breaking news
temples bundh
-
ఆలయాల మూసివేత
సాక్షి నెట్వర్క్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలను బుధవారం మూసివేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి, పాతగుట్ట ఆలయాలను చంద్ర గ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటలకు మూసివేశారు. తిరిగి రాత్రి 9 గంటల తర్వాత తెరిచి సంప్రోక్షణలు గావించి మళ్లీ మూసివేశారు. అనంతరం తెల్లవారుజాము నుంచి యథావిధిగా నిత్య కైంకర్యాలు ప్రారంభం అవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, మంగళగిరి నరసింహాచార్యులు, అధికారులు రఘు, సింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఉదయం 7.30 గంటలకు మూసివేశారు. గురువారం ఉదయం 4.30 గంటలకు తెరువనున్నారు. ఆలయంలో సంప్రోక్షణ పూజ అనంతరం రోజువారీగా సర్వదర్శనం, ఆర్జీత సేవలు కొనసాగుతాయని ఆలయ ఇన్చార్జి ఈవో సోమయ్య తెలిపారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ తలుపులు బుధవారం ఉదయం 10.15 గంటలకు మూసివేశారు. అంతకుముందు వేకువజామున 3 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 9.15 గంటలకు తిరిగి తలుపులు తీసి గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నదీ జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవ పెరుమాళ్లకు, నిత్యకల్యాణ మూర్తులకు, ఆంజనేయ స్వామికి, పరివార దేవతలకు అభిషేకం జరిపించారు. అనంతరం ఆరాధన, దర్బార్ సేవ నిర్వహించారు. -
జూన్ 4 నుంచి ఆలయాలు బంద్!
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సమస్యలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2లోపు పరిష్కరించని పక్షంలో జూన్ 4 నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రాతఃకాల పూజలు చేసి ఆలయాలను బంద్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర దేవాలయ అర్చక, ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్కు నోటీసు ఇచ్చిన అనంతరం తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి, సమాఖ్య అధ్యక్షుడు ఉపేంద్రశర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, అర్చకులకు 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని గతంలో పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని అలా లేని పక్షంలో జూన్ 4 నుంచి బంద్ చేసి నిరసన తెలుపుతామన్నారు.