మా యూనిట్లు మార్చండి.. | Change in units in Rajiv Yuva Vikasam applications: Telangana | Sakshi
Sakshi News home page

మా యూనిట్లు మార్చండి..

Jun 10 2025 5:24 AM | Updated on Jun 10 2025 5:24 AM

Change in units in Rajiv Yuva Vikasam applications: Telangana

తొలుత రూ.లక్షలోపు 

తొలి రెండు కేటగిరీల పరిశీలనకు సర్కారు నిర్ణయం

ఈ రెండు కేటగిరీలకు లక్ష్యానికి తక్కువగా వచ్చిన అర్జీలు

తొలి విడతలోనే లబ్ధిదారులుగా ఎంపికయ్యేందుకు చివరి 

రెండు కేటగిరీలకు చెందిన అర్జీదారుల ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల్లో యూనిట్ల మార్పు, కేటగిరీల సవరణ కోసం అధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలువురు అర్జీదారులు వాటిలో మార్పులు కోరుతూ ఆ మేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దరఖాస్తులో మార్పులు చేసేందుకు సంబంధించిన లాగిన్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, మున్సిపల్‌ కమిషనర్ల వద్ద ఉండడంతో వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2వ తేదీన తొలి రెండు కేటగిరీల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కానీ చివరి నిమిషంలో ఎంపిక ప్రక్రియ, మంజూరు కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం తొలి రెండు కేటగిరీ లకే ముందుగా మంజూరు పత్రాలు ఇవ్వనుందనే ప్రచారంతో.. తొలి విడతలోనే లబ్ధిదారులుగా ఎంపికయ్యే ఉద్దేశంతో తొలుత చివరి రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది, ప్రస్తుతం తమ కేటగిరీలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

చివరి రెండు కేటగిరీలకు అధిక దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువి వికాసం పథకం కింద వివిధ రకాల యూనిట్ల కోసం మొత్తం 4 కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో మార్చి 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖలు..ఏప్రిల్‌ 14వ తేదీ 11.59 గంటల వరకు కొనసాగించింది. మొత్తం 16,23,764 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.50 వేల లోపు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1 లక్షలోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించింది. తొలి విడతలో కేటగిరీ–1,. కేటగిరీ–2లోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో తొలి రెండు కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. అయితే ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీ–1లో 1,58,650 మందికి అవకాశం కల్పించాలని భావించగా.. కేవలం 39,401 దరఖాస్తులే వచ్చాయి. కేటగిరీ–2లో 1,22,540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం 93,233 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 1,48,556 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. కానీ కేటగిరీ–3, కేటగిరీ–4 కింద మాత్రం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

అయితే ప్రభుత్వం తొలుత మొదటి రెండు కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలనే చేపట్టడం, ఆయా కేటగిరీలకు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో.. కేటగిరీ–3, కేటగిరీ–4 కింద దరఖాస్తు చేసుకున్న వారు తొలి విడతలోనే అర్హత సాధించేందుకు, ఆ మేరకు ఆయా యూనిట్లకు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుంటున్నారు. సుమారు లక్షకు పైబడి దరఖాస్తుదారులు ఈ విధంగా మార్పులు కోరుకుంటున్నట్లు సంక్షేమ శాఖల వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement