
జూన్ 2న ప్రారంభం కానున్న ‘రాజీవ్ యువ వికాసం’
యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కారు కసరత్తు
తొలి విడత రూ.లక్ష లోపు యూనిట్లకు మంజూరు పత్రాల పంపిణీ
నాలుగు కేటగిరీలకు గాను తొలి రెండు కేటగిరీల వారికి చాన్స్
రూ.50 వేలు, రూ.లక్ష లోపు కేటగిరీలకు కలిపి లక్ష మంది లబ్ధిదారుల ఎంపిక
మిగతా రెండు కేటగిరీలకు విడతల వారీగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం..రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్ 2న లక్ష మంది అర్హులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం నాలుగు కేటగిరీలకు గాను తొలివిడతలో రెండు కేటగిరీలకు చెందిన లక్ష మంది లబ్ధిదారులకు, రూ.లక్ష లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
మొత్తం 16.23 లక్షల దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకం కింద వివిధ సంక్షేమ కార్పొరేషన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యింది. మొత్తం 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను నాలుగు కేటగిరీల్లో స్వీకరించారు. రూ.50 వేల లోపు పరిమితి యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1లక్ష లోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3గా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించారు. ఈ క్రమంలోనే తొలుత కేటగిరీ–1, 2లోని అర్హులకు తొలి విడత కింద మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2 కేటగిరీలకు 1.32 లక్షల దరఖాస్తులే..
తొలి రెండు కేటగిరీలకు సంబంధించి 2.81 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. ఈ రెండు కేటగిరీల్లో కేవలం 1.32 లక్షల దరఖాస్తులే వచ్చాయి. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల, మున్సిపల్ స్థాయి కమిటీలు...జాబితాలను జిల్లా కలెక్టర్లకు సమర్పించాయి. కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేశాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో ఆదివారం సాయంత్రానికి తుది జాబితాలు ఖరారు చేసి... లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేలా కసరత్తు ముమ్మరం చేశారు.
అయితే దరఖాస్తుదారుల ఆధార్, పాన్కార్డులు, బ్యాంకు ఖాతాల ఆధారంగా పరిశీలించి వడపోత అనంతరం తొలి విడత లక్ష మందికి అర్హత కల్పించారు. వీరికి ఈ నెల 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. రూ.50 వేల లోపు యూనిట్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు. రూ.లక్ష లోపు యూనిట్లకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ కేటగిరీ–2లోని దరఖాస్తుదారులు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
వారం శిక్షణ..16 కల్లా యూనిట్ల ప్రారంభం
లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తారు. క్షేత్రస్థాయిలో జూన్ 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పత్రాల పంపిణీ పూర్తయ్యాక జూన్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించాలి. జూన్ 16వ తేదీ నుంచి యూనిట్ల ప్రారంబోత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, తొలుత జూన్ 2న ఒకేసారి 5 లక్షల మందికి యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యయమయ్యే యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం తొలి రెండు కేటగిరీలకే పరిమితమైంది. కేటగిరీ–3, 4లకు సంబంధించి ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. వీరికి విడతల వారీగా మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు.