breaking news
Providend Fund
-
కరోనా ఎఫెక్ట్: మార్చి పీఎఫ్ చెల్లింపు వాయిదా
న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఆరు లక్షల కంపెనీలూ, ఐదు కోట్ల మంది చందాదారులకూ మేలు చేకూర్చే లక్ష్యంతో మార్చిలో చెల్లించాల్సిన పీఎఫ్ వాటాలను మే 15దాకా వసూలు చేయరాదని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. మార్చి ప్రావిడెంట్ ఫండ్ వాటాను ఏప్రిల్ 15 లోపు చెల్లించాల్సి ఉండగా, దాని గడువుని మే 15కి పొడిగించినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. మార్చి నెలలో జీతాలు చెల్లించిన కంపెనీలు ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) ఫైల్ చేయడానికి గడువుని మే 15 వరకు పొడిగించినట్టు కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. కాగా, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పెన్షన్ ఫండ్ నుంచి 75 శాతం వరకు విత్డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో చందాదారులు గత పది రోజుల్లో భారీగా పీఎఫ్ మొత్తాలను విత్డ్రా చేసుకున్నారు. గత పదిరోజుల్లో సబ్స్ర్కైబర్లు రూ. 280 కోట్లు వెనక్కితీసుకున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) వెల్లడించింది. ఇది చదవండి: ఈపీఎఫ్ను భారీగా లాగేశారు.. -
విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆన్లైన్లోనే సీవోసీ
న్యూఢిల్లీ: విదేశాల్లో వ్యవస్థీకృత రంగంలో పనిచేసే భారతీయ ఉద్యోగులు ఇకపై భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే సమర్పించి సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ)ని పొందవచ్చు. పనిచేస్తున్న దేశంలో సామాజిక భద్రతా పథకాలను పొందేందుకు అవసరమైన సీవోసీని 3 రోజుల్లోనే ఆన్లైన్లో తీసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ పేర్లు, పీఎఫ్ ఖాతాల వివరాలు, సీవోసీ కాలపరిమితి వంటి వివరాలను తప్పులు లేకుండానే ఆన్లైన్లో సమర్పించేందుకు వీలుగా సాఫ్ట్వేర్ను మెరుగుపర్చినట్లు ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) ఓ సర్క్యులర్లో వెల్లడించింది. ఆన్లైన్లో దరఖాస్తులు నింపిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకుని, యాజమాన్యం సంతకంతో రీజినల్ పీఎఫ్ కమిషనర్కు ఆన్లైన్లోనే సమర్పించి సీవోసీ పొందవచ్చని తెలిపింది. కాగా ఈపీఎఫ్వో ఆధ్వర్యంలోని సామాజిక భద్రతా పథకాలు ఇతర దేశాల్లోని వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న భారతీయులు కూడా పొందేందుకు వీలుగా ఈపీఎఫ్వో పలు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, హంగరీ దేశాల్లోని భారతీయులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఉద్యోగులు అక్కడి అధికారులకు సీవోసీ సమర్పించాల్సి ఉంటుంది.