యోగికి త్వరలో మరో బృహత్తర బాధ్యత!
లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ మరో బృహత్తర బాధ్యతను మోయనున్నారు. ఆయన బీజేపీ తరుపున ఇక కీలక ప్రచారకర్తగా మారనున్నారు. అవునూ! గుజరాత్ ఎన్నికల్లో యోగితోనే బీజేపీ కీలక ప్రచారం నిర్వహింపజేయాలని చూస్తోంది. ఈ విషయాన్ని ఆదివారం గుజరాత్లో ఆ పార్టీ అధ్యక్షుడు జితు వాఘాని నిర్వహించిన ఓ సమావేశం స్పష్టం చేస్తోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్లో 150 సీట్లను బీజేపీనే కొల్లగొట్టాలని చూస్తోంది. ఇందుకోసం ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది.
గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జితూ వాఘాని ఆదివారం స్థానిక సంస్థల చీఫ్లతోపాటు సౌరాష్ట్ర, రాజ్కోట్వంటి జిల్లాల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. వాఘాని భావ్నగర్ ప్రాంతానికి చెందినవ్యక్తికాగా.. సీఎం రూపానీ రాజ్కోట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతాలు కూడా బీజేపీకి అత్యంత కీలకమైనవి. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో 53 సీట్లు ఉండగా బీజేపీకి 35 స్థానాలు ఇప్పటికే చేతిలో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం అక్కడ కనీసం 40కి పైగా దక్కించుకోవాలన్నది బీజేపీ అజెండా. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా మాదిరిగానే యూపీ సీఎం ఆదిత్యనాథ్ను పార్టీ తరుపున స్టార్ క్యాంపెయినర్గా బరిలోకి దించాలని, దాంతో 150 సీట్లు కొల్లగొట్టొచ్చని బీజేపీ భావిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా స్పష్టం చేశారు.