గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు
విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ఎన్టీఆర్ అమరావతి ఎయిర్పోర్టుగా మార్చనున్నారు. అలాగే తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని తీర్మానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. నందిగామ హాస్పిటల్ వివాదంపై కేబినెట్లో చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి-కృష్ణా జిల్లా కలెక్టర్ వివాదంపై కేబినెట్ సమావేశంలో వీడియోను ప్రదర్శించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోవడంపై వైఎస్ జగన్.. కలెక్టర్, డాక్టర్లను ప్రశ్నించగా, ఆయనపై కేసు బనాయించిన సంగతి తెలిసిందే.
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ పాలసీలో మార్పు చేయాలని నిర్ణయించారు. డిపాజిటర్ల చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించారు.