breaking news
sara prepared
-
జిల్లాలో మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా..
సాక్షి, కోదాడరూరల్ : ఇటీవల పలు చోట్ల మళ్లీ సారా తయారీ చేస్తున్నారు. గుట్టచప్పుడు కాకుండా ఏపీ నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సారా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా తయారయ్యే నాటుసారా వ్యాపారం పూర్తిగా బంద్ అయింది. అనుమానితులను ప్రభుత్వం, ఎక్సైజ్, సివిల్ పోలీసులు సారా తయారీ, విక్రయాలు జరపొద్దని స్టేషన్లకు పిలిచి హెచ్చరించారు. కొందరిని బైండోవర్ చేసి పూచీకత్తుపై వదిలేశారు. అయినా వినని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో భయడిన తయారీదారులు, బెల్లం వ్యాపారులు తమ వ్యాపారులను బంద్ చేశారు. పూర్తిగా దీనిపై ఆధారపడిన కుటుంబాలకు ఆసరాగా ప్రభుత్వం నుంచి ఉచితంగా రుణాలు కూడా అందజేశారు. దాంతో ఎక్కడా నాటుసారా వాసన లేకపోవడంతో పోలీసులు కూడా ఇటీవల పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా భావించి గతంలో ఈ వ్యాపారం రుచి చూసిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా సారాను తయారు చేస్తున్నారు. కోదాడ శివారు గ్రామాలు, తండాలు, హుజూర్నగర్ నియోజకవర్గంలోని కృష్ణపట్టె ప్రాంతాల్లో మళ్లీ ఎక్కువగా సారా తయారవుతుందని సమాచారం. గ్యాస్ పొయ్యిలపైనే తయారీ... అయితే గతంలో ఈ సారాను కట్టెల పొయ్యిపై కట్టెలు, టైర్లు వంటివి వేసి మంటతో తయారు చేసే వారు. ఇవి వాడితే విపరీతమైన పొగ వచ్చి ఎక్కడ సారా వండినా గుర్తు పట్టేవారు. దాంతో ఇప్పుడు తయారీ దారులు ఇంట్లోనే గ్యాస్ పొయ్యిపై బట్టీలను పెట్టి సారా తయారు చేస్తున్నారు. గ్యాస్ ఖర్చు ఎక్కువైనా సారా రేటు కూడా అధికంగా ఉండటంతో తండాలు, గ్రామాల్లో ఇదే విధంగా తయారు చేస్తున్నట్లు తెలిసింది. శివారు గ్రామాలు, తండాల్లో ఎక్కువగా.... ఎక్కువగా మారుమూల ఉన్న గ్రామాలు, తండాల్లో ఈ సారా తయారీ ఇటీవల ఎక్కువైంది. గతంలో సారా, నల్లబెల్లం వ్యాపారం చేసిన వారు ఇటీవల రంగంలోకి దిగినట్లు సమాచారం. మఠంపల్లి, గరిడేపల్లికి చెందిన బెల్లం వ్యాపారులు గతంలో సారా తయారు చేసే వారి ఫోన్ నంబర్లు తీసుకుని నల్లబెల్లం కావాలా అని ఫోన్ చేసి వారిని ఏపీ వారికి పరిచయం చేయడంతో వారే నేరుగా వచ్చి బెల్లాన్ని అమ్ముతున్నట్లు సమాచారం. గ్రామాలు, తండాల్లోని కొద్ది మందిని ఎంచుకుని వారికి రాత్రి సమయాల్లో నల్లబెల్లం సరఫరా చేస్తున్నారు. ఖరీదైన వాహనాల్లో రవాణా... ఇదివరకు బెల్లం, పటికను వ్యాపారులు ఆటోలు, టాటాఎస్ వాహనాల్లో తీసుకొచ్చి సారా తయారీ దారులకు దిగుమతి చేసేవారు. రాత్రి సమయాల్లో ఈ వ్యాపారం ఎక్కువగా కొనసాగడంతో పోలీసులు తనిఖీలు చేసే సమయంలో పట్టుబడుతున్నారు. దీంతో ఎవరికీ అనుమానం కలగకుండా ఖరీదైన కార్లలో రవాణా చేస్తున్నారు. నల్లబెలం రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇదివరకు 50 కేజీల నల్లబెల్లం బస్తా రూ.1400 నుంచి 1600 ఉండగా ప్రస్తుతం రూ.3500, పటికను కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఏపీ నుంచి భారీగా నల్ల బెల్లం ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రంలోకి భారీగా నల్లబెల్లం, పటిక సరఫరా అవుతుంది. ఇటీవల కోదాడ, హుజూర్నగర్లో పెద్ద ఎత్తున పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, విజయవాడ నుంచి రాష్ట్రం లోకి అక్రమంగా బెల్లాన్ని దళారులు రవాణా చేస్తున్నారు. మఠంపల్లి మండలం, చింతలపాలెం మండలాల్లో ఉన్న బల్లకట్టు నుంచి, కోదాడ మండల రామాపురం క్రాస్రోడ్డు నుంచి మాత్రమే ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గం ఉంది. అంటే దాదాపుగా ఈ మార్గాల గుండానే బెల్లం రవాణా అవుతుందని తెలుస్తుంది. రామాపురం క్రాస్రోడ్లో ఎక్సైజ్ చెక్పోస్టు పెట్టినా సిబ్బందిని నియమించకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఇక బల్లకట్టులు, మట్టపల్లి బ్రిడ్జి వద్ద కూడా చెక్పోస్ట్లు లేకపోవడంతో రవాణా సాగుతుంది. నిఘా తగ్గడంతో పెరిగిన తయారీ సారా తయారీపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు నిఘా పెట్టకపోవడంతో ఇటీవల తండాలు, పలు గ్రామాల్లో సారా తయారీ ఎక్కువైనట్లు తెలిస్తుంది. కోదాడ మండలం భీక్యాతండాలో చూస్తే తాగుడు అలవాటు ఉన్న కొందరు, వ్యాపారం చేసే మరికొందరు సారా బట్టీలను పెడుతున్నారు. వీరు రాత్రి సమయంలో బట్టీలు పెడుతున్నారు. కొద్ది మంది వారు తాగడానికి తయారు చేసుకుని మిగిలినది విక్రయిస్తున్నారు. మరికొందరు మాత్రం ద్విచక్రవాహన డిక్కీలు, ట్యాంక్ కవర్లలో పెట్టుకుని కోదాడ, హుజూర్నగర్లో విక్రయిస్తున్నారు. సీసా (650ఎంఎల్) సారాను రూ.150 విక్రయిస్తున్నారు. ఒక్క బీక్యాతండాలోనే కాకుండా పలు తండాలు, గ్రామాల్లో కూడా తయారు చేస్తున్నట్లు తెలిస్తుంది. సమాచారం ఇస్తే దాడులు చేస్తున్నాం... గ్రామాలు, తండాల్లో సారా తయారు చేస్తున్నట్లు సమాచారం వస్తే దాడులు చేస్తాం. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచా రం లేకపోయినప్పటికీ రొటీ న్గా దాడులు నిర్వహిస్తూనే ఉన్నాము. ఇటీవల కోదాడ, చిలుకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో దాడులు నిర్వహించి సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేశాం. – ఆర్.సురేందర్, ఎక్సైజ్ సీఐ, కోదాడ -
సారోదయం
బెల్టు తీయరు.. ఘాటు తగ్గదు - ధర్మవరం కేంద్రంగా సారా తయారీ - కామిరెడ్డిపల్లి తోటల్లో నాటు గుప్పు - అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవహారం - చూసీచూడనట్లుగా ఎక్సైజ్ అధికారులు - ఫలితాలివ్వని నవోదయం 65 - ధర్మవరం పంచాయతీలు 6 - మద్యం దుకాణాలు 90 - బెల్టు షాపులు 3 - నాటుసారా తయారీ గ్రామాలు ఈ ఫొటోలో కనిపిస్తున్న నాటుసారా బట్టీ ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లి గ్రామంలోనిది. ఓ టీడీపీ నాయకుడు తన తోటలో ఈ బట్టీ ఏర్పాటు చేసి సారా కాస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఆరేడు బట్టీలతో నిరంతరాయంగా సారా తయారీ సాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే సారాను తరలిస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం కావడంతో ఇక్కడ పోలీసు పికెట్ కొనసాగుతోంది. అయినప్పటికీ నాటుసారాకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ధర్మవరం: నవోదయం.. నినాదంగానే మిగిలిపోతోంది. మద్యం బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతాం.. నాటుసారా తయారీని సమూలంగా నిర్మూలిస్తామనే ఎక్సైజ్ శాఖ ప్రతిన నీరుగారుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా నాటుసారా ఏరులై పారుతోంది. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నాయకులు కొందరు ఆ దిశగా వ్యాపారం సాగిస్తున్నారు. సారా తయారీకి ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా మారింది. మండల పరిధిలోని కామిరెడ్డిపల్లి, ఓబుళనాయునిపల్లి, నేలకోట తండాలలో నాటుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా కామిరెడ్డిపల్లిలోని అధికార పార్టీ నేతలకు ఈ దందా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులు నామమాత్రం కావడంతో సారా తయారీకి అడ్డుకట్ట పడని పరిస్థితి. ధర్మవరం ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో గతనెల 19 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. 73 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. నాటుసారా కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో గొడవలు చోటు చేసుకుంటూ.. హత్యలకు దారి తీస్తున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. నవోదయం నామమాత్రమే? నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా తయారీని నిర్మూలించాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నాటుసారా తయారీ మొత్తం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండటంతో చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే అడపాదడపా తయారీ ప్రాంతాలకు వెళ్లడం.. అక్కడున్న తయారీ సామగ్రిని చిందవందర చేయడంతో మమ అనిపిస్తున్నారు. ఇదిలాఉంటే సారా తయారీ ప్రాంతానికి నలువైపులా ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. అరకిలోమీటరు పరిధిలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా అప్రమత్తం చేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే మండలాల పరిధిలోని దుకాణాల నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతోంది. నేతలకు ఆదాయమార్గం ప్రస్తుత కరువు పరిస్థితుల్లో మందుబాబులు వందల రూపాయలు ఖర్చు చేసి మద్యం సేవించలేక, నాటుసారాకు అలవాటుపడినట్లు తెలుస్తోంది. రూపాయి పెట్టుబడి పెడితే రూ.20 లాభం వస్తుండటంతో అధికార పార్టీ నేతలు కొందరు సారా తయారీని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కంపచెట్లలో నాటుసారాను తయారు చేసి అనంతపురం, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, బత్తలపల్లి మండలాల్లో విక్రయిస్తున్నారు. తయారు చేసిన సారాను అక్కడే ప్యాకెట్లుగా మార్చి, పాత ద్విచక్రవాహనాల్లో తరలిస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్, శారదానగర్, సుందరయ్యనగర్, గుట్టకిందపల్లి, కొత్తపేటల్లో, అనంపురంలో రాణినగర్, టీవీటవర్ కొట్టాల, రుద్రంపేట, లెనిన్నగర్లలో సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.