breaking news
Senior actors
-
మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా...
ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్ హీరో, ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ‘మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్పై ఓ లుక్ వేయండి.46 సంవత్సరాల తర్వాత... కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్హాసన్ చె΄్పారు.ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్హాసన్తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్ జెయింట్ మూవీస్–కమల్హాసన్ ప్రోడక్షన్ హౌస్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్లో ఊపందుకుంది.కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్తో ‘విక్రమ్’ వంటి హిట్ మూవీ తీశారు లోకేశ్. అలాగే రజనీకాంత్కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్. దీంతో కమల్–రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేశ్తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్ అవుతున్నారట.తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు. రజనీకాంత్–కమల్హాసన్ కాంబినేషన్కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్గా 46 సంవత్సరాల తర్వాత కమల్హాసన్–రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.పండక్కి వస్తున్నారు సిల్వర్స్క్రీన్పై ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, వెంకటేశ్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్గారు’. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్లో వెంకటేశ్ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. అలాగే చిరంజీవి–వెంకటేశ్–నయనతార– కేథరీన్ల కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.మరో మల్టీస్టారర్! మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ కాదు. దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పేట్రియాటిక్ మూవీలో...మలయాళ స్టార్ హీరోలు మోహన్లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని ‘పేట్రియాట్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మమ్ముట్టీ, మోహన్లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది.ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్ బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల లోకేషన్స్లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పఠాన్ వర్సెస్ టైగర్! షారుక్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్–షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి లీడ్ రోల్స్లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం.‘పఠాన్’, ‘టైగర్ 3’... ఈ రెండూ వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రానుందని, యశ్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ‘పఠాన్, వార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది.అలాగే ‘వార్’ సినిమా కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్లను ఒకే ఫ్రేమ్లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.17ఏళ్ల తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ల కాంబినేషన్లో బాలీవుడ్లో ‘హైవాన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్. తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్కు మోహన్లాల్తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్’లో మోహన్లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్లాల్నే ఎందుకు గెస్ట్ రోల్కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్గా ‘హైవాన్’ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’యే కావడం విశేషం. ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్’ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ సైతం ‘డాన్ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.మరి... రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్లు కలిసి ఒకే ఫ్రేమ్లో హిందీ సిల్వర్స్క్రీన్పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్కి ఏముంటుంది. ఇక ‘డాన్ 3’లో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్గా విజయ్ దేవరకొండ, విక్రాంత్ మెస్సే, అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ‘డాన్ 3’ చిత్రంలో ఎవరు విలన్గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్ 3’ చిత్రం థియేటర్స్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.కథే హీరో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేసిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్ రెడ్డి, ఉమా రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్కుమార్ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్. కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..
‘ఆయన స్ఫటికం’ అంటారు తనికెళ్ల భరణి. క్రిస్టల్ క్లియర్ అని. ఆ స్ఫటికంలో తనని తాను చూసుకున్నారు.తనని మాత్రమే కాదు..తనకో ఆదర్శాన్నీ.. తనకో అయ్యప్పనీ..తనకో గురువుగారినీ.. చూసుకున్నారు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాల్నితడికళ్లతో తడిమి తడిమి చూసుకుంటున్నారు.రాళ్లపల్లితో మొదలైన తనికెళ్ల ప్రయాణంలో..ఎన్నో మలుపులు..మరపురాని మరెన్నో తలపులు.చదవండి. సాక్షి ఎక్స్క్లూజివ్. రాళ్లపల్లిగారితో మీ పరిచయం గురించి..? తనికెళ్ల భరణి: అప్పుడు నేను హైదరాబాద్లోని రైల్వే కాలేజీలో చదువుతున్నాను. కాలేజీలో ఓ నాటకం వేయాల్సి వచ్చింది. ‘అద్దె కొంప’ అనే నాటకం. నేను రాసిందే. స్వీయానుభవాలతో రాసిన ఆ నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ దెబ్బతో మా చదువులు నాశనం. ఎప్పుడైతే నాటకం క్లిక్ అయిందో అప్పుడే సీతాఫల్ మండిలో ‘నవీన్ కళామందిర్’ అని ఓ నాటక సమాజాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అప్పుడు నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా నాటకానికి రాళ్లపల్లిగారిని పిలవాలనుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్లి జరిగి 14 రోజులే అయింది. మేం వెళ్లి ‘మీరు రావాలి సార్’ అన్నాం. ‘నాటకం కదా వస్తాను లే’ అన్నారు. ఆయనతో నా పరిచయం అదే. రాళ్లపల్లిగారు వస్తున్నారంటే ఒక ఉద్వేగం. స్టేజి మీద ‘ఇప్పుడు రాళ్లపల్లిగారు స్వగతంగా మాట్లాడతారు’ అన్నాను. ‘లేదు. ప్రకాశంగానే మాట్లాడతాను’ అని మొదలుపెట్టారాయన. ఆ తర్వాత నుంచి కాలేజీకి వచ్చిపోయేప్పుడు రాళ్లపల్లిగారింట్లో గడపడం అలవాటై అక్కడే ఉండిపోయేంతగా దగ్గరైపోయాను. నాటక రంగంలో అప్పటికే ఆయన పాపులరా? అవును. ఆయన అప్పటికే ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’ అనే ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నారు. ఆయనా బీకామ్ చదివారు. కానీ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్తో రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్కు వచ్చారు. నాకు తెలిసి అప్పట్లో సీతాఫల్మండి ప్రాంతంలో ‘అయ్యప్ప స్వామి’ గురించి ప్రచారం చేసినవారిలో రాళ్లపల్లిగారు మొదటివారు. అక్కడ ఓ తమిళియన్ ఉండేవారు. ఆయన శబరిమల వెళుతుండేవారు. అది తెలిసి ఈయన అయ్యప్ప గురించి చెప్పడం మొదలుపెట్టారు. రాళ్లపల్లిగారు 28సార్లు శబరిమల వెళ్లారు. ఆయన ద్వారా శబరిమలకు వెళ్లడం మాకూ అలవాటైంది. మా అనుబంధం ఎంత గాఢతను సంతరించుకుందంటే.. నేను నాటకాల్లో ఎక్కువగా నటిస్తున్నానని మా నాన్నగారు ఇంట్లో నుంచి గెంటివేశారు. అప్పుడు రాళ్లపల్లిగారి ఇంటికి వెళ్లాను. అక్కడే ఉండేవాణ్ణి. రాళ్లపల్లిగారి నాటకాలకి స్పందన ఎలా ఉండేది? విపరీతమైన ప్రేక్షకాదరణ ఉండేది. వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది కదా. అక్కడి నాటకాల అధినేత మంత్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రవీంద్రభారతిలో రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. చాలా కీర్తిప్రతిష్టలు వచ్చాయి. రాళ్లపల్లిగారు కన్యాశుల్కం, వరకట్నం వంటి నాటకాలు వేస్తే కచ్చితంగా వన్స్మోర్లు వచ్చేవి.ఒక మనిషి ఇంతలా ఓ పాత్రలో ఒదిగిపోగలరా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన నటించేవారు.ఆయన నాటక వైభవాన్ని చూశాం మేం. ప్రతి సంవత్సరం ఆయన నాటకం వేసేవారు. ఆగస్ట్ 15 ఆయన పుట్టినరోజు. ఆ రోజు ఓ పేద కళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆయన ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. 50 వేలు ఎలా? అప్పు చేసేవారో ఏమో కానీ 50 వేల రూపాయలు ఇచ్చేవారు. లాస్ట్ ఇయర్ దాకా ఇచ్చారు. ఆయన నాటకాలు తీసే విధానం చాలా గొప్పగా ఉండేదట? అవును. నాటకం చేస్తే ప్రాణం పెట్టేవారు. 5 గంటలకు అంటే సరిగ్గా ఆ టైమ్కే రిహార్సల్ మొదలుపెట్టాలి. అది కూడా ఒక వైభవంగా ఉండేది. సినిమా లెవల్లో ఉండేది. ఖర్చంతా ఆయనదే. అన్నీ లెక్క వేసి.. వెయ్యి రూపాయిలు ప్రొడక్షన్ వస్తుంటే ఖర్చు 3 వేలు ఉండేది. అయితే ఆయన దగ్గర నేను నేర్చుకున్నదేంటంటే ఎప్పుడైతే నాటకం ఇలా అయిపోయిందో, ఎప్పుడైతే ఆయన ఇండస్ట్రీకి వెళ్లారో నాటకానికి ఇంత ఖర్చు చేయడం అనవసరం అని నేను అనుకున్నాను. ప్రయోగాత్మకంగా ఐదు రూపాయలతో మొదలెట్టా. ఖర్చు తగ్గించా. మ్యూజిక్ తీసేశా. ఉధృతంగా, ఉద్యమంలా నాటకాలు వేసేవాళ్లం. రాళ్లపల్లిగారిని మీరు ఏమని పిలిచేవారు? గురువుగారూ అని పిలిచేవాణ్ణి. ‘ఏమయ్యా... భరణీ’ అనేవారు. గురువుగారి భార్యను ‘మాస్టారు’ అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఆమె టీచర్. వాళ్లది చాలా అన్యోన్యమైన దాంపత్యం. నిజం చెప్పాలంటే వారి ఇల్లు ఒక సత్రంలా ఉండేది. టిఫిన్లు.. భోజనాలు.. కాఫీలు.. టీలు ఇలా వచ్చినవాళ్లందరికీ సమకూరుస్తుండేవాళ్లు. నాటకాలంటే గురువుగారికి ఎంత మమకారం అంటే.. ఒకానొక దశలో వాటి కోసం అప్పులు చేయడం ప్రారంభించారు. ఏ స్థాయిలో అప్పులు అంటే.. ఆయన ఇంట్లో నుంచి ఓసారి ఓ సోఫాను నా కళ్లముందు నుంచి పట్టుకుపోయారు. డబ్బు కోసం ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డారు. ‘పర్లేదు.. గురువుగారూ.. మేం ఉన్నాం’ అని చెప్పేవాళ్లం. అయితే అప్పుడు మేం నిరుద్యోగులం. ఆయన నేతృత్వంలో నాటకాలు వేసేవాళ్లం. పరమ పరాకాష్ట ఏంటంటే... అప్పులవాళ్ల బాధ భరించలేక ఒకసారి ఇంటికి సైకిల్ మీద వచ్చి వెనక గుమ్మం మీద నుంచి దిగి మేడ మీదకు వచ్చి కోడిగుడ్డు సైజ్ దీపం పెట్టి... ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాశారు. దాదాపు మేం వందసార్లు ఆ నాటకాన్ని ప్రదర్శించాం. వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకుంది. అప్పుడు నాకు 25 ఏళ్లు ఉంటాయి. అందులో నేను 70 ఏళ్లకు పైబడిన మామ పాత్ర చేశాను. ప్రదర్శించిన వందసార్లూ ఆ పాత్ర వేయడం ఓ మరచిపోలేని అనుభూతి. మీ గురువుగారి సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి? ‘స్త్రీ’ అనే సినిమాలో చిన్న వేషం వచ్చింది. చిన్నదైనా సినిమాల్లోకి వెళుతున్నారంటే గొప్ప కదా. మేమంతా రాళ్లపల్లిగారిని సీతాఫల్ మండిలో రిక్షాలో కూర్చోబెట్టుకుని, మేం అటూ ఇటూ కూర్చొని, అదే.. మాకు మెర్సిడెస్ బెంజ్.. ఆయన్ను తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించాం. అమ్మగారి (రాళ్లపల్లిగారి సతీమణి) గురించి బాధపడవద్దు అని చెప్పాం. మీ గురువుగారితో మీరు పంచుకున్న ‘బెస్ట్ మూమెంట్స్’లో మరచిపోలేనివి ఏమైనా..? చాలా ఉన్నాయి. అప్పుడు నేను నిరుద్యోగిని. గురువుగారు సాంగ్ అండ్ డ్రామా కంపెనీకి సీతాఫల్ మండి నుంచి సైకిల్ వేసుకుని సోమాజిగూడ వెళ్లేవారు. వెళ్లేటప్పుడు నన్ను ముందు కూర్చోబెట్టుకుని పద్యాలు పాడుకుంటూ సైకిల్ తొక్కేవారు. సాయంత్రం నేను ఆయన్ను కూర్చోబెట్టుకుని సైకిల్పై సీతాఫల్ మండి నుంచి తీసుకొచ్చేవాణ్ణి. పేదరికం.. ఆ మధ్యతరగతి జీవితం.. ఇలా అన్నీ కలిసి ఎంజాయ్ చేశాం. ఈయనకు బేసిక్గా ఉన్న వ్యసనం, బలహీనత ‘దానం’ చేయడం. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే.. వంద రూపాయలు ఇవ్వడం దానం. 500 ఇవ్వడం అపూర్వం. కానీ వెయ్యి రూపాయలు దానం చేయడం అంటే.. అది గురువుగారే చేయగలరు. ఆయన శిష్యుల్లో ఎవరూ అలా ఉన్నదంతా దానం చేసేయకూడదని చెప్పలేదా? గొప్ప గొప్పవారు ఏదైనా చేస్తుంటే చూసి నేర్చుకోవాలి కానీ ఎందుకు అని అగడకూడదు. ఆయన తత్వం అది. ఊటీలో షూటింగ్ జరుగుతోంది ఓసారి. అప్పటికి ఆయన సినిమాకు పదివేల రూపాయలు పారితోషికం తీసుకునేవారు. ఆ షూటింగ్లో వందమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ చలికి వణికిపోతున్నారు. అది చూసిన రాళ్లపల్లిగారు చలించిపోయి తనకు రావాల్సిన డబ్బులను ముందుగానే నిర్మాత నుంచి తీసుకుని ఆ డబ్బులతో వారికి షాల్స్ కొని తీసుకువచ్చారు. ఇలాంటి ఓ వెయ్యి సంఘటనలను నేను చెప్పగలను. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఎన్నో దానాలు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. నాకు కోపం వచ్చేది. కానీ ఆయనకు దానం ఓ వ్యసనం. కర్ణుడిలా అన్నమాట. అప్పట్లో ఆటోవాళ్లు కొట్టుకునేవారు ఆయన్ను తీసుకెళ్లడానికి. మీటర్ 100 అయితే 500 ఇచ్చేవారు. ఆయన ‘స్ఫటికం’లాంటి వ్యక్తి. ‘క్రిస్టల్ క్లియర్’ అంటారు కదా అలా. డబ్బు ఉన్నా లేకున్నా ఆయన సంతోషానికి కొదవ ఉండేది కాదు. మా గురువుగారు ‘నిత్య సంతోషి’. మీ సినిమా కెరీర్... మీరు రచించి, రాళ్లపల్లిగారు నటుడిగా చేసిన సినిమాల గురించి? నేను చెన్నై వెళ్లినప్పుడు ఓ సందర్భంలో గురువుగారు దర్శకుడు వంశీకి నన్ను పరిచయం చేశారు. ఆయన నాకు కథ చెప్పి కొన్ని రోజులు టైమ్ ఇచ్చి ఏడు సీన్లు రాసుకుని తీసుకు రమ్మన్నారు. నేను చాలా స్పీడ్గా ఉండేవాణ్ణి. వంశీ ఉదయం చెప్పగానే నేను సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసేశాను. అయితే నా సినిమా కెరీర్ మొదలైంది సుమన్ నటించిన ‘కంచు కవచం’తో. ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాను. ఆ తర్వాత వంశీ ‘ఆలాపన, లేడీస్ టైలర్’.. చేశాను. ‘లేడీస్ టైలర్’ సూపర్ హిట్. అప్పట్నుంచి రైటర్గా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాళ్లపల్లి గారివి కూడా వీటిలో చాలా మంచి పాత్రలు.ఓ తమాషా సంఘటన చెబుతాను. వంశీగారి ప్రతి సినిమాలో రాళ్లపల్లిగారు ఉంటారు. ఓ సినిమా కథ రాస్తున్నప్పుడు ఓ పాత్రకు రాళ్లపల్లిగారి పేరు రాశారు వంశీ. ఆ పేరు కొట్టేసి నేను ఇంకో పేరు రాసి, వేరే పాత్ర (బోయవాడి)కు గురువుగారి పేరు రాశాను. అప్పుడు వంశీ ‘ఆయన ఇంట్లో ఉంటూ ఆయన తిండి తింటూ మీ గురువుగారి పేరు కొట్టేశావేంటి? ఆయనకు ద్రోహం చేస్తున్నావేంటి?’ అన్నారు. లేదు సార్.. ఆ వేషం బాగుంటుంది అన్నాను. ఆ పాత్ర గురువుగారికి నిజంగా మంచి పేరు తెచ్చింది. రాళ్లపల్లిగారు బాగా వంట చేస్తారట? అవును. వంట సంగతి అడిగితే ఓ సంఘటన గుర్తొచ్చింది. ఓసారి గురువుగారి భార్య పుట్టింటికి వెళ్లారు. రవీంద్రభారతిలో నాటకం అయిపోయి మేం ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. స్టవ్ ఉంది. బియ్యం కడిగాం. చూస్తే అగ్గిపెట్టె లేదు. ఎలాగా అనుకున్నాం. ఆయనకో అలవాటు ఉండేది. చెవిలో అగ్గిపుల్లలు పెట్టుకుని తిప్పేవారు. దాన్ని అలా పైకి విసిరేవారు. అది గుర్తొచ్చి అటకమీద చూస్తే రెండు అగ్గిపుల్లలు ఉన్నాయి. వాటిలో ఒకటి బాగుంది. ఒక్క అగ్గిపుల్లతో స్టవ్ వెలిగించాలి. వెలిగించలేకపోతే ఆ రోజు పస్తే. మీరు వెలిగించండి సార్ అన్నాను. నేను వెలిగించడం మిస్సయిందనుకోండి.. నా వల్ల పస్తు ఉండాల్సి వస్తుందేమో అని టెన్షన్. మొత్తానికి వెలిగించాం. ఆ రోజు భోజనం తిన్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. వంట అద్భుతంగా చేసేవారు. షూటింగ్లో ఈయన సీన్స్ ముందుగా తీసి, ఏదోటి చేసి పెట్టవయ్యా అనేవారు దర్శకులు. ఆయన ఇష్టాలేంటి? డప్పు బాగా కొట్టగలరు. సంగీతం బాగా వింటారు. పాటలు, పద్యాలు చాలా అందంగా పాడతారు. వంట చేయడం సరే సరి. వాటితోపాటు ఆయనకు ఎప్పటికైనా ఒక్క ఇంటర్నేషనల్ అవార్డ్ తీసుకోవాలనే కోరిక ఉండేది. మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శిష్యులను అడిగేవారా? ఏనాడూ అడిగింది లేదు. ఆ ఇంట్లో మనిషిగా నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే డబ్బు లేక నేను ఇబ్బందిపడతానని, ఫీల్ అవుతానని నేను నిద్ర లేవక ముందే నా వెనక జేబులోనో, పర్స్లోనో డబ్బులు పెట్టేవారు. (గద్గద స్వరంతో, చెమర్చిన కళ్లతో కాసేపు మౌనం). చెబితే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ నేను శబరిమల వెళ్తుండేవాణ్ణి. నా ముందు మా గురువుగారు ఉండేవారు. ఆయనే నాకు అయ్యప్పలా కనిపిస్తుండేవారు. ఏ మాత్రం కల్మషం లేని వ్యక్తి. ప్యూర్ హ్యూమన్. పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అనుకునేవారా? లౌకికం కొంచెం తక్కువ. ఎప్పుడైతే కూతురు పోయిందో డిటాచ్ అయిపోయారు. ఆ తర్వాత అంతా పరమేశ్వరుడే చూసుకున్నాడు. దైవ భక్తి చాలా ఎక్కువేమో? బాగా. 28 సార్లు శబరికి వెళ్లారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి ‘మహాతేజ’ అని పేరు పెట్టుకున్నారు. అంటే.. అయ్యప్ప పేరు. ఆ పేరుని నేను మా అబ్బాయికి పెట్టాను. పిల్లాడ్ని తీసుకెళ్లి ఆయన ఒళ్లో పడుకోబెట్టి ‘మీరే పిలవండి సార్’ అన్నాను. రాళ్లపల్లిగారి ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతింది? మీరు చివరిసారిగా ఎప్పుడు కలిశారు? కూతురు చనిపోయాక కుంగిపోయారు. 10 ఏళ్ల క్రితం కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. అయినా గమ్మత్తేటంటే పోయిన వారం ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. ఉదయాన్నే నిద్ర లేవడం ఆయనకు అలవాటు. గంధం బొట్టు పెట్టుకుంటారు. వారం క్రితం ఉత్సాహంగా మాట్లాడిన వ్యక్తి ఇలా హఠాత్తుగా దూరం అవుతారని అనుకోం కదా. ఈ బాధను మాటల్లో చెప్పలేను (చెమర్చిన కళ్లతో). మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగిన ఏదైనా ఓ సంఘటన గురించి? ఏదో ఫంక్షన్కి వెళ్లాం. నేను, నా ఫ్యామిలీ ఆయనతో పాటు వెళ్తున్నాం. మా పాప నోట్లో పాలపీక ఉంది. అది పడిపోయింది ఎక్కడో. ఇక గోల. పాలపీక కొనడానికి డబ్బులు లేవు. పీక పావలా అన్నమాట. పావలా కోసం ఇల్లంతా వెతికాను. ఆ తర్వాత గురువుగారే వెళ్లి ఓ ఫ్రెండ్ ఇంటి తలుపు కొడితే 20 రూపాయిలు ఇచ్చారు. పాల పీక కొని, మిగతా డబ్బుని అప్పటికప్పుడు ఖర్చు పెట్టేశారు. నటుడిగా మీ గురువుగారి దగ్గర మీరు పొందిన ప్రశంసలు? ‘ముగింపు లేని కథ’ నాటకంలో గురువుగారిది హీరో పాత్ర. ఇంకో వారంలో నాటకం వేయాలి. ఆయనకు సినిమా అవకాశం వచ్చి వెళ్లిపోయారు. నాటకానికి మళ్లీ రావాలి. అసలే కాంపిటీషన్. పోటీకి నాలుగు రోజులు ఉండగా టెలిగ్రామ్ పంపారు. ‘నేను రాలేపోతున్నాను. గాడ్ బ్లెస్ యు. బాగా చేయండి’ అని. నా గుండె ఆగిపోయింది. ఆ వేషం ఎవరు వేయాలి? అప్పుడు నా వేషం ఇంకొకరికి ఇచ్చి ఆయన పాత్ర నేను వేశా. అది నాకు పెద్ద చాలెంజ్. రాళ్లపల్లి గారి నాటకంలో ఆయనకే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. అంత పెద్ద పాత్ర ఎలా వేయాలా అని రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేసి వేశాను. బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ తీసుకెళ్లి ఇది నా తరఫున ‘గురుదక్షిణ సార్’ అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు.మామూలుగా శిష్యులకు పేరు వస్తుంటే కొందరు గురువులు అసూయపడతారు. అసూయ ఉండొచ్చేమో. కానీ ఆయన నా పట్లే కాదు ఎవరి పట్లా అసూయ పడేవారు కాదు. ఆయన మంచి రైజ్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని రికమండ్ చేస్తుండేవారు. రాళ్లపల్లిగారి జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఆయన పెద్ద కుమార్తె విజయ మాధురి మరణం. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయారట? ఆ అమ్మాయి డాక్టర్ చదువు కోసం రష్యాకు వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకూ ఫ్లైట్లో పంపించే స్తోమత ఆయనకు ఉంది. స్టూడెంట్స్ అందరూ ట్రైన్లో వెళ్తారు. పరిచయాలు అవుతాయని ట్రైన్లో వెళ్లింది. తనతో పాటుగా వాళ్ల మేనమామ వెళ్లారు. వరంగల్లో ఎక్కడో దిగిపోయారాయన. జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యే ముందే చనిపోయింది. కూతురి భౌతికకాయాన్ని చూసి, ‘నీ పుట్టుకకు, నీ చావుకి కారణం అయింది కూడా నేనే’ అంటూ చాలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ని చేయాలన్నది ఆయన కల. అందుకే రష్యా పంపించాలనుకున్నారు. కూతురి మరణం తర్వాత మానసికంగా కుంగిపోయారు. ప్రతి ఒక్కరికీ మానసికంగా.. ఎందుకు? ఎందుకు? అని డిప్రెషన్లో ఉన్న టైమ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ట్విస్ట్ వస్తుంది. గురువుగారి రెండో అమ్మాయికి పెళ్లి అయింది. కొడుకు లాంటి అల్లుడు దొరికాడు. అక్కడ నుంచి ఆయన మానసికంగా కొంచెం పుంజుకోవడం మొదలెట్టారు. అల్లుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. చిన్నమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటారు. అమ్మాయి వచ్చేసింది. అల్లుడు నాకు ఫోన్ చేసి, ‘నేను వచ్చే వరకూ ఉంచుతారా’ అని చాలా వేడుకోలుగా అడిగాడు. చాలా బాధ కలిగింది. అది గొప్ప విషయం కూడా. అలాంటి అల్లుడు దొరకడం అదృష్టం. అల్లుడి కోసమే గురువుగారి అంత్యక్రియలు 20న అనుకున్నాం. -
వారికి ‘పద్మశ్రీ’ లు రాకపోవడం దౌర్భాగ్యం
‘‘ ‘తెలుగు సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ మద్రాసులో ప్రారంభమైనా, హైదరాబాద్లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) గా అవతరించింది. సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి ఆధ్వర్యంలో ‘మా’కు అంకురార్పణ జరిగింది. గతంతో పోల్చితే ఇప్పటి ‘మా’ అసోసియేషన్ చాలా యాక్టివ్గా పని చేస్తోంది. సీనియర్ నటులను గౌరవించే మంచి సంప్రదాయాన్ని తీసుకురావడం అభినందనీయం’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. సీనియర్ నటీనటులు జమున, కైకాల సత్యనారాయణలను ఆదివారం ‘మా’ ఘనంగా సన్మానించింది. దాసరి నారాయణరావు వారిని సత్కరించి, జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం దాసరి మాట్లాడుతూ -‘‘మా’ తరఫున పదికోట్ల రూపాయలు నిధి కేటాయించి పేద కళాకారులను ఆదుకోవాలని అప్పటి ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ను కోరినా, అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ను ఇప్పుడు అదే కోరిక కోరుతున్నా. నేను దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో జమున నటించారు. ఆమె నిబద్ధత ఉన్న కథానాయిక. నేను దర్శకత్వం వహించిన 150 చిత్రాల్లో 75 సినిమాల్లో సత్యనారాయణ నటించారు. ఆయన చాలా చిత్రాల్లో విలన్గా నటించినా నేను తీసిన ఒక్క చిత్రంలో కూడా విలన్ పాత్ర చేయలేదు. పౌరాణిక పాత్రల్లో ‘నువ్వే నా శిష్యుడు’ అని సత్యనారాయణను ఎస్వీ రంగారావుగారు అనేవారు. జమున, అంజలీ దేవి, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి మహానటులందరికీ ‘పద్మశ్రీ’ అవార్డులు రాలేదంటే అది మన దౌర్భాగ్యం. ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించకుండా సిఫారసు చేసిన వారికే ఇటువంటి అవార్డులు ఇవ్వటం బాధాకరం. ముక్కూ మొహం తెలియనివాళ్లకి అవార్డులు ఇవ్వడం వల్ల వాటి విలువ పడిపోయింది’’ అని ఆగ్రహావేదనలను వ్యక్తం చేశారు. జమున మాట్లాడుతూ -‘‘నా యాభై ఏళ్ల నట ప్రస్థానంలో గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు ఎన్నో చూశా. కానీ, ‘మా’ కుటుంబ సభ్యుల మధ్య సన్మానం జరగడం ఆనందంగా ఉంది. మన కథానాయకులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుగారు మన కళ్ల ముందే మనల్ని వీడి వెళ్లారు. యువతరం నటులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధపెట్టింది. రాజేంద్రప్రసాద్, శివాజీరాజా డైనమిక్ లీడర్షిప్లో ‘మా’ కమిటీ మరిన్ని మంచి పనులు చేయాలి’’ అని చెప్పారు. సత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘సినిమా పూర్తయ్యాక సీనియర్లను పిలిచి ప్రివ్యూ చూపించే సంప్రదాయం గతంలో మద్రాసులో ఉండేది. సినీ పరిశ్రమ హైదరాబాద్కొచ్చాక ప్రివ్యూలు, సన్మానాలకు సీనియర్లను పిలవకపోవడం, గౌరవించకపోవడం బాధగా అనిపించింది. సీనియర్లను ‘మా’ గుర్తించి గౌరవించడం ఆనందాన్నిస్తోంది. ఇప్పటి వరకూ 772 చిత్రాల్లో చేశా’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా తదితర ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. గీతాంజలి, సంగీత, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, తనికెళ్ల భరణి, విజయ్ చందర్, శివకృష్ణ, నరేశ్, మాదాల రవి, కిరణ్, బెనర్జీ, తదితర సీనియర్ నటీనటులతో పాటు నేటి తరం ప్రముఖ తారలు మంచు విష్ణు, మంచు మనోజ్, శ్రీకాంత్, లక్ష్మీ ప్రసన్న, రాజేశ్వరి, హేమ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.