ఆ అరుదైన ఘనత గోపీచంద్దే
ఒలింపిక్స్ చరిత్రలో భారత క్రీడాకారిణులు ఇప్పటి వరకు ఐదుగురు మాత్రమే పతకాలు సాధించారు. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తెలుగుతేజం కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టర్ మల్లీశ్వరి కాంస్యం సాధించింది. 12 ఏళ్ల తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కాంస్యాలతో మెరవగా.. తాజా రియో ఒలింపిక్స్లో రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం, తెలుగుతేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు రజత పతకాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.
ఒలింపిక్ పతకాలు సాధించిన భారత క్రీడాకారిణులుగా మల్లీశ్వరి, సైనా, మేరీ కోమ్, సాక్షి, సింధు చరిత్రలో చోటు సంపాదించారు. ఈ ఐదుగురు మహిళలల్లో సైనా, సింధు సాధించిన పతకాలకు ఎంతో ప్రత్యేక ఉంది. వీరిద్దరూ హైదరాబాదీలే. సైనా, సింధు ఇద్దరూ బ్యాడ్మింటన్లో దేశానికి పతకాలు అందించారు. మరో విశేషమేంటంటే వీరిద్దరూ కోచ్ గోపీచంద్ శిష్యరికంలోనే పతకాలు సాధించారు. అంటే ఐదుగురు భారత క్రీడాకారిణులు ఒలింపిక్ పతకాలు సాధిస్తే.. ఇందులో రెండు గోపీచంద్ శిష్యురాళ్లు గెలిచారన్నమాట. ఈ అరుదైన ఘనత గోపీచంద్దే.