breaking news
Shravan Friday
-
వేయి శుభముల వరము మీకు...
భక్తితో పూజిస్తే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కఠినమైన నిష్ఠలు, నియమాలు, మడులకన్నా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తాలే ముఖ్యం. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల సంపదలూ కలుగుతాయని ప్రతీతి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, ఆరోగ్య సంపద, జ్ఞానసంపద మొదలైనవి ఎన్నో.పూజను చక్కగా... భక్తి శ్రద్ధలతో చేసుకోవాలంటే ముందుగా పూజాద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మధ్య మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. పూజకు కావలసినవి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరొత్తులు, కర్పూరం, చిల్లరనాణేలు, తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడాకులు, పండ్లు, అమ్మవారి పటం లేదా ప్రతిమ, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో శుచిగా తయారు చేసిన నైవేద్యాలు (శక్తి కొలదీ చేసుకోవచ్చు) బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, ఆవునెయ్యి.శ్రావణమాసంలో ΄పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.వ్రత విధానంవ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన ముగ్గువేసి, కలశం పెట్టాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలను పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి పూజకు సిద్ధం కావాలి.గణపతి పూజఅదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలుంచాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. స్వామివారి ముందు పళ్ళు లేదా బెల్లాన్ని నివేదించి తాంబూలం సమర్పించాలి. అనంతరం నీరాజనం సమర్పించాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద ఉంచుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతాన్నిప్రారంభించాలి.కలశపూజకలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాఃమూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాఃకుక్షౌతు సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరాఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణఃఅంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాఃఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై చిలకరించాలి. పూజ చేస్తున్న వారు తమపైన చల్లుకోవాలి.అనంతరం పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఇంతకుముందు సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి పూజించి కుడిచేతికి తోరం కట్టుకోవాలి.వ్రత కథాప్రారంభంపూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ‘‘మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి’’ అన్నారు. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెబుతూ శివుడు పార్వతికి చెప్పిన ఆ వ్రత కథను ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గల యోగ్యురాలు. రోజూప్రాతఃకాలాన నిద్రలేచి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని భర్త, అత్తమామల సేవలో తరించేది.వరలక్ష్మీ సాక్షాత్కారంవరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో కనిపించి ‘ఓ చారుమతీ! ఈ శ్రావణ ΄పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను’ అంటూ పూజా విధానాన్ని చెప్పి అంతర్థానమైంది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా ΄పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.అనంతరం అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి రథ గజ తురగ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై ధరించాలి. ఆ తరువాత ముతై ్తదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి. పూజ చేస్తున్నంతసేపూ ప్రశాంత చిత్తంతో ఉండాలి. – డి.వి.ఆర్. -
Varalakshmi Vratham 2024: సిరి వరాలు
లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు పొందగలమనడంలో సందేహం లేదు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి, మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.సమకూర్చుకోవలసిన సామగ్రిపసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.వ్రత విధానంవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదాఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందనపూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయకగణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతంఅది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు. -
భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు
విజయనగరం కల్చరల్, న్యూస్లైన్: శ్రావణ రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం పది గంటల నుంచి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. సామూహిక కుంకుమార్చనలు, విశిష్ట కుంకుమ పూజలు, కుంకుమార్చనలు మహిళలు జరిపించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ ఆలయాన్ని పలురకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేకువజామున అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం విశేష కుంకుమార్చన జరిపారు. విశిష్ట కుంకుమార్చనలో 50 మంది దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి కలువ పువ్వులతో పూజలు జరిపారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.భాను రాజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు మూలా పాపారావు, ఏడిద వెంకటరమణ పూజా కార్యక్రమాలను జరిపారు. వేదపండితులు శంబర శంకరం, రాజేష్, సూపరింటిండెంట్లు సత్యనారాయణ, రామారావు పాల్గొన్నారు. శివాలయం వీధిలో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన సర్వకామదాంబ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనల్లో పాల్గొని పూజలు చేశారు. ఆలయ అర్చకులు చంద్రమౌళి విశ్వనాథ శర్మ పూజాకార్యక్రమాలు జరిపారు. కన్యకాపరమేశ్వరీ అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకులు ఆరవిల్లి ఉమామహేశ్వర శర్మ పూజాదికాలు జరిపారు. అలాగే మయూరి జంక్షన్లో ఉన్న సంతోషిమాత అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. స్థానిక మయూరి జంక్షన్లో ఉన్న సంతోషి మాత ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలంకరణ గావించారు. హంస వాహనంపై కలశాన్ని నింపి చేసిన దీపాలంకరణ కనువిందు చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాలు సాలూరు: టీటీడీ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్యామలాంబ ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. టీటీడీ జిల్లా రిసోర్స్పర్సన్లు ఉదాసీన స్వామిజీ, సోమనాథచారి భక్తులనుద్దేశించి మాట్లాడారు. పరమశివుని త్రిలింగ దేశంగా ప్రసిద్దికెక్కిన ఆంధ్ర రాష్ట్రన్ని ముక్కలు చేసి రాజకీయ లాభం పొందడానికి ప్రయత్నించడం అత్యంత దారుణమని అన్నారు. కేదరినాథ్ లాంటి ప్రళయాలను నివారించటానికి సమైక్యా భావనలే మార్గమని సూచించారు.