breaking news
Peranbhu
-
కోలీవుడ్లో మళ్లీ బిజీ అవుతోన్న అంజలి!
తమిళసినిమా: నటి అంజలి కోలీవుడ్లో మళ్లీ బిజీ అవుతోంది. ఈ ఆరణాల అచ్చతెలుగు అమ్మాయి తెలుగు, తమిళం చిత్రాలు అంటూ చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 2007లో కట్రదు తమిళ్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన నటి అంజలి. ఆ తరువాత అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రాలతో నటిగా తానేమిటో తెలియజెప్పింది. ఇక ఆ మధ్య తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాల విజయాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇటీవల మళ్లీ కోలీవుడ్లో చిత్రాలు చేస్తూ బిజీ అయ్యింది. బెలూన్, తరమణి చిత్రాల తరువాత అంజిలి నటించిన చిత్రం ఇక్కడ తెరపైకి రాలేదు. యువ నటుడు జయ్తో ప్రేమ వ్యవహారం అంటూ తరచూ వార్తల్లోకెక్కిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అలాంటి ప్రచారానికి దూరమైందని చెప్పవచ్చు. తాజాగా మరోసారి కోలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టింది. ఇక్కడ తగ్గిన తన మార్కెట్ను మళ్లీ పొందడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టికి జంటగా నటించిన పేరంబు చిత్రం ఫిబ్రవరి ఒకటవ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఇది పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన చిత్రం అన్నది గమనార్హం. దీంతో ఈ చిత్రంపై అంజలి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం తరువాత శశికుమార్తో నటించిన నాడోడిగళ్–2 చిత్రం విడుదల కానుంది. అదే విధంగా మరికొన్ని కొత్త చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని అంజలి పేర్కొంది. ఈమె పొంగళ్ పండగ సందర్భంగా కొన్ని ఫొటోలను, తన అభిప్రాయాలతో కూడిన విషయాలను, తను శారీరక కసరత్తులు చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. వాటిని ప్రసారం చేస్తూ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. -
హిజ్రాగా అంజలి
చాలెంజింగ్ పాత్రల్లో నటించాలని చాలామంది తారలు కోరుకుంటారు. అయితే అలాంటి పాత్రలు ఆశపడిన వారికంతరికీ అమరవు. అదే విధంగా కొన్ని పాత్రలు ధరించడానికి చాలా గట్స్ ఉండాలి. ఈ తరం నటీమణుల్లో అలాంటి దమ్మున్న హీరోయిన్లలో అంజలి ఒకరని చెప్పవచ్చు. అంజలి అంగాడితెరు చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇటీవల తెలుగులో గీతాంజలి చిత్రంలో దెయ్యంగా భయపెట్టారు. తాజాగా హిజ్రాగా తన తడాఖా చూపించడానికి రెడీ అయ్యారు. అంజలికి ఇది అరుదైన అవకాశమే కాదు వెతుక్కుంటూ వచ్చిన ఛాన్స్ అని కూడా అనవచ్చు. కోలీవుడ్లో దర్శకుడు రామ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తంగమీన్గళ్ చిత్రంతో జాతీయ అవార్డును సాధించిన దర్శకుడీయన. తాజాగా మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇందులో కథానాయకి పాత్రకు చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లను పరిశీలించినా తన చిత్రంలో నాయకి పాత్రకు అంజలినే పర్ఫెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారట. ఎందుకంటే ఇందులో మమ్ముట్టి కథానాయకుడు. ఆయనకు ధీటుగా నటించాల్సి ఉంటుందట. అంజలిది అసాధారణ పాత్ర అట. ఆమెను ఇందులో వేశ్య అయిన హిజ్రాగా చూపించనున్నారని సమాచారం. వేశ్యగా నటించడానికే గట్స్ కావాలి. ఇక హిజ్రా వేశ్య పాత్రకు అభినయించాలంటే ఆషామాషీ విషయం కాదు. ఈ పాత్రలో అంజలిని దర్శకుడు రామ్ ఎలా మలుస్తారో వేచి చూడాల్సిందే. అన్నట్టు ఈ చిత్రానికి పేరన్భు అనే పేరును నిర్ణయించారన్న విషయం తెలిసిందే.