breaking news
meet shops
-
చీకుల దుకాణం వద్ద వివాదం..యువకుల హత్య
కాకినాడ రూరల్: మాంసం చీకుల కొట్టు వద్ద వివాదం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. కాకినాడ ఏటిమొగ వెళ్లే ప్రధాన రోడ్డులో ఉన్న అశ్విని బార్అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో వ్యక్తి చావుబతుకుల మధ్య కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఏటిమొగకు చెందిన వనమాడి రాజు(30), పంతాడి దుర్గాప్రసాద్ అలియాస్ తులసి(35)మృతి చెందగా, చెక్కా రాజేష్ తీవ్రగాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏటిమొగకు వెళ్లే దారిలోని మూలారమ్మ(ధనమ్మ) గుడి సమీపంలో ఉన్న అశ్విని బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న బిర్యానీ షాపులో మాంసం చీకుల కోసం మంగళవారం రాత్రి పంతాడి నూకరాజు వెళ్లి రూ.50 పెట్టి చీకులు కొనుక్కున్నాడు. మరికొన్ని చీకులు పెట్టాలని షాపు యజమానిని అడిగాడు. అతను పెట్టలేదు. దీంతో అనుమతి లేకుండా చేత్తో తీసుకొని తినేశాడు. దీంతో దుకాణం యజమానికి పంతాడి నూకరాజుకి ఘర్షణ జరిగింది. అనంతరం ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోయారు. చీకుల వ్యాపారం చేస్తున్న వ్యక్తి వనమాడి రాజుకు బంధువు కావడంతో బుధవారం మధ్యాహ్న సమయంలో పంతాడి నూకరాజును వనమాడి రాజు రాత్రి గొడవ విషయం అడిగాడు. ఆ సమయంలో ఇరువురు మధ్య వివాదం చోటు చేసుకుంది. వనమాడి రాజు తన స్నేహితులైన పంతాడి దుర్గాప్రసాద్, చెక్కా రాజేష్తో కలసి వచ్చి మద్యం షాపులో మద్యం సేవిస్తుండగా నూకరాజు పొడవాటి బాకులాంటి కత్తిని తీసుకొచ్చి వనమాడి నూకరాజును విచక్షణారహితంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. రాజును కత్తితో పొడుస్తున్న సమయంలో నూకరాజును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అప్పటికే విచక్షణ కోల్పోయిన నూకరాజు పంతాడి దుర్గాప్రసాద్, చెక్కా రాజేష్లపైనా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇరువురిని 108 అంబులెన్స్లో జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో పంతాడి దుర్గాప్రసాద్ మృతి చెందాడు. చెక్కా రాజేష్ చావుబతుకుల మధ్య జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఇరువురు వ్యక్తులను హత్య చేసి, మరో వ్యక్తి తీవ్ర గాయాలకు కారణమైన పంతాడి నూకరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోర్టు పోలీస్స్టేషన్ సీఐ రాజశేఖరరావు పర్యవేక్షణలో ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, దుర్గాప్రసాద్లు మృతి చెందడంతో ఏటిమొగ ప్రాంతంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజు, దుర్గాప్రసాద్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. -
ముక్క లేకుండా ముద్ద దిగదని...
రాయ్ బరేలీ(ఉత్తరప్రదేశ్): మాంసం బదులు శాకాహారం వడ్డించినందుకు బంధువులు వివాహ విందు భోజనాన్ని బహిష్కరించారు. దీంతో ఆ ఇంటాయన చిన్నబుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లో మాంసదుకాణాల మూసివేత ఎఫెక్ట్ ఇది. భోజిపుర పోలీస్స్టేషన్ పరిధిలోని మొరాదాబాద్ గ్రామానికి చెందిన హమీద్ అన్సారీ తన కుమార్తె పెళ్లి సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రంలోని అనుమతులు లేని మాంసం దుకాణాలను అక్కడి ప్రభుత్వం మూసివేయించటంతో ఆయనకు ఇబ్బంది వచ్చి పడింది. సాధారణంగా విందుల్లో ఉండాల్సిన మాంసాహార పదార్థాలను వడ్డించేదెలాగని ఆయన మథనపడ్డారు. మామూలు రోజుల్లో కిలో రూ.150కే లభించాల్సిన గేదె మాంసం ధర రూ.400కు, మేక మాంసం అయితే రూ.350 నుంచి రూ.600కు, చికెన్ ధర రూ.260 నుంచి రెట్టింపు పెరిగింది. అయినప్పటికీ ఎంతోకొంత కొనుగోలు చేయాలన్న అన్సారీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన శాకాహార మటర్ పనీర్, మష్రూమ్ కర్రీ, దాల్ మఖ్నీ వంటివి చేయించారు. ఈ విందుకు హాజరైన బంధు మిత్రులు ఆయనపై గుర్రుమన్నారు. ముక్క లేకుండా ముద్ద దిగేదెలాగని ప్రశ్నించారు. ఈ భోజనం తినలేమంటూ ఆ విందును బహిష్కరించారు.