breaking news
n.srikant
-
ప్రజాసేవే అమరులకు నిజమైన నివాళి
పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో కలెక్టర్ నెల్లూరు(క్రైమ్): అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ అమరవీరులకిచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. జిల్లా పోలీసు కవాతు మైదానంలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కూడా పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఎస్పీ ఎస్.సెంథిల్కుమార్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలను మెరుగుపరిచి, ప్రజలకు చేరువకావడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్ విధి నిర్వహణలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా మృతిచెందిన 643 మంది పోలీసు అమరవీరుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలో ఈ ఏడాది మృతి చెందిన ఎనిమిది మంది అమరుల కుటుంబాలకు, పోలీసు బాయిస్ హాస్టల్లోని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఘన నివాళి పోలీసు కవాతు మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ ఎస్.సెంథిల్కుమార్, మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర, గ్రామీణ, సూళ్లూరుపేట, గూడూరు శాసనసభ్యులు పోలుబోయిన అనీల్కుమార్యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్కుమార్, ఏఎస్పీ గంగాధర్ , నెల్లూరు నగర, గ్రామీణ, హోమ్గార్డ్స్, ఎస్బీ డీఎస్పీలు పి.వెంకటనాథ్రెడ్డి, వి.ఎస్.రాంబాబు, శ్రీనివాసరావు, బి.వి రామారావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు తదితరులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం పెరేడ్ నిర్వహించారు. పెరేడ్ గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్న సాంబశివరావు(ఎస్సై,నెల్లూరు రెండో నగరం), బి.శ్రీనివాసరావు(ఎస్సై, ఎస్బీ), జి.అజయ్కుమార్(ఎస్సై, గూడూరు ఒకటో పట్టణం)కు కలెక్టర్ నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర కీలకం
కలెక్టర్ శ్రీకాంత్ నెల్లూరు (హరనాథపురం) : మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. స్థానిక సోమశిల ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో ఏపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 154 జయంతిని పురస్కరించుకుని సోమవారం ‘ఇంజనీర్స్ డే’ నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచి నీరు తదితర ప్రాజెక్టుల రూపకల్పనలో ఇంజనీర్లు సరైన ప్లానింగ్తో పని చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు. ప్రాజెక్ట్లు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ప్లాన్ ఉండాలన్నారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య, కేఎల్రావు, శ్రీధరన్ వంటి ఇంజ నీర్లు మంచి ప్రాజెక్ట్ల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు. మోక్షగుండం జయంతిని భారత ప్రభుత్వం ఇంజనీరింగ్ డేగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కువ నీరు సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని మనం వినియోగించుకునేలా ఇంజనీర్లు డిజైన్లను తయారు చేయాలని సూచించారు. తొలుత మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదానం కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ జేసీ ఇంతియాజ్, రిటైర్డ్ సీఈ ప్రభాకర్, ఇరిగేషన్, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టుల ఎస్ఈలు కోటేశ్వరరావు, సుబ్బారావు, సాబ్జాన్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాకి విజయబాబు, వేణుగోపాల్, ప్రియదర్శిని పాల్గొన్నారు.