breaking news
Ninne Chusthu Movie
-
'నిన్నే చూస్తు' మూవీ రివ్యూ
టైటిల్ : నిన్నే చూస్తు దర్శకుడు: కె. గోవర్ధనరావు నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలత రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే, భానుచందర్, కిన్నెర, జబర్దస్త్ మహేష్ తదితరులు బ్యానర్ : వీరభద్ర క్రియేషన్స్ ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి సంగీతం: రమణ్ రాతోడ్ ఎడిటర్ : నాగిరెడ్డి కెమెరా : ఈదర ప్రసాద్ విడుదల తేదీ: అక్టోబర్ 27, 2022 శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం నిన్నే చూస్తు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.. కథ అమలాపురంలో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్ను హత్య చేసిన వారిని చంపాలని రగిలిపోతుంటాడు. బ్యాగ్లో గన్ పెట్టుకొని తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెదుకుతూ ఉంటాడు. చివరకు తన తండ్రిని చంపిన వ్యక్తి వైజాగ్లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్లోని ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర)ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. తన ఫ్రెండ్ స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య. ఈ క్రమంలో హీరోహీరోయిన్లిద్దరూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమను కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య. దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణకు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటాడు. అతడి మీద కోపంతో సత్యతో నువ్వంటే ఇష్టం లేదు "ఐ హేట్ యు" అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకుతో సత్యకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అసలు జగదీశ్ చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్ను ఎందుకు చంపాడు? జగదీశ్ను కృష్ణ చంపాడా లేదా? సత్య కృష్ణను పెళ్లాడిందా? లేక తన బావను పెళ్లి చేసుకుందా? అన్న విషయాలు తెలియాలంటే "నిన్నే చూస్తు".. సినిమా చూడాల్సిందే! నటీనటుల పనితీరు అమ్మను ప్రేమగా చూసుకొనే కొడుకుగా, సత్యను ప్రేమించే లవర్గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కొడుకుగా పలు షేడ్స్ వున్న పాత్రలో శ్రీకాంత్ చక్కగా నటించాడు. ఒక వైపు నిర్మాతగా మరోవైపు హీరోయిన్గా బుజ్జి(హేమలతా రెడ్డి) ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్ తల్లిదండ్రులు, హీరో ఫ్రెండ్స్ వారి పాత్రలకు తగ్గట్లు నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనను దర్శకుడు కె గోవర్ధనరావు అద్భుతంగా తెరకెక్కించాడు. రమణ్ రాథోడ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్ అందించిన విజువల్స్ పర్వాలేదు. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఇంకాస్త ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. చదవండి: అప్పుడే సమంతతో లవ్లో పడ్డా: విజయ్ దేవరకొండ బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? -
ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చాటిచెప్పేలా ‘నిన్నే చూస్తు’
కె. గోవర్ధనరావు దర్శకత్వంలో శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నిన్నే చూస్తు’. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన చిత్రం అక్టోబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సీనియర్ హీరో సుమన్ మాట్లాడుతూ.. ‘నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. నటి, నిర్మాత హేమలత రెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ తను సుహాసిని, భానుచందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని సినిమాలో నటిస్తూనే నిర్మాతగా సినిమాను చాలా చక్కగా డీల్ చేసింది. ఈ సినిమాలో తన డైలాగ్స్ అన్ని సింగల్ టేక్ లో చేసుకుంటూ అటు నిర్మాతగా ఇటు యాక్టర్ గా చేస్తూ సర్కస్ లో రింగ్ మాస్టర్ లా తనే దగ్గరుండి చూసుకుంటూ షూటింగ్ సక్సెస్ చేసింది’అన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీకి రావడం ఎంతో అవసరం. ఫిల్మ్ చాంబర్ ఎప్పుడూ ఆట్టి దర్శక,నిర్మాతలకు సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు, ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించా’మని హీరోయిన్, నిర్మాత పోతిరెడ్డి హేమలత రెడ్డి అన్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శకుడు కె.గోవర్థన్ అన్నారు.