breaking news
Tarushi
-
ఫ్రెండ్స్తో డిన్నర్కు వెళ్లి.. బందీగా చిక్కి!
ఫిరోజాబాద్ (ఉత్తరప్రదేశ్): ఢాకాలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన తరుషి జైన్ (19) ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని తెలుస్తోంది. బీఏ ఎకనామిక్స్ స్టూడెంట్ అయిన ఆమె కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన బెకర్లీ కాలేజీలో చదువుతున్నట్టు సమాచారం. 2016లో ఈస్ట్రర్న్ బ్యాంకు లిమిటెడ్ (ఈబీఎల్) ఇంటర్న్షిప్ పథకానికి ఎంపికైన ఆమె తన ప్రాజెక్టులో భాగంగా ‘బంగ్లాదేశ్లో ఈబీఎల్ కామర్స్ వృద్ధి అవకాశాలు’ అంశంపై అధ్యయనం నిర్వహిస్తున్నది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ ఓ వస్త్రాల వ్యాపారి.. ఆయన ఢాకాలో నివాసముంటున్నారని తెలిసింది. శుక్రవారం స్నేహితులతో కలిసి తరుషి రెస్టారెంట్కు డిన్నర్కు వెళ్లిందని, ఆ రెస్టారెంట్లో ఉగ్రవాదులు ప్రవేశించడంతో ఆమె బందీగా చిక్కిందని ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లో ఉంటున్న ఆమె బంధవులు తెలిపారు. తరుషి మృతి గురించి మధ్యాహ్నం 3 గంటలకు తమకు సమాచారం అందిందని, ఆమె మృతి వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని బంధువులు చెప్పారు. కుటుంబసభ్యులంతా ఢాకా వెళ్లాలనుకుంటున్నామని, ఇందుకు విదేశాంగ శాఖ లాంఛనాలు పూర్తి చేస్తున్నదని తరుషి జైన్ కజిన్ సోదరుడు శిరిష్ తెలిపారు. -
బందీగా చిక్కిన తరుషిని చంపేశారు!
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో ఓ భారతీయ అమ్మాయి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఢాకాలో ఉగ్రవాదాలు తమ ఆధీనంలోకి తీసుకున్న హోలీ ఆర్టిసన్ బేకరీలో భారతీయ అమ్మాయి అయిన తరుషి జైన్ (19) చిక్కుకుపోయింది. ఆమెను బందీగా చేసుకున్న ఉగ్రవాదులు కిరాతకంగా హతమార్చారు. తరుషి జైన్ సహా తమకు బందీలుగా చిక్కిన మొత్తం 20మందిని ఉగ్రవాదులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. వీరందరూ విదేశీయులే. శుక్రవారం రాత్రి ఢాకాలోని ఆర్టిసన్ బేకరీలోకి చొరబడిన సాయుధ ఉగ్రవాదులు.. అందులోని వారిని బందీలుగా తీసుకొని నరమేధానికి దిగిన సంగతి తెలిసిందే. మృతుల్లో భారతీయ బాలిక తరుషి కూడా ఉందని, ఆమె మృతి బాధ కలిగిస్తున్నదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు. తరుషి తండ్రి సంజీవ్ జైన్తో మాట్లాడి.. తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశానని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి యావత్ దేశం అండగా ఉందని పేర్కొన్నారు. కాగా, 10 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్లో భాగంగా ఆరుగురు ఉగ్రవాదులను బంగ్లా భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న 13మందిని సురక్షితంగా రక్షించాయి. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కి సురక్షితంగా బయటపడిన 13మందిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అందులో ఒకరు జపనీస్ కాగా, మరో ఇద్దరు శ్రీలంక వాసులు.