ఎలుకల కోసం ఆస్పత్రి మూడు రోజులు మూత!
మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ ఆస్పత్రిలో ఎలుకలు రాజ్యమేలుతున్నాయి. వాటిని పట్టుకోవడం కోసం ఏకంగా మూడు రోజుల పాటు ఆ ఆస్పత్రిని మూసేస్తున్నారు. ఇప్పటికి ఆ ఆస్పత్రిలో దాదాపు 3,500 ఎలుకలను పట్టేశారు. అయితే.. ఇంకా దాదాపు 50 వేల వరకు మూషికాలు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో కిచకిచమంటూ తిరుగుతూనే ఉన్నాయి. భోపాల్ లోని మహారాజా యశ్వంతరావు ఆస్పత్రిని త్వరలోనే పూర్తిస్థాయిలో మార్చబోతున్నారు. దానికి ముందుగా మంగళవారం నాడు ఈ ఎలుకల నియంత్రణ కార్యక్రమం మొదలుపెట్టారు.
ఎలుకలు పట్టే కాంట్రాక్టును లక్ష్మీ ఫ్యుమిగేషన్ కంపెనీకి అప్పగించారు. ఈ కాంట్రాక్టు విలువ 54 లక్షల రూపాయలు!! ముందుగా 10వేల కలుగులను ఈ కంపెనీ గుర్తించింది. తొలిదశలో వాటివద్ద విషపూరిత ఆహారపు ఎరలు పెట్టారు. దాంతో 3,500 ఎలుకలను చంపగలిగారు. రోజుకు రెండుసార్లు ఈ ఎరలను మారుస్తూ ఉంచుతున్నారు. ఎలుకలు చాలా తెలివైనవి. పక్కజీవి ఏదైనా తిని చనిపోయిందంటే.. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ముట్టదు. అందుకే వాటికోసం మెనూ మారుస్తూ.. బెల్లం, సమోసాలు, కచౌరీలు, వేరుశనగ ఉండలు అన్నీ పెడుతున్నారు. ఇక రెండోదశలో వాటి కలుగుల్లోకి విష వాయువులను పంపుతారు. ఆ సమయంలో పేషెంట్లను ఉండనివ్వరు. అందరినీ బయటకు పంపేస్తారు. అలా.. ఎలుకలను పట్టాలని భారీ యజ్ఞమే తలపెట్టారు.