breaking news
Road-cum-rail bridge
-
‘కారు’ చిచ్చు
‘మారుతి’ నుంచి ఎగసిన కీలలు రోడ్ కం రైలు బ్రిడ్జిపై దగ్ధమైన వాహనం ఘటనతో స్తంభించిన రాకపోకలు రాజమహేంద్రవరం క్రైం : రోడ్డు కం రైలు వంతెనపై ప్రయాణిస్తున్న మారుతీ కారు నుంచి అకస్మాత్తుగా మంటలు రేగాయి. అంతెత్తున కీలలు ఎగసిపడుతూ వంతెనపై కారు తగలబడుతుంటే.. అటూ ఇటూ ఆగిపోయిన వాహనాల్లోని వారు భీతిల్లారు. దాదాపు గంటపాటు రాకపోకలకు అంతరాయంగా పరిణమించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆనాల వెంకట అప్పారావు రోడ్డుకు చెందిన వల్లభనేని శ్రీనివాసరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం. ఆయన మారుతి కారుకు క్లచ్ వైర్ కంప్లయింట్ రావడంతో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఎస్బీ మోటార్స్ వారికి ఇచ్చారు. సాయంత్రం మరమ్మతులు, సర్వీసింగ్ పూర్తి కావడంతో శ్రీనివాసరావు తరఫున బి.విజయ్ అనే వ్యక్తి కారును తీసుకొని గౌరీపట్నం బయలుదేరారు. బ్రిడ్జి మధ్యకు వచ్చేసరికి ఒక్కసారిగా కారు ఇంజన్ నుంచి మంటలు రేగాయి. దీనితో విజయ్ కారును ఓ పక్కకు తీసి, నిలిపారు. ఆగిన వాహనాల్లో బిస్లేరీ వాటర్ క్యాన్ల వ్యాన్ ఉండడంతో ఆ నీటిని చిమ్మి మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఇంతలో సమాచారం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు బాగా దగ్ధమైంది. టూ టౌన్ సీఐ కె.నాగేశ్వరరావు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
గట్టెక్కనున్న ‘వారధి’
⇒రోడ్డు కం రైలు వంతెనకు విరగడ కానున్న దశాబ్దాల దుస్థితి ⇒ పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు ⇒కోల్కతా నుంచి వచ్చిన మెట్ కో అధికారుల బృందం ⇒వారి నివేదిక ఆధారంగా రూపొందనున్న అంచనాలు సాక్షి, రాజమండ్రి : అరుదైన వారధిని దశాబ్దాలుగా పీడిస్తున్న గడ్డు సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. రాజమండ్రి-కొవ్వూరుల మధ్య గోదారమ్మకు చూడముచ్చటైన వడ్డాణంలా కనిపించే రోడ్డు కం రైలు వంతెన దుస్థితిని రాబోయే పుష్కరాలు గట్టెక్కించనున్నాయి. వాహనాలు ఏవైనా నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని ప్రయాసభరితంగా, చేదు అనుభవంగా మారుస్తున్న ఈ వంతెనకు ఆ పాడు కాలం విరగడ కానుంది. రోడ్డు కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయించడానికి ఆర్అండ్బీ శాఖ మార్గాన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే రైల్వే, ఆర్అండ్బీ శాఖల అభ్యర్థన మేరకు కోల్కతా నుంచి మెట్ కో అనే కంపెనీ ఉన్నతాధికారుల బృంద ం శుక్రవారం రాజమండ్రి వచ్చింది. వంతెన పరిస్థితిని ఈ బృందం రెండు రోజులు పరిశీలించి, నివేదికను ఆర్అండ్బీ శాఖకు అందచేస్తుంది. అనంతరం ఆ శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. నేటివరకూ తాత్కాలిక మరమ్మతులే.. రోడ్డు కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలంటే ప్రత్యేకంగా స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేసి, రోడ్డు భాగాన్ని పటిష్ట పరిచే చర్యలు చేపట్టాలి. కానీ అదనంగా గడ్డర్లు వేసేందుకు గతంలో రైల్వే శాఖ విముఖత వ్యక్తం చేసింది. 2005లోనే గడ్డర్లు వేసి మరమ్మతులు చేసేందుకు రూ.2.97 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. కొత్తగా గడ్డర్లు వేసేందుకు రైల్వే శాఖకు రూ.75 లక్షలు డిపాజిట్ చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు సిద్ధం అయ్యారు. కానీ రైల్వే శాఖ ఇందుకు నిరాకరించింది. దీంతో అప్పట్లో రూ.1.83 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కానీ అవి ఫలించలేదు. వంతెన 1974లో ప్రారంభం అయిన త ర్వాత 1995లో తొలిసారి మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తాత్కాలిక మరమ్మతులకే రూ.2.78 కోట్ల వరకూ ఆర్అండ్బీ అధికారులు వెచ్చించారని ఆ శాఖ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. కాగా గత ఐదేళ్లుగా వంతెన పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్డు భాగం పూర్తిగా పాడైపోయింది. దీంతో వంతెనపై ప్రయాణం నరక ప్రాయంగా తయారైంది. జాయింట్ల నడుమ ఎత్తుపల్లాలతో సమస్య వంతెనపై 35 క్రొకడైల్ జాయింట్లు ఉన్నాయి. వీటి మధ్యలో 400 సెకండరీ జాయింట్లు ఉన్నాయి. ఈ జాయింట్ల మధ్య ఎత్తుపల్లాలు ఏర్పడి వంతెనపై కుదుపులు పెరిగిపోతున్నాయి. కుదుపులకు లారీల భారం తోడై కాంక్రీటు భాగం రంధ్రాలు పడడం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. కోల్కతాకు చెందిన మెట్ కో వంతెనలకు గడ్డర్లు పంపిణీ చేయడంలో అనుభవమున్న కంపెనీగా అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ కంపెనీతో పరిశీలన చేయించాలని సిఫారసు చేసిన నేపథ్యంలో ముందుగా ఆ సంస్థ ఎరెక్షన్ ఇంజనీర్ రంజిత్ రాయ్, స్ట్రక్చర్ డిజైన్ ఇంజనీర్ నీల్కమల్ సర్కార్ వంతెనను పరిశీలిస్తున్నారు. అదనంగా గడ్డర్లు ఎలా అమర్చాలి, అవి ఎటువంటి డిజైన్తో ఉండాలి, వాటిని వంతెన కింద రోడ్డు కాంక్రీటు భాగంలో ఎలా అమర్చాలి అనే విషయాలను వీరు పరిశీలిస్తున్నారు. అలాగే కొత్తగా గడ్డర్లు లేకుండా కూడా శాశ్వత మరమ్మతులు చేయవచ్చా అనే అంశంపై కూడా వీరు దృష్టి సారిస్తారు. మూడు మాసాలు పడుతుంది.. మెట్ కో బృందం శుక్ర, శనివారాలు వంతెన పరిస్థితిని పరిశీలించి ఆర్అండ్బీ అధికారులకు నివేదిక ఇస్తుంది. గడ్డర్ల పరిమాణం, వాటి ధరలను అధికారులకు నివేదిస్తుంది. దీని ఆధారంగా అంచనాలు వేస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే పనులు చేపట్టిన మూడు నెలల్లో వంతెనపై గడ్డర్ల అమరిక పూర్తి కావచ్చని ఎస్ఈ మూర్తి పేర్కొన్నారు. రైల్వే శాఖ రోజుకు నాలుగు గంటలు మాత్రమే రైళ్లను గరిష్టంగా నిలుపు చేసేందుకు సమ్మతించిందని, దీంతో ఆ సమయాలతో తాము సమన్వయం చేసుకుని పనులు చేయాల్సి ఉంటుందన్నారు. -
వంతెనకు మళ్లీ కంత
రాజమండ్రి సిటీ :ఉభయ గోదావరి జిల్లాలను కలిపే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై మంగళవారం మరో రంధ్రం ఏర్పడింది. ఇది రోడ్లు, భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితమేనని చెప్పవచ్చు. బ్రిడ్జిపై గతనెల 9న 33వ స్తంభం వద్ద రంధ్రం ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆ రంధ్రానికి 20 అడుగుల దూరంలో మరో రంధ్రం పడేలా ఉందని గుర్తించినా అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే రంధ్రం పడక ముందే మరమ్మతులు చేయించకపోవడానికి రైల్వేశాఖ అనుమతి రాకపోవడమే కారణమని ఆర్ అండ్ బీ అధికారులంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.40 నుంచి 3.40 గంటల వరకు రోడ్డు వంతెన కిందనున్న రైలు వంతెన మీదుగా రైళ్ల రాకపోకలను నిలిపి వేయడానికి రైల్వేశాఖ అనుమతించింది. రైళ్ల కోసం ఏర్పాటు చేసిన హైటెన్షన్ లైనుకు సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో రంధ్రానికి మరమ్మతులు ప్రారంభించారు. మరమ్మతుల సమయంలో రైళ్లను గోదావరి రైల్వే స్టేషన్, మూడో రైలు వంతెన మీదుగా మళ్లించారు. కాగా వంతెన మీదుగా భారీ వాహనాల రాకపోకలను వారంరోజుల పాటు నిషేధించారు. ప్రస్తుతం మోటారు సైకిళ్ళు,ఆటోలు,చిన్నకార్లను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజమండ్రి వైపు నుంచి కొవ్వూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, బస్సులను రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుంచి వేమగిరి మీదుగా మళ్లించారు. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ వద్ద భారీ వాహనాలను నిలిపివేస్తున్నట్టు బోర్డు ఏర్పాటు చేశారు. రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై తరచూ రంధ్రాలు ఏర్పడడంతో ప్రయాణికులు కలవరపడుతున్నారు. బ్రిడ్జి నిర్వహణను నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇకనైనా నిర్వహణపై శ్రద్ధ వహించి, ఎలాంటి ఆపదా వాటిల్లక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.