఫ్ సౌకర్యం లేదు కావునా వారికి ఈ సమాచారాన్ని అందజేయడం అవసరమైతే ఈ సమాచారాన్ని మీరు తీసుకుని ఈ నెంబర్లకు పంపడం చేయమని ముద్రగడ కోరారు.