breaking news
library employees
-
గ్రంథాలయ ఉద్యోగులకు 2 నెలల నుంచి జీతాల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రంథాలయ సిబ్బందికి, రిటైరైన వారికి రెండు నెలలుగా వేతనాలు, పెన్షన్లు ఇవ్వడంలేదు. కలెక్టర్లతో మొరపెట్టుకున్న తమ వేదన సంబంధిత మంత్రి లోకేశ్కు వినిపిస్తుందేమోనని వారు ఆశగా చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యోగుల వేతనాల గ్రాంటును విడుదల చేయకపోవడంతో డిసెంబర్ నెల నుంచి వేతనాలు, పెన్షన్లకు ఇబ్బంది ఎదురైంది. గ్రంథాలయ ఉద్యోగుల వేతనాల వార్షిక గ్రాంటుగా బడ్జెట్లో రూ.134 కోట్లు కేటాయించారు. దీన్లో రూ.37 కోట్లను మాత్రమే ఆర్థికశాఖ విడుదల చేసింది.మిగతా మొత్తాన్ని విడుదల చేయబోమని, లైబ్రరీల సెస్ నుంచి వేతనాలు, పెన్షన్ తీసుకోవాలని ఆర్థికశాఖ చెప్పేసింది. దీంతో 1,600 మందికి డిసెంబర్, జనవరి నెలల వేతనాలు, పెన్షన్లు ఇవ్వలేదు. పెద్ద జిల్లాల్లో వసూలైన సెస్ నుంచి కొంతమందికి పెన్షన్లు మాత్రం చెల్లించారు. సెస్ నుంచి వేతనాలు, పెన్షన్లు తీసుకోవాలన్న ఆర్థికశాఖ సూచన నిబంధనలకు విరుద్ధం. లైబ్రరీల సెస్ను ఆయా గ్రంథాలయాల నిర్వహణతో పాటు దినపత్రికలు, నెలవారీ సమాచార పుస్తకాల కొనుగోలుకు వినియోగించాలి. వేతనాలు, పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయకుండా నిలిపేశారు.గ్రంథాలయాలు పత్రికల బిల్లులు, విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు కూడా నిధుల్లేకుండా చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. పలు జిల్లాల్లో వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు, పెన్షనర్లు కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు. మంత్రి లోకేశ్ ఇప్పటికైనా స్పందించి వేతనాలు, పెన్షన్లు ఇచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. సెస్ నుంచి జీతాలు తీసుకోమనడం దారుణం ప్రజలు చెల్లించే సెస్ నుంచి గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పింఛన్లు ఇవ్వాలని ఆర్థికశాఖ చెప్పడం దారుణమని జిల్లా గ్రంథాలయసంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర కనీ్వనర్ కె.దేవదాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేతనాల గ్రాంటుగా బడ్జెట్లో కేటాయించిన రూ.134 కోట్లను మూడువిడతల్లో విడుదల చేసేదని, దీంతో వేతనాలు, పెన్షన్కు ఇబ్బందులు ఎదురవలేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వార్షిక గ్రాంటులో రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేయటంతో సమస్య వచ్చిందని తెలిపారు. సెస్ను గంథ్రాలయాల నిర్వహణకు, దినపత్రికల బిల్లులు, కరెంట్ బిల్లులు చెల్లించడానికే వినియోగించాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీతాల గ్రాంటును విడుదల చేయాలని ఆయన కోరారు. పదోన్నతి వచి్చనా రెండు నెలల నుంచి వేతనాల్లేవు గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శి నుంచి, సీనియర్ అసిస్టెంట్ నుంచి మండల స్వర్ణ గ్రామ ఆఫీసర్లుగా పదోన్నతి పొందినవారికి రెండునెలల నుంచి వేతనాల్లేవు. ఒకపక్క పదోన్నతి వచ్చిందన్న ఆనందం నెల తిరగ్గానే ఆవిరైపోయింది. పదోన్నతి పొందిన ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్లో కోడ్ను నిర్ధారించకపోవడంతో వారికి డిసెంబర్, జనవరి నెలల వేతనాలు రాలేదు. రెండునెలలుగా జీతాల్లేకపోవడంతో కుటుంబాల పోషణ కష్టంగా ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. -
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సాక్షి, అమరావతి: జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయం వద్ద రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమానంగా జిల్లా గ్రంథాలయ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సీఎం గొప్ప మనస్సుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు వెన్నుదన్నుగా ఉంటామని గ్రంథాలయ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పూర్ణమ్మ, కార్యదర్శి రవికుమార్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు పాల్గొన్నారు. -
010 పద్దు ద్వారా వేతనాలకు కృషిచేస్తా
విజయవాడ (గాంధీనగర్) : గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించడానికి కృషిచేస్తానని మానవవనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం రామా ఫంక్షన్హాలులో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాలను ఆధునీకరించి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం వేగం పుంజుకోవడం వలన గ్రంథాలయాలకు ఆదరణ తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వాడుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. గ్రంథాలయ సంస్థలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, నివేదిక వచ్చిన తర్వాత వారికి మేలు జరిగేలా చూస్తామన్నారు. గ్రంథాలయ ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన దేవదాసు, ఉపాధ్యక్షులు కె శివశంకరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి వెంకటరమణ, విజయకుమార్ పాల్గొన్నారు.


