‘రా’ చీఫ్గా పరాగ్ జైన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపై భారతసైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్కు ముఖ్యమైన పదవి లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను అత్యున్నత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) నూతన చీఫ్గా నియమించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. పరాగ్ జైన్ వచ్చే నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుత ‘రా’ చీఫ్ రవి సిన్హా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నూతన చీఫ్(సెక్రెటరీ)గా పరాగ్ జైన్ నియామకానికి కేబినెట్ అపాయింట్స్మెంట్ కమిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరాగ్ జైన్ ఇప్పటిదాకా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ చీఫ్గా వ్యవహరించారు. ప్రతిభావంతుడు పరాగ్ జైన్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన పరాగ్ జైన్కు ప్రతిభావంతుడిగా పేరుంది. గొప్ప నేరపరి శోధకుడిగా నిఘా వర్గాల్లో గుర్తింపు సాధించారు. మానవ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి అనుకున్న ఫలితం సాధించడంలో దిట్ట. దేశంలో పలు కీలక ఆపరేషన్లలో స్వయంగా పాలుపంచుకున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఆయనది కీలక భూమిక. పాకిస్తాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ప్యాడ్లను నేలమట్టం చేయడంలో ఆయన హస్తం ఉంది. పరాగ్ జైన్ ఇచ్చిన కచ్చితమైన నిఘా సమాచారంతోనే పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలింది. ఆయనకు జమ్మూకశ్మీర్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది. తన పదవీ కాలంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్లో తీవ్రవాదాన్ని అణచివేశారు. 2021 జనవరి 1న పంజాబ్లో డీజీపీ ర్యాంక్ పొందారు. డిప్యూటేషన్పై కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనే ఎక్కువ కాలం పనిచేశారు. కెనడా, శ్రీలంకలోనూ వివిధ మిషన్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెనడాలో ఉన్నప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద శక్తులపై నిఘా పెట్టి, కీలక సమాచారం సేకరించారు.