breaking news
Nomadic life
-
సంచార జాతుల్లో వెలుగులు నింపిన జగన్
సాక్షి, అమరావతి: ఉదర పోషణకు ఊరూరా సంచారం.. రోడ్డు పక్కన, మురికి కాల్వల గట్టున జీవనం.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుర్భరం.. ఇది రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు సంచార జాతుల జీవన చిత్రం. అటువంటి సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అయితే కూటమి పాలనలో ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోని దారుణ పరిస్థితికి జారిపోయారు. ఈ నెల 31న విముక్త సంచార జాతుల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవన చిత్రానికి సంబంధించిన కథనం ఇది. దుర్భర జీవనం... భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కళారూపాల ద్వారా పరిరక్షిస్తూ ధర్మప్రచారకులుగా ఊరూర తిరుగుతూ జీవనోపాధి పొందేవారిని సంచార జాతులుగా పరిగణించారు. కనీసం సొంత ఊరు, ఇల్లు, చిరునామా, కుల «ధృవీకరణ, రేషన్కార్డు, ఆధార్కార్డు లేక దశాబ్దాల తరబడి ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోని దుర్భర బతుకులు వారివి. పూసలు, దండలు, వనమూలికలు అమ్ముతూ, తలవెంట్రుకలు వంటివి కొంటూ, గొడుగులు బాగుచేస్తూ, సవరాలు అమ్ముతూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ, చిన్న చిన్న సర్కస్లు చేస్తూ, ఖాళీ సమయంలో భిక్షాటన చేస్తూ బతుకులు వెళ్లదీసే పరిస్థితి వారిది. సంచార జాతుల స్వాతంత్య్రం– 1952బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, 1871 ద్వారా దాదాపు 500 కులాల వారికి ‘జన్మతః నేరస్తులు’ అనే ముద్ర వేసింది. ఈ చట్టం వల్ల వారు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి జైలులో పెట్టేవారు. ఫలితంగా గౌరవంగా బ్రతకలేక, చాలా మంది రహస్యంగా సంచార జీవితం గడుపుతూ భిక్షాటనపై ఆధారపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం రద్దు కాలేదు. నిరంతర పోరాటాల తరువాత 1952 ఆగస్టు 31న ఈ కులాలను విముక్త జాతులుగా ప్రకటించారు. అందుకే సంచార జాతులు ఆ రోజును తమ నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే, వారి జీవనస్థితి మెరుగుపడేందుకు చేసిన కమిటీలు, కమిషన్ల సిఫార్సులు పరిమిత స్థాయిలో మాత్రమే అమలయ్యాయి.సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంరాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఉన్నారు. వారికి కుల ధృవీకరణ పత్రాలు, చిరునామా (నెటివిటి సర్టిఫికెట్)లు, ఆధార్, రేషన్కార్డులు జారీకి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వారిలో అనేకమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. సంచార జాతుల పిల్లలకు చదువులను చేరువ చేసేలా అమ్మ ఒడిని వర్తింపజేశారు. చేయూతతోపాటు నవరత్నాలతో అనేక సంక్షేమ పథకాల ద్వారా సంచార జాతులకు రూ.1,288.44కోట్లకుపైగా లబ్ది చేకూర్చడం విశేషం. వారిలో 32 సంచార జాతుల కోసం ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గుర్తింపు లేని తోలుబొమ్మలాటల కులస్తులను గుర్తించి బీసీ–బీ సీరియల్ నంబర్ 25లో చేర్పించారు. హామీలను నెరవేర్చని కూటమి సర్కార్కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి. ఎంబీసీలకు స్థానిక సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లు, దేవాలయాల పాలక మండలిలో సభ్యత్వం, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీ, మైనార్టీల మాదిరిగానే కో–అప్షన్ మెంబర్గా ఎంబీసీలకు అవకాశం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సంచార జాతుల గుర్తింపు కార్డుల మంజూరు... ఇలా ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది.జగన్ పాలనలో గుర్తింపుజగన్ పాలనలోనే సంచార జాతులకు గుర్తింపు దక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. –పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
మెతుకు కష్టమైంది.. బతుకు భారమైంది
ఈ ఫొటోలోని వారు 11 కుటుంబాలకు చెందిన వారు. వీరికి ప్రభుత్వం 12 కిలోల చొప్పున బియ్యం అందజేసింది. అయితే ఆర్థిక సాయం ఇంకా అందలేదు. ఒక్కో కుటుంబం వద్ద కనీసం రెండు రోజులకు కూడా సరిపడా సరుకులు లేవు. అవసరమైన ఆహార పదార్థాలు లేకపోవడంతో 11 కుటుంబాలకు చెందిన సుమారు 45 మంది ఇలా ఒకే చోట వంట చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అందరూ పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ జీవనాధారమైన పెంపుడు జంతువులకు తిండి పెట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. సాక్షి, జగిత్యాల: లాక్డౌన్ నేపథ్యంలో బుక్కెడు బువ్వ కోసం వలసజీవుల ఆకలి పోరాటం తప్పడం లేదు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక యాచకులు, సంచారజాతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఊరూరా తిరిగి ఇంటింటికీ వెళ్లి తిండిగింజల కోసం వీరు చేసే పోరాటం లాక్డౌన్ నేపథ్యంలో ఆగిపోయింది. నెలరోజులుగా వీరంతా అర్ధాకలితో అలమటిస్తున్నారు. తిండి కోసం తిప్పలు లాక్డౌన్లో సంజారజాతులు, యాచకుల బతుకులు భారంగా మారాయి. సరిపడా తిండిగింజలు లేక నిత్యం ఆకలితో పోరాడుతున్నారు. కుటుంబం మొత్తానికి కావల్సిన బియ్యం ఇతర వంటసామగ్రి కోసం వారంతా సతమతమవుతున్నారు. ఈ ఫొటోలోని వారు కొడిమ్యాల మండలం నర్సింహునిపల్లెకు చెందిన రాయమల్లు, సమ్మవ్వ తమ పిల్లలతో కలసి గొల్లపెల్లి మండలం చిల్వాకో డూరు శివారులోని గుడారాల్లో ఉంటున్నారు. గంగిరెద్దులు ఆడించి జీవనం గడిపే ఈ కుటుంబానికి లాక్డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా గడ్డు పరిస్థితి నెలకొంది. నెలరోజుల కిందట అ ధికారులు పంపిణీ చేసిన బియ్యం అయిపోవడంతో మిగతా 10 కుటుంబాలతో కలసి ఒకే చోట వండుకుంటున్నారు. రోజూ ఒకే పూట తింటున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఊల్లోకి రానిస్తలేరు నేను ఊరూరా తిరుగుతూ అద్దాలు, దువ్వెనలు అమ్ముకుంట. ఏ రోజుకారోజు తిండికి సరిపోయేది. నెలరోజుల నుంచి ఊళ్లోకి ఎవరూ రానిస్తలేరు. బియ్యం అయిపోయినయి. ఒక్క పూటనే తింటున్నం.– రాజమ్మ -
టూకీగా ప్రపంచ చరిత్ర 75
ఏలుబడి కూకట్లు వృత్తులవారీగా పౌరజీవితం విడిపోయి, ఏ వర్గానికావర్గం కూటమిగా ఏర్పడింది. వృత్తిపరమైన నైపుణ్యాలు ఆయా కుటుంబాలనూ, కూటములనూ దాటిపోకుండా వృత్తిరహస్యాలయ్యాయి. పరిశ్రమ ఏదైనా, నిర్వహణలో కుటుంబానికంతా భాగస్వామ్యం ఉండడం వల్ల, ఇంటికి కొత్తగా వచ్చే కోడలు కూడా ఆ వృత్తికి అలవాటుపడినదై ఉండవలసిన అవసరం వల్ల, చివరకు పెళ్లి సంబంధాలు సైతం వృత్తుల పరిధిలోకి కుదించుకున్నాయి. మారిన సామాజిక పరిస్థితులనూ, పౌరసంబంధాలనూ సమన్వయించగల కేంద్రం దేవాలయం. ఆ అర్చకుడు ఆ నగరానికి పాలకుడు. అది సహజమైన పరిణామం. ఎందుకంటే, మానవుణ్ణి సేద్యానికీ, స్థిరనివాసానికీ పురిగొల్పిన అంశాలు - సహజీవనం, సమృద్ధి, దేవుణ్ణి గురించి తలెత్తిన ఆలోచన. ఈ రూపంగా సంచార జీవితం నాటి ఆనవాయితీలకూ, సమిష్టి ఆలోచనలకూ శాశ్వతంగా తెర పడిపోయింది. నగరమూ, దానికి అనుబంధంగా ఉన్న కుగ్రామాలూ కలిసి ఒక ప్రామాణిక రాసి (యూనిట్). అర్చకుల నాయకత్వంలో ‘నగరపాలన’ ఏర్పడింది. మెసొపొటేమియా పీఠభూమి నిలువునా ఉనికిలోకి వచ్చిన వందలాది నగరాలన్నీ ఇదే మార్గాన్ని అనుసరించాయి. ఆ ఒక్క చోటునే కాదు, అనాది నాగరికతల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ‘నగర పాలికల’తోనే ఏలుబడి ప్రారంభమయింది. విడిగా బ్రతికే జంతువుకున్న స్వేచ్ఛ, ఉమ్మడిలో భాగంగా బ్రతికే జంతువుకు ఉండదు. కొన్ని నిబంధనలకు అలవాటు పడితే తప్ప సహజీవనం సాధ్యపడదు. అంటే, తన స్వేచ్ఛలో కొంతభాగాన్ని వదులుకునేందుకు సిద్ధపడితే తప్ప సాంఘిక జీవనం ప్రశాంతంగా సాగదు. సమాజం పెరిగేకొద్దీ నిబంధనల సంఖ్య అనివార్యంగా పెరుగుతుంది. హక్కులతోపాటు మోపెడన్ని బాధ్యతలు కూడా ప్రవేశిస్తాయి. అర్చకుల పాలనలో స్వేచ్ఛ ఎంత కుదించుకున్నా, హక్కులకు మాత్రం భంగం కలుగలేదు. ఎవరి ఇల్లు వాళ్లకు సొంతం; ఎవరి భూమి వాళ్లకు సొంతం; ఎవరి వ్యాపారం వాళ్లకు సొంతం. కాకపోతే, పాలనకయ్యే ఖర్చుకోసం చిన్న మోతాదులో శిస్తు చెల్లించాలి. ‘శిస్తు’ అనే విధానం పరిపాలనకు తోబుట్టువు. మెసొపొటేమియన్ పీఠభూమిలో నివసించిన నాగరికులను ‘సుమేరియన్’ జాతిగా పేరొచ్చింది. క్రీ.పూ.40వ శతాబ్దంలో మొలకెత్తిన ఆలయ పాలన దాదాపు 1000 సంవత్సరాలు సుమేరియన్లను నడిపించింది. అంతకుమించి నిలువలేక రాచరికాలకు తలుపులు తెరిచింది. విజ్ఞానం, దేవుని మీద ప్రజలకున్న విశ్వాసం అర్చకులకుండే బలం. ఆత్మరక్షణకు యుద్ధం ఆవశ్యకమైనప్పుడు ఒక్క పిలుపుతో పౌరులందరిని అర్చకులు కూడేయగలరు. కానీ, యుద్ధతంత్రంలో ప్రావీణ్యతలేని అర్చకుల నాయకత్వంలో జరిగే పోరాటం సారంలేని చెరుకుపిప్పి. పరిసరాల్లోని సంచారతెగలతో చేసుకున్న ఒప్పందాల కారణంగా, యుద్ధంతో అవసరం తీరిపోయిన తరువాతి కాలం అర్చకుడు ఆలయానికే అంకితమైన వ్యక్తిగా మారిపోయాడు. కౌమారంలో అర్చకుడిగా తన జీవితాన్ని ఆలయానికి చేర్చి, దానికి సంబంధించిన తర్ఫీదుమీదనే దృష్ట కేంద్రీకరించడంతో యుద్ధతంత్ర అతని పిడికిలినుండి జారిపోయింది. దేవతలూ, దేవాలయాల సంఖ్య పెరగడంతో, ప్రజల విశ్వాసం మరో దేవునివైపు మరలకుండా, సంపూర్ణంగా అది తన దేవునికే ఉండేలా చేసుకునే తహతహవల్ల అర్చక వర్గంలో విభేదాలు తలెత్తి, ఆ వర్గాన్ని ముక్కలకింద చీల్చేసింది. అర్చకుల ఈ బలహీనతను ఆధారం చేసుకుని కండబలం కలిగిన యోధులు పరిపాలనను హస్తగతం చేసుకున్నారు. దేవుళ్ళందరికీ సమాన గౌరవం ప్రకటించి, ఏయే అర్చకుణ్ణి ఆయా దేవాలయాలకు పరిమితం చేశారు. రచన: ఎం.వి.రమణారెడ్డి