ఖాకీ దూకుడు
కొందరి దుందుడుకు చర్యలతో మసకబారుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట
వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి
చేయిజారి.. ఆపై కట్టుకథలు చెబుతున్న వైనం
కమిషనరేట్పై దృష్టి సారించిన హోంశాఖ
విజయవాడ : శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కొందరు పోలీసుల దుందుడుకు చర్యలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ప్రజలపై అకారణంగా చేయిచేసుకోవడం ఇటీవల నగర పోలీసులకు పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం బైక్ వెళ్తున్న యువకులను అడ్డుకుని దాడిచేయడంతో పాటు వారిపై కేసు కూడా నమోదు చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటన మరువకముందే పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంచలనం సృష్టించింది. దీంతో పోలీసుల దురుసు ప్రవర్తనపై హోం శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రత్యేక నిఘా విభాగం ఇటీవల నగర పోలీస్ కమిషనరేట్తో పాటు జిల్లాలో జరిగిన పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి
పెనమలూరు పోలీసుల అదుపులో ఉన్న గన్నవరానికి చెందిన పుల్లా రమేష్ అనే యువకుడు మంగళవారం రాత్రి 11.30 గంటలకు అనుమానాస్పద స్థితిలో మరణించడం జిల్లాలో సంచలనం సృష్టించింది. తాము రమేష్ను రామవరప్పాడు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకోగా, తన జేబులో ఉన్న కొంగలను చంపేందుకు వినియోగించే మందు మింగాడని, ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే మృతిచెందాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల మాటలను రమేష్ బంధువులు ఖండిస్తున్నారు. చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నాడనే అనుమానంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పెనమలూరు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారని చెబుతున్నారు. పోలీస్స్టేషన్లో కొట్టడం వల్లే రమేష్ మృతిచెంది ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెబుతున్నట్లే విష గుళికలు మింగిన వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి ఐదు నిమిషాల్లోపు తీసుకువెళ్లవచ్చని, అలా చేసి ఉంటే బతికేవాడు కదా.. అని బంధువులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారిస్తేనే రమేష్ మృతి వెనుక కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
దాడి చేశారు.. ఆపై కేసు కట్టారు..
బందరు రోడ్డులో పశువుల ఆస్పత్రి జంక్షన్ వద్ద సోమవారం రాత్రి ఇద్దరు యువకులపై పోలీసులు దాడిచేయడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన యంపాడ కల్యాణచక్రవర్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన స్నేహితుడు చొక్కా బాబూదుర్గారావు(బాబి)ని ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీకాంత్ తొలుత కొట్టారని, ఎందుకు దాడిచేస్తున్నారని ప్రశ్నించినందుకు తనను కూడా కొట్టారని, ఒక్క దెబ్బ మాత్రమే గుర్తుందని, ఉదయం కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నానని చక్రవర్తి వాపోయారు. మరోవైపు చక్రవర్తి, బాబీలపై కృష్ణలంక పోలీసులు కేసు కూడా నమోదుచేయడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నవారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్ ఉపయోగించామని, ఆ సమయంలో ఐదుగురు అక్కడికి చేరుకొని గొడవకు దిగారని, ఒకరిని ఒకరు నెట్టుకోవడంతో చక్రవర్తి కిందపడి గాయాలపాలయ్యాడని, తాను కూడా కిందపడబోయానని ఆర్ఎస్ఐ చెబుతున్నారు.
సాయం చేయకపోగా.. కేసు నమోదు..
ఆర్టీసీ బస్టాండ్లోని అవుట్పోస్ట్లో ఉన్న ఏఎస్ఐ మల్లికార్జునరావుపై సోమవారం రాత్రి దాడిచేశారని ఇద్దరు వ్యక్తులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదుచేయడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా కోదాడకు చెందిన ఇద్దరు నున్న గ్రామంలో ఉంటున్న తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. వారిలో శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీస్ అవుట్పోస్ట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి కొట్టి కనిపించకుండా పరారయ్యాడు. తనను కొట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీలు చూపించాలని అవుట్పోస్ట్లో ఉన్న ఏఎస్ఐ మల్లికార్జునరావును శ్రీనివాస్ కోరారు. సాధ్యం కాదని ఏఎస్ఐ చెప్పడంతో మాటామాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీనివాస్, అతని వెంట ఉన్న వ్యక్తిని ఏఎస్ఐ కృష్ణలంక పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. తనపై దాడిచేసి అవుట్పోస్ట్లోని కాగితాలను లాక్కుని పారిపోతున్నారని ఏఎస్ఐ కేసు పెట్టారు. వారిని రాత్రంతా స్టేషన్లో ఉంచి, మంగళవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు.
హోంగార్డు హడావుడితో ఇద్దరు దుర్మరణం
నాలుగు రోజుల క్రితం భవానీపురం రావిచెట్టు సెంటర్ వద్ద ఒక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో మెకానిక్ను తీసుకొచ్చేందుకు డ్రైవర్ వెళ్లాడు. ఈలోపు అక్కడి హోంగార్డు నానా హంగామా చేసి క్రేన్ ద్వారా లారీని తొలగించేందుకు ప్రయత్నించాడు. లారీ తాలూకు ఎవరూ లేకుండానే క్రేన్ డ్రైవర్తో లారీని అక్కడి నుంచి వేరే చోటుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి డివైడర్ మీదుగా వెళ్లింది. డివైడర్పై నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. హోంగార్డుపై కేసు నమోదు చేశారు.
జిల్లాలోనూ అనేక ఘటనలు..
మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్స్టేషన్లో మంగళవారం రాజమండ్రికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ అతను చిలకలపూడి పోలీసులకు చిక్కాడు. అతన్ని పోలీసులు తమదైన శైలిలో రోజుల తరబడి విచారణ చేయటంతో భరించలేక ఇనుప రేకుతో పీక కోసుకున్నాడు. బందరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జి.కొండూరు పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నివసించే సుజాత అనే వివాహిత వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె మృతికి ఓ హెడ్కానిస్టేబుల్ కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్స్టేషన్ ఎదుట ఫిబ్రవరి 5వ తేదీన ధర్నా నిర్వహించారు. దీంతో బాధ్యుడైన హెడ్కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
బందరు మండలం సీతారామపురానికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాస్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పోలీసులు అతన్ని నెలల తరబడి పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. పోలీసుల వేధింపులు భరించలేని శ్రీనివాస్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఏలూరు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు.
పెడన పోలీసుల అత్యుత్సాహం వల్ల రెండు నెలల క్రితం ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. శ్రీను అనే వ్యక్తిపై పెడన స్టేషన్లో కేసులు ఉన్నాయి. అతను పెడన బంటుమిల్లి రహదారిలో ద్విచక్ర వాహనంపై తన బంధువైన మహిళను తీసుకువెళుతుండగా ఎస్ఐ మణికుమార్తో పాటు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో శ్రీను నడుపుతున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. శ్రీనుతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు.
విమర్శలకు దారితీసిన సీపీ ప్రకటన
వరుసగా జరుగుతున్న పరిణామాలను కూలంకషంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం విడుదల చేసిన ప్రకటన పలు విమర్శలకు దారితీసింది. సత్యాన్వేషణ చేసే తీరిక, సామర్థ్యం, చేయాలనే తపన, ఆలోచన కొందరు జర్నలిస్టుల్లో లేవని, అందుకే పత్రికలు, మీడియాల్లో తప్పుడు కథనాలు ప్రచురించి, ప్రసారం చేస్తున్నారని, ఇది శాంతియుత పౌర జీవనానికి హాని కలిగిస్తున్నదని ఆయన పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.