breaking news
Sufficient Money
-
నిధుల సమస్య నో!!
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నేటి సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనుంది. నిధులపరమైన సమస్యలేమీ లేవని, బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయని సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ప్రశాంత్ కుమార్ తెలిపారు. ‘అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకున్నాం. మా ఏటీఎంలలో పుష్కలంగా నగదు నిల్వలు ఉంచాం. అలాగే, శాఖలన్నింటికీ తగినంత స్థాయిలో నగదు సరఫరా ఉంది. కనుక.. బ్యాంక్కు సంబంధించి నిధులపరంగా ఎలాంటి సమస్యా లేదు. ఇతరత్రా బైటి నుంచి సమీకరించాల్సిన అవసరమైతే లేదు. కానీ ఒకవేళ అవసరమైనా కూడా తక్షణం తగినంత స్థాయిలో నిధులను సమకూర్చుకోగలిగే మార్గాలు ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం మారటోరియం ఎత్తివేశాక.. ఖాతాదారులు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో నిర్దిష్ట పరిమితి రూ. 50,000 స్థాయిలో విత్డ్రా చేసుకున్న వారి సంఖ్య.. మొత్తం ఖాతాదారుల్లో మూడో వంతు మాత్రమే ఉండవచ్చని కుమార్ చెప్పారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ చీఫ్ అశుతోష్ ఖజూరియాతో పాటు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. 13 రోజుల్లోనే పరిష్కారం.. యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల తోడ్పాటుతో 13 రోజుల్లోనే సంక్షోభం పరిష్కారమైనట్లు కుమార్ చెప్పారు. యస్ బ్యాంక్ను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి 5న సుమారు నెల రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో రూ. 50,000కు మించి విత్డ్రా చేసుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటరుగా ఎస్బీఐ మాజీ సీఎఫ్వో ప్రశాంత్ కుమార్ను నియమించింది. మరోవైపు, బ్యాంకులోకి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు తీసుకుంది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం ఎనిమిది బ్యాంకులు యస్ బ్యాంక్లో రూ. 10,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అత్యధికంగా రూ. 6,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రికవరీపై ఆశలు... ముందు జాగ్రత్త చర్యగా సందేహాస్పద ఖాతాలన్నింటినీ క్యూ3 ఆర్థిక ఫలితాల్లో పొందుపర్చినందున యస్ బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కుమార్ చెప్పారు. మొండిబాకీలకు సంబంధించి ప్రొవిజనింగ్ను 42 శాతం నుంచి పెంచి.. 72 శాతం పైగా చేశామని, మార్చి త్రైమాసికంలో రూ. 8,500–10,000 కోట్ల దాకా రికవరీలు అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. డిపాజిట్లు, రుణాల్లో 60 శాతం వాటాను రిటైల్ విభాగం నుంచి రాబట్టాలంటూ తమ సిబ్బందికి సూచించినట్లు ప్రశాంత్ తెలిపారు. యస్ బ్యాంక్కు ప్రస్తుతమున్న మొండిబాకీల్లో 90 శాతం పైగా బాకీలు డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల్లో జతయినవే కావడం గమనార్హం. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 36,764 కోట్ల మేర మొండిబాకీలు పెరిగాయి. డిసెంబర్ క్వార్టర్లో స్థూల మొండిబాకీలు రూ. 40,709 కోట్లకు, ప్రొవిజనింగ్ రూ. 29,594 కోట్లకు పెరిగాయి. మరోవైపు, షేర్లపై లాకిన్ విధించడాన్ని సవాలు చేస్తూ రిటైల్ ఇన్వెస్టర్లు యస్ బ్యాంకు, ఆర్బీఐలపై కోర్టుకు వెళ్లనున్నారన్న వార్తలపై రజనీష్, ప్రశాంత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అలాగే ఇకపైనా పొదుపు ఖాతాలపై అధిక స్థాయిలో వడ్డీ చెల్లిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమివ్వకుండా దాటవేశారు. మరోపక్క, యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో 7.97% వాటా కొనుగోలు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ 7.97%, యాక్సిస్ 4.78 %, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.98 శాతం, ఫెడరల్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్ చెరి 2.39%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 1.99% వాటాలు కొనుగోలు చేశాయి. ఒక్క షేరూ విక్రయించం: రజనీష్ మూడేళ్ల లాకిన్ వ్యవధి పూర్తి కాకుండా యస్ బ్యాంకులో ఒక్క షేరు కూడా విక్రయించబోమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 42 శాతం వాటాలు తీసుకున్నామని, రెండో విడత ఫండింగ్లో దీన్ని 49 శాతానికి పెంచుకోనున్నామని ఆయన చెప్పారు. మూడో రోజూ షేరు జోరు... యస్ బ్యాంక్ షేర్ జోరు కొనసాగుతోంది. బ్యాంక్ రేటింగ్ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మూడీస్ అప్గ్రేడ్ చేయడంతో మంగళవారం యస్ బ్యాంక్ షేర్ 58% లాభంతో రూ.58.65కు చేరింది. ఇంట్రాడేలో 73% లాభంతో రూ.64కు ఎగసింది. 3 రోజుల్లో 134%లాభపడింది. -
స్థానిక సంస్థలకు డబ్బే డబ్బు!
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత నిధుల పండుగ కేంద్రం నుంచి విడుదల కానున్న వందల కోట్ల నిధులు కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు నిధుల పండుగ రాబోతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాక కాసులు గలగల్లాడనున్నాయి. పంచాయతీ సంస్థలకు ఎన్నికలు నిర్వహించనందున ఆగిపోయిన రూ.వందల కోట్ల నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కేంద్రం 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది డిసెంబర్లో రూ.489 కోట్లు విడుదలవగా, ఈ వారంలో మరో రూ. 516 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులొచ్చే సమయానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అవి స్థానిక సంస్థలకు సర్దుబాటు కాకుండా ఆగిపోయాయి. స్థానిక సంస్థలకు మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించని కారణంగా రూ. 2,900 కోట్ల నిధులు పెండింగ్లో ఉంటే.. ఇప్పటివరకు రూ. వెయ్యి కోట్లే విడుదలయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాక మిగిలిన నిధులనూ విడుదల చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి ఇంకా రూ. 1,900 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అయితే ఇందుకు ప్రస్తుతం విడుదల చేసిన నిధులు వ్యయం చేసినట్లు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. 13వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో గ్రామపంచాయతీలకు 70 శాతం, జిల్లా పరిషత్లకు 20 శాతం, మండల పరిషత్లకు పది శాతం నిధులు పంపిణీ చేస్తారు. ఈ నిధులన్నీ.. ఆయా జిల్లాల్లోని జనాభా ప్రతిపాదిక లెక్కన విడుదల చేస్తారు. ఇవి కాక వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు ఫండ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 462 కోట్లు రావాల్సి ఉండగా.. రూ.137 కోట్లే విడుదలవ గా.. ఇంకా రూ. 325 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈసారి ఆ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం లేదని పంచాయతీరాజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధులు కాక రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సంస్థలకు తలసరి గ్రాంటు కింద ఇచ్చే నిధుల్లో జిల్లా పరిషత్లకు ఒక్కరికి రూ. 4 లెక్కన జెడ్పీటీలకు రూ. 22.16 కోట్లు, మండల పరిషత్లకు రూ. 8 లెక్కన రూ. 44.32 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ. 4 లెక్కన రూ. 22.16 కోట్లు, సీనరేజి కింద జిల్లా పరిషత్ , పంచాయతీలకు చెరో రూ. 30 కోట్లు, మండల పరిషత్కు రూ. 50 కోట్ల నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ విడుదల చేసే రూ. 300 కోట్ల నిధులు అదనం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ నిధులు అందుబాటులోకి రానున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ వేతనం రూ.7,500: జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు రూ. 7,500, ఎంపీపీలకు రూ. 1,500, సర్పంచ్లకు రూ. 1,500 నెలసరి గౌరవ వేతనంగా ఇదివరకు నిర్ణయించినదే కొనసాగనుంది. జెడ్పీటీసీలకు రూ. 2,250 ఎంపీటీసీలకు రూ. 750 గౌరవ వేతనం ఇస్తారు. వీరికి సమావేశాలకు హాజరైనప్పుడు సిట్టింగ్ ఫీజు కింద రూ. 100 నుంచి రూ. 150 చెల్లిస్తారు.