పంట బీమా సొమ్ముకు ఎసరు !
► రైతుల వివరాలు కోరిన ప్రభుత్వం
► తలమునకలవుతున్న బ్యాంకర్లు
► రుణమాఫీలో మరో కొత్త మెలిక
► రూ. 25.78 కోట్లు విడుదల
► అన్నదాతల్లో తీవ్ర ఆందోళన
రుణమాఫీ భారం తగ్గించుకునేందుకు యత్నం
రుణమాఫీ... ఈ మాట వింటేనే రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. రోజుకో మాట...పూటకో నిబంధన విధిస్తున్న సర్కారు చర్యలకు ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న రైతులకు ‘పంటబీమా’ రూపంలో మరో షాక్ తగలనుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతుల పేరున అరకొర వచ్చిన పంట బీమా సొమ్మును సైతం రుణమాఫీలో జమచేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి...
మచిలీపట్నం : రుణమాఫీలో మరో అంకానికి తెరలేచింది. రుణమాఫీ భారాన్ని మరింత తగ్గించుకునేందుకు ప్రభుత్వం పంటబీమా సొమ్ముకు ఎసరు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీని కోసం ఆయా బ్యాంకుల నుంచి ఏ రైతుపేరున ఎంత భూమి ఉంది, పంటబీమా సొమ్ము ఎంత వచ్చింది తదితర వివరాలు పంపాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. దీంతో ప్రభుత్వం కుటుంబానికి రూ.1.50 లక్షల రుణమాఫీలో నుంచి పంట బీమా సొమ్మును తగ్గించి రుణమాఫీ చేసే ఆలోచనలో ఉందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. రుణమాఫీకి సంబంధించి గతంలో 35 అంశాలలో వివరాలను పంపాలని ఆయా బ్యాంకులను కోరిన ప్రభుత్వం... తాజాగా మరో రెండు అంశాలను చేర్చి ఆ వివరాలను కూడా పంపాలని కోరినట్లు తెలిసింది. దీంతో రైతు పేరున వచ్చిన పంట బీమా సొమ్మును రుణమాీఫీలో జమచేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. వాస్తవానికి రైతులకు సంబంధించి పంటబీమా సొమ్ము సెప్టెంబరు నెలలోనే విడుదల కావాల్సి ఉందని ప్రభుత్వం ఈ సొమ్మును ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయాలని కోరడం... ఇన్సూరెన్స్
కంపెనీలు ఇందుకు నిరాకరించాయని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే పంటబీమా సొమ్ము విడుదల్లో జాప్యం జరిగిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కోరికను ఇన్సూరెన్స్ కంపెనీలు మన్నించకుండా నేరుగా రైతు ఖాతాలోనే పంట బీమా సొమ్ము జమ చేస్తామని ప్రకటించి గత నెల 19వ తేదీనే బీమా సొమ్మును విడుదల చేసింది. పంటబీమాకు సంబంధించిన నగదు ఆయా బ్యాంకులకు చేరి రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. ఈ తరుణంలో పంట బీమా వచ్చిన రైతు పేరు, అతని పేరున ఎంత భూమి ఉంది, పంట బీమా సొమ్ము ఎంత వచ్చింది తదితర వివరాలను పంపాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాలను ప్రభుత్వం అడగడంతో వీటిని పూర్తి చేసే పనిలో బ్యాంకు అధికారులు తలమునకలై ఉన్నారు.రుణమాఫీ సంగతేమో గానీ ఈ మాఫీ వ్యవహారం రోజుకో రకంగా విధిస్తున్న నిబంధనలు బ్యాంకులకు తలబొప్పి కట్టిస్తున్నాయని పలువురు బ్యాంకు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.
రూ. 25.78 కోట్ల పంట బీమా విడుదల....
2013 నవంబరులో సంభవించిన హెలెన్, లెహర్ తుపానుల ప్రభావానికి కురిసిన భారీవర్షాలు, ఈదురుగాలుల కారణంగా జిల్లాలో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రైతులు పంట రుణాలు తీసుకున్న సమయంలో పంటబీమా ప్రీమియం చెల్లించిన జాబితాలను అనుసరించి జిల్లాలోని 16 మండలాల్లోని 4,217 మంది రైతులకు రూ. 25.78 కోట్లు పంట బీమాగా మంజూరైంది. ఈ నగదు ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి బ్రాంచ్లలో ఉన్న రైతుల ఖాతాల్లోకి చేరింది. రుణమాఫీలో నుంచి రూ. 25.98 కోట్లను తగ్గిస్తారా లేక ఈ నగదును రుణమాఫీగానే జమ కడతారా అనే అంశంపై రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి 171వ చట్టాన్ని అనుసరించి బీమా సొమ్మును రైతులు తీసుకున్న రుణంలో నుంచి మినహాయించవచ్చుననే నిబంధన ఉందని, దీనిని సాకుగా చూపి రుణమాఫీలో ఎంతో కొంత వెసులుబాటు పొందేందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగించనుందనే వాదన అటు బ్యాంకు అధికారులు, ఇటు రైతుల నుంచి వినబడుతోంది.ప్రభుత్వం కోరిన విధంగా రైతుకు సంబంధించిన వివరాలు, పంట బీమాగా ఎంత నగదు వచ్చింది తదితర వివరాలు తయారు చేసేందుకు కొంత జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఈ వివరాలన్నీ వచ్చాకే రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా బుధవారం రుణమాఫీకి సంబంధించిన జాబితాలను బ్యాంకుల వద్ద ప్రదర్శించాల్సి ఉందని, ఇటీవల పంట బీమా సొమ్ము వివరాలు ప్రభుత్వం కోరడంతో మళ్లీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు జాబితాలను బ్యాంకుల వద్ద ప్రదర్శించే అవకాశం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పూర్తయ్యాక మళ్లీ ఎలాంటి అడ్డంకులు ప్రభుత్వం సృష్టిస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.