breaking news
new faculty
-
టీచర్లకు టెస్ట్లు!
సాక్షి, హైదరాబాద్:ఐఐటీల్లో ఇంజనీరింగ్ విద్యా బోధనలో నాణ్యతాప్రమాణాల పెంపు దిశగా చర్యలను ఐఐటీల కౌన్సిల్ వేగవంతం చేసింది. బోధనలో నాణ్యత తగ్గిపోతుండటంతో అంతర్జాతీయ స్థాయిని అందుకోలేకపోతున్నామని భావనకొచ్చింది. అందుకే ప్రస్తుత స్థానాన్ని మెరుగు పరుచుకోవడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చేలా చర్య లు చేపడుతోంది.ఇందులో భాగంగా ఐఐటీలకు అకడమిక్ ఫ్రీడంతోపాటు వివిధ ఐఐటీల్లో కొత్త అధ్యాపకుల బోధన తీరుతెన్నులపైనా సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.అధ్యాపకులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ఇటీవల జరిగిన కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. మూడేళ్ల తర్వాత మూల్యాంకనం... పీహెచ్డీ పూర్తి చేసిన వారికి అనుభవం లేకపోయినా ప్రతిభావంతులైన వారిని ఖాళీగా ఉన్న స్థానాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించి మూడేళ్ల తరువాత వారి పనితీరును ఐఐటీ అంతర్గత కమిటీలతో మూల్యాంకనం చేస్తారు. 5.5 ఏళ్ల తరువాత ఫ్యాకల్టీ పనితీరు, పరిశోధన, బోధన, తదితర అంశాల్లో ఎక్స్టర్నల్ కమిటీతో సమీక్షించి వారికి అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించాలా? లేదా బయటకు పంపించాలా? అన్న విషయాన్ని తేలుస్తారు. అంటే ఐదున్నరేళ్ల పాటు వారు కాంట్రాక్టు లేదా తాత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ కమిటీ వాల్యుయేషన్ తరువాతే వారి రెగ్యులరైజేషన్ అంశం తేల్చాలని, ఈ విధానాన్ని కొత్తగా నియమితులయ్యే వారికే వర్తింపజేయాలన్న ఆలోచనలో ఉంది. అలాగే అధ్యాపకులపై అడ్మినిస్ట్రేటివ్ పని భారాన్ని తగ్గించనున్నారు. దీంతో వారు పరిశోధనల పట్ల ప్రత్యేక శ్రద్ధవహిస్తారని, తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతుందని కౌన్సిల్ భావిస్తోంది. వెనుకబడితే బీఎస్సీ ఇంజనీరింగ్... ఐఐటీల్లో చేరే విద్యార్థులు సాధారణ విద్యార్థులకంటే కొంత ప్రతిభ కలిగిన వారే అయినా, వాటిల్లో చేరిన అందరూ ఒకేలా ఉండరు. వారి ప్రతిభలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వెనుకబడిన వారి కోసం బీఎస్సీ ఇంజనీరింగ్ చదివే అవకాశాన్ని కల్పించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులు తమ ప్రథమ సంవత్సరం (రెండో సెమిస్టర్) తర్వాత తమ సామర్థ్యాలను,రెండో సెమిస్టర్లో వారికి వచ్చే క్రెడిట్స్ను బట్టి,బీటెక్ కొనసాగకుండా బీఎస్సీ ఇంజనీరింగ్ చదువుకోవచ్చు.మూడేళ్లకే ఈ డిగ్రీని ఐఐటీలు అందజేయాలని కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని నిబంధనలను ఐఐటీలే సొంతంగా రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేసింది. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం.. ఐఐటీల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచి బలోపేతం చేసేందుకు ఐఐటీల కౌన్సిల్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి వర్సిటీల్లో దేశంలోని ఐఐటీలు, విద్యా సంస్థలు టాప్ 250–300 స్థానాల్లోనే ఉన్నాయి. ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన సర్వేలో ఇదే తేలింది. ఈ నేపథ్యంలో రీసెర్చ్, డెవలప్మెంట్, ప్రమాణాల పెంపులో అధ్యాపకులు కచ్చితమైన బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడుతోంది. అందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఐఐటీలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తమే కాకుండా పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. పరిశోధనలకు పెద్దపీట దేశంలోని ఐఐటీలతోపాటు ఇండియన్ వర్సిటీలకు చెందిన ప్రముఖులు అనేక మంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్నారు. అయినా దేశీయ విద్యా సంస్థలకు భారీగా నిధులను రాబట్టుకోలేకపోతున్నామన్న అంచనాకు కౌన్సిల్ వచ్చింది. హార్వర్డ్ వర్సిటీకి పూర్వ విద్యార్థుల నుంచి ఏడాదికి దాదాపు రూ. 800 కోట్లొస్తే.. 2017లో ఐఐటీ మద్రాసు రూ. 55 కోట్లే రాబట్టుకోగలిగింది. 2016లో అమెరికన్ వర్సిటీలు పూర్వ విద్యార్థుల నుంచి దాదాపు 535 బిలియన్ డాలర్లు సమకూర్చుకోగా, అందులో 25 టాప్ వర్సిటీలు 52 శాతం నిధులను పొందాయి. దేశంలోని విద్యా సంస్థలు కూడా ఆ స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ఐఐటీల్లో చదువుకొని విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల సంపాదన నుంచి కనీసంగా ఒక శాతం మొత్తాన్ని ఐఐటీల అభివృద్ధికి వెచ్చించాలని విజ్ఞప్తి చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల సమీక్ష... ఐఐటీల్లో విభాగాల వారీగా ఉన్న అకడమిక్ కమిటీల ఆధ్వర్యంలో కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను సమీక్షించేందుకు చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక సెమిస్టర్ పూర్తయ్యాక ఆయా కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలపైనా విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేలా చర్యలు తీసుకుంది. వారి సూచనలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడంతోపాటు బోధనలో నాణ్యతాప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపడుతోంది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకో!
♦ వైవీయూలో 68 అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధం ♦ నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ♦ ప్రతిభకు పట్టం కట్టేలా చర్యలు తీసుకోవాలంటున్న నిరుద్యోగులు వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయానికి త్వరలో కొత్త అధ్యాపకులు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీని చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఇందులో భాగంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో 3 ప్రొఫెసర్లు, 18 అసోసియేట్ ప్రొఫెసర్లు, 47 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ నియామకాలను రెండు విడతలుగా చేపట్టనున్న నేపథ్యంలో తొలివిడత నియామక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని ఉన్నత విద్య కార్యాలయంలో వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్లతో ఖాళీల భర్తీ, నియామక ప్రక్రియ విధానంపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియడంతో పాటు పూర్తి స్థాయి మార్గదర్శకాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బోధనేతర సిబ్బంది భర్తీ లేనట్టేనా? కడప శివారులో 2006లో విశ్వవిద్యాలయంగా ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ హయాంలో నియామక ప్రక్రియ శరవేగంగా సాగింది. ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చితే అధ్యాపక పోస్టులును బాగానే భర్తీ చేయగలిగారు. విశ్వవిద్యాలయానికి 33 ప్రొఫెసర్, 61 అసోసియేట్ ప్రొఫెసర్ , 109 అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని అప్పట్లో గుర్తించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 14 మంది ఆచార్యులు, 12 మంది అసోసియేట్, 89 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. వాస్తవానికి ఇంకా చాలా విభాగాల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నా విద్యార్థుల నిష్పత్తి, లభ్యత తదితర అంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగానే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా 2012లో పలు విభాగాల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ పలువురు కోర్టును ఆశ్రయించడంతో అచార్యుల పోస్టులు మినహా మిగిలినివి నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ సిబ్బందిది కీలకపాత్రే. వైవీయూలో నాన్ టీచింగ్ విభాగంలో 22 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది పని చేస్తున్నారు. 143 మంది టైంస్కేల్ కింద, 60 మంది అవుట్ సోర్సింగ్ విభాగం, మరో 51 మంది డైలీవేజస్ కింద పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్ విభాగంలో 79 ఖాళీల భర్తీ గురించి పట్టించుకోలేదు. ప్రతిభకు పట్టం కట్టేరా..? విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల్లో తమవారిని నియమించుకునేందుకు అధికారంలో ఉన్న నాయకులు ప్రయత్నించడం పరిపాటి. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ర్టంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటిలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, సానుభూతి పరులకు చోటు కల్పించింది. దీంతో నియామక ప్రక్రియ సజావుగా సాగుతుందా.. లేక సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తారా అన్న అనుమానం అందరిలో తలెత్తుతోంది.