breaking news
rajiv yuva vikasam scheme
-
డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో..ఇక కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆర్థిక కటకట నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలు నిలిపివేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెలా ఖజానాకు వస్తున్న ఆదాయంతో అనివార్యంగా చేయాల్సిన ఖర్చుల సర్దుబాటు మాత్రమే జరుగుతోందని, ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్లాలనుకున్నా సాధ్యం కాలేదని, రైతు భరోసా నిధులు జమ చేసేందుకు మాత్రమే వెసులుబాటు దొరికిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కావాలంటే భూముల అమ్మకమే శరణ్యమని స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రమే.. ఖజానా లెక్కలు పరిశీలిస్తే.. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి నెలా ప్రభుత్వ సొంత రాబడులు రూ.12 వేల కోట్లకు మించడం లేదు. గత రెండేళ్ల గణాంకాలు పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్ నెలలో రూ.10,916 కోట్లు మాత్రమే పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో జీఎస్టీ కింద రూ.4 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,126 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,700 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.1,300 కోట్లు, కేంద్ర పన్నుల రూపంలో రూ.1,100 కోట్లు వచ్చాయి. వీటితో పాటు అప్పులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపినా మొత్తం రాబడులు రూ.16,473 కోట్లు మాత్రమే. ప్రతి నెలా ఖర్చు ఇలా.. ఖర్చుల విషయానికి వస్తే ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల వరకు రెవెన్యూ పద్దు కింద ఖర్చు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటు రూ.2 వేల కోట్ల వరకు అప్పులకు వడ్డీల కింద, దాదాపు రూ.4 వేల కోట్లు (తాజాగా ప్రకటించిన డీఏతో కలిపి) ఉద్యోగులకు వేతనాల కింద, రూ.1,500 కోట్లు పింఛన్ల కింద, రూ.2,500 కోట్ల వరకు సబ్సిడీల కింద, రూ.1000–1500 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సినవే. ఇవన్నీ కలిపి రూ.17 వేల కోట్లు దాటుతున్నాయి. అయితే ప్రభుత్వ రాబడులు (అప్పులతో కలిపి) ఇంతకంటే తక్కువే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొంచెం అటుఇటుగా ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇచ్చేటట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండటం గమనార్హం. కాగా రూపాయి అదనంగా ఖర్చు పెట్టాలన్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు కడుపు కట్టుకోవాల్సిందేనని, ఎప్పటికప్పుడు సర్దుబాటుకు మాత్రమే నిధులు సరిపోతున్నాయని, ఏదైనా పథకానికి డబ్బులు కావాలంటే రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హెచ్ఎండీఏపై ఆశలు..‘నియోపొలిస్’పై కన్ను ప్రస్తుత పరిస్థితుల్లో భూముల అమ్మకాల ద్వారా మాత్రమే అదనపు ఆదాయం వస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుడే లోటు రూ.9 వేల కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో ఇక, హెచ్ఎండీఏ మీదనే ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కోకాపేట్ నియోపొలిస్ భూముల అమ్మకాలను త్వరలోనే తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఐదు ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు అవకాశాలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు 18 హెచ్ఎండీఏ లేఅవుట్లలోని 2,414 ప్లాట్లు, ఉప్పల్ భగాయత్, తుర్కయంజాల్, ఇన్ముల్ నర్వలతో పాటు లేమూరు, కుర్మాల్గూడ, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల, ప్రతాప సింగారం, బహుదూర్పల్లి, పెద్ద కంజర్ల తదితర ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు అమ్మడానికి కూడా సర్కారు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 18 నెలల కాలంలో కనీసం రూ.12 వేల కోట్లను హెచ్ఎండీఏ భూముల అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని, నియోపోలిస్ భూముల అమ్మకాల ద్వారా మరో రూ.3 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అలా... అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పి పలు పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చేసరికి ఆదాయం పెరిగితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని, అప్పుల కిందే నెలకు రూ.6 వేల కోట్లు చెల్లించాల్సి రావడం వల్ల సంక్షేమ పథకాలకు నిధులు చాలడం లేదని అంటుండంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ల పెంపు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడాదిన్నర అయినా అమలు కాకపోగా... రైతుభరోసా కింద ఎకరాకు ఏటా ఇస్తామన్న మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదిండాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అది కూడా సక్రమంగా చెల్లించలేదని ఆరోపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ఐదు డీఏలు చెల్లించాల్సి ఉండగా, రెండింటికి అమోదం తెలిపి.. ఒక డీఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డీఏ ఆరునెలల తరవాత చెల్లిస్తామని చెప్పడం కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇక వేతన సవరణ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని ఉద్యోగులు వాపోతుండగా.. ఆదాయం పెరిగితే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బడ్జెట్ అంతరం ప్రస్తుత (2025–26) ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే సగటున నెలకు రూ.25 వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటి రెండు నెలల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే అది రూ.16,500 కోట్లు దాటలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, వాస్తవ రాబడులకు మధ్య దాదాపు రూ.8,500 కోట్ల మేర తేడా వస్తోందన్న మాట. గత అర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది ఎక్కువే. 2024–25లో ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకారం ప్రతినెలా సగటున రూ 23,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలి. కానీ సగటున రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకే రాబడులు వచ్చాయి. అంటే ప్రతినెలా సుమారు రూ.6 వేల కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ తేడా ఏకంగా రూ.8,500 కోట్లకు చేరడం గమనార్హం. -
మా యూనిట్లు మార్చండి..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల్లో యూనిట్ల మార్పు, కేటగిరీల సవరణ కోసం అధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలువురు అర్జీదారులు వాటిలో మార్పులు కోరుతూ ఆ మేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దరఖాస్తులో మార్పులు చేసేందుకు సంబంధించిన లాగిన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ల వద్ద ఉండడంతో వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన తొలి రెండు కేటగిరీల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కానీ చివరి నిమిషంలో ఎంపిక ప్రక్రియ, మంజూరు కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం తొలి రెండు కేటగిరీ లకే ముందుగా మంజూరు పత్రాలు ఇవ్వనుందనే ప్రచారంతో.. తొలి విడతలోనే లబ్ధిదారులుగా ఎంపికయ్యే ఉద్దేశంతో తొలుత చివరి రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది, ప్రస్తుతం తమ కేటగిరీలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.చివరి రెండు కేటగిరీలకు అధిక దరఖాస్తులురాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువి వికాసం పథకం కింద వివిధ రకాల యూనిట్ల కోసం మొత్తం 4 కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఆన్లైన్ పద్ధతిలో మార్చి 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖలు..ఏప్రిల్ 14వ తేదీ 11.59 గంటల వరకు కొనసాగించింది. మొత్తం 16,23,764 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.50 వేల లోపు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1 లక్షలోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించింది. తొలి విడతలో కేటగిరీ–1,. కేటగిరీ–2లోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ క్రమంలో తొలి రెండు కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. అయితే ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీ–1లో 1,58,650 మందికి అవకాశం కల్పించాలని భావించగా.. కేవలం 39,401 దరఖాస్తులే వచ్చాయి. కేటగిరీ–2లో 1,22,540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం 93,233 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 1,48,556 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. కానీ కేటగిరీ–3, కేటగిరీ–4 కింద మాత్రం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.అయితే ప్రభుత్వం తొలుత మొదటి రెండు కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలనే చేపట్టడం, ఆయా కేటగిరీలకు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో.. కేటగిరీ–3, కేటగిరీ–4 కింద దరఖాస్తు చేసుకున్న వారు తొలి విడతలోనే అర్హత సాధించేందుకు, ఆ మేరకు ఆయా యూనిట్లకు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుంటున్నారు. సుమారు లక్షకు పైబడి దరఖాస్తుదారులు ఈ విధంగా మార్పులు కోరుకుంటున్నట్లు సంక్షేమ శాఖల వర్గాలు తెలిపాయి. -
లక్ష మందికి.. రూ.లక్ష వరకు!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం..రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్ 2న లక్ష మంది అర్హులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం నాలుగు కేటగిరీలకు గాను తొలివిడతలో రెండు కేటగిరీలకు చెందిన లక్ష మంది లబ్ధిదారులకు, రూ.లక్ష లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.మొత్తం 16.23 లక్షల దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకం కింద వివిధ సంక్షేమ కార్పొరేషన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యింది. మొత్తం 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను నాలుగు కేటగిరీల్లో స్వీకరించారు. రూ.50 వేల లోపు పరిమితి యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1లక్ష లోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3గా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించారు. ఈ క్రమంలోనే తొలుత కేటగిరీ–1, 2లోని అర్హులకు తొలి విడత కింద మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 కేటగిరీలకు 1.32 లక్షల దరఖాస్తులే.. తొలి రెండు కేటగిరీలకు సంబంధించి 2.81 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. ఈ రెండు కేటగిరీల్లో కేవలం 1.32 లక్షల దరఖాస్తులే వచ్చాయి. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల, మున్సిపల్ స్థాయి కమిటీలు...జాబితాలను జిల్లా కలెక్టర్లకు సమర్పించాయి. కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేశాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో ఆదివారం సాయంత్రానికి తుది జాబితాలు ఖరారు చేసి... లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేలా కసరత్తు ముమ్మరం చేశారు.అయితే దరఖాస్తుదారుల ఆధార్, పాన్కార్డులు, బ్యాంకు ఖాతాల ఆధారంగా పరిశీలించి వడపోత అనంతరం తొలి విడత లక్ష మందికి అర్హత కల్పించారు. వీరికి ఈ నెల 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. రూ.50 వేల లోపు యూనిట్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు. రూ.లక్ష లోపు యూనిట్లకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ కేటగిరీ–2లోని దరఖాస్తుదారులు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వారం శిక్షణ..16 కల్లా యూనిట్ల ప్రారంభం లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తారు. క్షేత్రస్థాయిలో జూన్ 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పత్రాల పంపిణీ పూర్తయ్యాక జూన్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించాలి. జూన్ 16వ తేదీ నుంచి యూనిట్ల ప్రారంబోత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, తొలుత జూన్ 2న ఒకేసారి 5 లక్షల మందికి యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యయమయ్యే యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం తొలి రెండు కేటగిరీలకే పరిమితమైంది. కేటగిరీ–3, 4లకు సంబంధించి ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. వీరికి విడతల వారీగా మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. -
జూన్ 2న యువ వికాసం మంజూరు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ రెండో తేదీన మంజూరు పత్రాలను అందిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈ మంజూరు పత్రాల పంపిణీకి క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యువ వికాసం పథకం అమలు పురోగతిపై మంగళవారం సచివాలయంలో సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు భట్టి పలుసూచనలు చేశారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించాలన్నారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 16వ తేదీ నుంచి స్వయం ఉపాధి యూనిట్ల ప్రారం¿ోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గాంధీ జయంతి నాటికి యూనిట్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.సంక్షేమ శాఖ అధికారులు బ్యాంకర్లతో తరచూ మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాన్ని విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కీర్తి ప్రతిబింబించేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, కీర్తి ప్రతిబింబించేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని, ఇందు కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు సూచించారు. ఆవిర్భావ దినోత్సవ సమన్వయ సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై భట్టి సమీక్షించారు. సమావేశంలో భాగంగా భట్టి మాట్లాడుతూ ఈసారి అవతరణ వేడుకలకు అతిథులుగా జపాన్ మేయర్తో పాటు మిస్వరల్డ్ విజేతలు హాజరవుతారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
‘దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు’
భద్రాద్రి కొతగూడెం జిల్లా. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకొని ఎదగడానికి రాజీవ్ యువ వికాసం పథకం వరం లాంటిదన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భద్రాద్రి కొతగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఈ మేరకు మాట్లాడారు. ‘పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి భృతి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర యువత నిరాశా నిసృహల్లో పది ఏండ్లు గడిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 52,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. మిగిలిన ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. నిరుద్యోగ యువత తలెత్తుకొనేలా రాజివ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చాం. భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు. జూన్ రెండవ తేదీ కల్లా యువజన వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు లెటర్లు అందజేస్తాం. అవగాహన లేని కొన్ని సోషల్ మీడియా సిబిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. సిబిల్ స్కోర్ కు రాజివ్ యువ వికాస్ పథకానికి ఎలాంటి సంబంధం లేదు’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.