breaking news
press club meeting
-
పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి, అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను మీడియా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం– పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపట్టేలా వ్యవహరిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాస రావు కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనను అరెస్టు చేయడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది’ అని సీనియర్ సంపాదకులు అన్నారు.ఇటీవల ఏపీలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటీవల సంపాదకుడు రహమాన్పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్రావు, ట్రెజరర్ రాజేష్, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు వ్యక్తపర్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కె.రామచంద్రమూర్తి ,సీనియర్ సంపాదకులుపత్రికా స్వేచ్ఛను కోరుకునేది ప్రజలే.. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. దీన్ని ప్రధానంగా కోరుకునేది ప్రజలే. పత్రికలు చురుకుగా ఉన్నప్పుడే ప్రతీ విషయం ప్రజలకు చేరుతుంది. కానీ ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్నీ గౌరవించిన మనిషి కాదు. ప్రతీ రంగంలో తన వ్యతిరేకులను అణచివేయడం ఏళ్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతికా స్వేచ్ఛనే కాదు... అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. - టంకశాల అశోక్, సీనియర్ సంపాదకులుమీడియాను భయపెట్టే ప్రయత్నమిది.. కొమ్మినేని అరెస్టుతో మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొమ్మినేని తప్పు లేకు న్నా.. ఒకరకమైన భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడి యా స్వతంత్రంగా లేదు. రాజకీయ పారీ్టల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం రెండూ వేర్వేరు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొమ్మినేని అరెస్ట్తో ఆగుతుందని అనుకోవడం లేదు. దీంతో భయపడి మిగతావారు వ్యతిరేక వార్తలు రా యకుండా ఉంటారని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మిగతా జర్నలిస్టులు రియాక్ట్ కాకుంటే ఎలా..? - దేవులపల్లి అమర్ ,సంపాదకులు మన తెలంగాణకక్ష సాధింపునకు పరాకాష్ట సాక్షి టీవీ డిబెట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలకు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానాలి. కొమ్మినేని అరెస్టే సరి కాదని న్యాయస్థానం స్పష్టంచేస్తుంటే, సాక్షి కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సరైన కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని, ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చనే తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది. ఇది రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. - ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షిఒక్కో మీడియా ఒక్కో వైఖరితో.. ప్రస్తుత రోజుల్లో ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో ఉంది. ఈ పరిస్థితుల్లో ఐదు పేపర్లు, పది టీవీ చానళ్లు చూస్తే తప్ప వాస్తవాలేంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తుంటే... ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే గుడ్డలూడదీసి కొడతానంటోంది. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అరెస్టులను వ్యతిరేకించాలి. అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులుపాత్రికేయుల భద్రత గురించి ఆలోచించాలి రాజకీయ కక్ష సాధింపులో మీడియా పావులుగా మారుతోంది. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చాలా రాష్ట్రాల్లో మీడియా టార్గెట్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రికేయుల భద్రత గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాచా రం అందించే ఏ వ్యవస్థ అయినా మీడియా కిందనే గుర్తించాలి. ఓ వార్త విషయంలో ప్రైవేటు వ్యక్తులు కేసు పెడితే నాపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు చేశారు. ఇదివరకు సోషల్ మీడియా వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన స్రవంతి మీడియా పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడది మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చింది. కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్టు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది. - కె.శ్రీనివాస్, సీనియర్ సంపాదకులుసుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థలు వెక్కిరిస్తున్నాయి కొమ్మినేని అరెస్టు... సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన తీరు ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను దిగజార్చుతున్నాయి. కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సూచనలపై కొందరు వ్యంగ్యంగా చర్చిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలియకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే ప్రమాదకరం. - విజయ్ బాబు,సీనియర్ సంపాదకులుపత్రికలకు స్వేచ్ఛ లేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పత్రికలకు స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. వార్త రాసినా ఉపేక్షించే పరిస్థితిలో లేవు. అందుకు తాజా ఉదా హరణ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారమే. వాస్తవానికి ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదు. - దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్..అయినా ప్రజా ప్రయోజన వార్తలు ఆగవు గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే స్థానికుల సమాచారంతో నేను వార్తలు రాశాను. ఇథనాల్ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైంది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను అరెస్టు చేసింది. అయినా ప్రజలకు ప్రయోజనం కలిగించే వార్తలు రాయడం ఆపను. - రహమాన్, సంపాదకులుకలిసి ఉంటేనే మనుగడవ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటున్నాయి. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా ఉంటేనే మీడియా మనుగడ ఉంటుంది. - శైలేష్ రెడ్డి, సీఈఓ, టీ న్యూస్ -
డాక్టర్లకు లయన్స్ క్లబ్ సభ్యుల సంఘీభావం
సాక్షి, హైద్రాబాద్ : ఇటీవల భారతదేశంలో డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ...మల్టిపుల్ డిస్ట్రిక్స్ -320 పరిధిలో తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లోని 500 లయన్స్క్లబ్లలో ఉన్న 19వేల మంది సభ్యులు డాక్టర్లకు సంఘీభావం తెలిపారు.డాక్టర్లు ప్రాణదాతలని, మానవ జాతి రక్షణకు కంకణం కట్టుకున్న సేవాదురంధరులని, వారిపై దాడి హేయమైందని అన్నారు. దేశ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు వైద్యశిబిరాల ద్వారా నిరుపేదలకు వలందిస్తూ సహాయ సహకారాలను అందిస్తున్నారని 320 డిస్ట్రిక్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, ఎండీ ఎస్.నరేందర్రెడ్డి కొనియాడారు. శుక్రవారం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో 102 సంవత్సరాలుగా మానవాళికి సేవలందిస్తున్నాయని, అంతేకాకుండా తమ సభ్యులతో పాటు ఆయా దేశాల్లో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్లు కూడా తమ సహకారాన్ని అందించడం ముదావహమని నరేందర్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్రెడ్డి, సెక్రటరీ డాక్టర్ సంజీవ్సింగ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్థానిక లయన్స్ క్లబ్ల సహకారంతో అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు వైద్య శిబిరాలు నిర్వహించి సహాయమందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని మల్టిపుల్ డిస్ట్రిక్ట్-320 లయన్స్ క్లబ్ల సభ్యులకు తెలిపారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ ఆర్. సునీల్కుమార్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని 60శాఖల్లోని 16వేల మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసించి వారికి నైతిక మద్దతు తెలిపామన్నారు. వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్లకు తగు భద్రత కల్పించి, డాక్టర్లపై దాడులకు పాల్పడుతున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ల ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ పి.రఘురాం మాట్లాడుతూ వైద్యవృత్తి పవిత్ర మైనదని, ఎక్కడో ఓ పొరపాటు జరిగినంత మాత్రాన మొత్తం వైద్యులందరినీ బాధ్యులను చేసి దాడులకు దిగడం సరికాదన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఏవీకే గోఖలే మాట్లాడుతూ..కోల్కతాతో పాటు ఇటీవల హైదరాబాద్లో కూడా ఇలాంటి దాడులు జరగడం విచారకరమన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని గోఖలే కోరారు. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి డాక్టర్ రవీందర్రావు, మల్టిపుల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎం.ప్రమోద్కుమార్రెడ్డి, కార్యదర్శి మామిడాల శ్రీనివాస్,మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ సయ్యద్ జావీద్, సంయుక్త కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వడ్డెర సంక్షేమానికి కృషి
కడప రూరల్: ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్ ద్వారా ఏర్పాటైన సంఘాలకు రూ. 37 కోట్ల రుణాలు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు ఆ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవళ్ల మురళి అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో గురువారం సాయంత్రం నిర్వహించిన జిల్లా వడ్డెర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాకు ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్కు మూడు యూనిట్లు మంజూరయ్యాయని, 50 యూనిట్ల మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. కొండ క్వారీల్లో యంత్రాలను వినియోగిస్తున్నారని, ఆ యంత్రాలను వడ్డెర్లకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో వడ్డెర భవన్ ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు. వడ్డెర్ల సమస్యలను పరిష్కరించాలి ఈ సందర్భంగా వడ్డెర నాయకులు బత్తుల జానకిరాం, గురుప్రసాద్, నంద్యాల సుబ్బరాయుడు, గంపా తిరుపతి మాట్లాడుతూ వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన వడ్డెర ఫెడరేషన్కు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. బత్తల లక్ష్మయ్య, రమణ, బెల్లంకొండ శ్రీనివాస్, శేఖర్, పెద్ద సంఖ్యలో వడ్డెర నాయకులు పాల్గొన్నారు.