breaking news
leave India
-
నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నా నచ్చడం లేదట!
నెలకు దాదాపు రూ.4 లక్షల ఆదాయం, ఖర్చులు తక్కువ, మంచి పొదుపు.. అయినప్పటికీ భారత్లో భవిష్యత్తు కనిపించడం లేదని, విదేశాలకు వెళ్లి స్థిరపడాలని కోరుకుంటున్న 26 ఏళ్ల రిమోట్ ఉద్యోగి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికతో పాటు యువతలో పెరుగుతున్న వలస ధోరణిపై మరోసారి చర్చకు దారితీసింది.'ఫిక్స్ యువర్ ఫైనాన్స్' అనే పోడ్కాస్ట్లో పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అన్షుమన్ శర్మతో మాట్లాడిన డేనియల్ (మార్చిన పేరు కావచ్చని భావిస్తున్నారు) ప్రస్తుతం యూరప్కు చెందిన ఒక సంస్థలో రిమోట్గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. తనకు నెలకు సుమారు 3,700 యూరోలు జీతంగా వస్తోందని, భారత కరెన్సీలో అది సుమారు రూ.4 లక్షలు ఉంటుందని వివరించాడు. తన నెలవారీ ఖర్చులు కేవలం రూ.1.20 లక్షల వరకు మాత్రమే ఉండటంతో మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తున్నానని చెప్పాడు.ఆస్ట్రేలియాకు వెళ్తాడట..ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెన్సీ (PR) కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్లు డేనియల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన అన్షుమన్ శర్మ, ప్రతి నెలా రూ.1.5 లక్షలను రికరింగ్ డిపాజిట్ (RD)లో పెట్టుబడి పెడితే, కొన్ని నెలల్లోనే పీఆర్ ప్రక్రియకు అవసరమైన నిధులు సిద్ధమవుతాయని సూచించారు."డబ్బు కాదు.. జీవన నాణ్యత ముఖ్యం"ఇంత మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఎందుకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నావని అడగగా, డేనియల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తన నిర్ణయం పూర్తిగా జీవన నాణ్యత (Quality of Life), పాలన, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై ఆధారపడి ఉందని చెప్పాడు. భారత్లో దీర్ఘకాలికంగా తన కుటుంబానికి ఆశించిన స్థాయి అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు.అన్షుమన్ శర్మ కూడా యువతలో పెరుగుతున్న వలస ఆలోచనలపై మాట్లాడుతూ, అధిక పన్నులు, కాలుష్యం, విద్యా వ్యవస్థలోని సమస్యలు, ఉద్యోగాలపై అనిశ్చితి వంటి కారణాలు చాలా మందిని విదేశాల వైపు ఆకర్షిస్తున్నాయని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. "ఆస్ట్రేలియాలో కూడా ఆదాయపు పన్ను చాలా ఎక్కువే" అని కొందరు గుర్తుచేశారు. మరికొందరు "అక్కడ జీవన వ్యయం కూడా భారీగా ఉంటుంది. నెలకు 3,700 యూరోలు లేదా దానికి సమానమైన ఆదాయంతో ఆస్ట్రేలియాలో పెద్దగా పొదుపు చేయడం కష్టమే" అని వ్యాఖ్యానించారు.ఇంకొందరు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాత్రం, "విదేశాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ భారత్లో కుటుంబ బంధాలు, తక్కువ జీవన వ్యయం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు" అని అభిప్రాయపడ్డారు.వాస్తవ పరిస్థితి ఏమిటి?ఇటీవలి సంవత్సరాల్లో ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు నైపుణ్యం కలిగిన వలసదారులపై ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. అలాగే అక్కడ ఇంటి అద్దెలు, ఆరోగ్య సేవలు, జీవన వ్యయం గణనీయంగా పెరిగాయి. అందువల్ల విదేశాలకు వెళ్లే ముందు ఉద్యోగ భద్రత, వీసా నిబంధనలు, పన్నులు, జీవన వ్యయం, కుటుంబ అవసరాలు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
నరేష్ గోయల్కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గ్యారంటీ సొమ్ము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి విదేశాలకు వెళ్లాలనుకుంటే 18వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని న్యాయమూర్తి సురేష్ కైత్ స్పష్టం చేశారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్ను సవాల్ చేస్తూ, దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతిని కోరుతూ గోయల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా గోయల్ ఆయన భార్య అనిత దుబాయ్కు వెళుతుండగా మార్చి 25 న విమానాన్ని దింపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగబ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా, డైమండ్ వ్యాపారి నీరవ్మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్కు తాజా షాక్ తగిలింది. -
'48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపో..'
న్యూఢిల్లీ: గూఢచర్యం నిర్వహిస్తున్నాడనే కారణాలతో భారత్లోని పాక్ హైకమిషన్లో పనిచేస్తున్న మొహమ్మద్ అక్తర్ను పోలీసులు అరెస్టు చేయగా అతడిని 48గంటల్లో భారత్ విడిచిపెట్టి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం తెలియజేశారు. పాక్ హైకమిషన్ కార్యాలయంలో అక్తర్ వీసా సెక్షన్లో పనిచేస్తున్నాడని, అతడి దౌత్య పరమైన రక్షణ ఉందని వికాస్ స్వరూప్ చెప్పారు. ఈ కారణంతోనే అరెస్టు చేయడం లేదని అన్నారు. కమిషన్లో పనిచేస్తున్న అతడు గోప్యంగా మరో ఇద్దరు ఉద్యోగుల నుంచి భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను సేకరిస్తూ గూఢచర్యం నిర్వహిస్తున్నాడని, ఇలాంటి చర్యలకు దిగిన అతడికి ఇక భారత్లో పనిచేసే అవకాశం లేదని, 48గంటల్లో దేశం నుంచి పంపించాలంటూ ఇప్పటికే పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్కు చెప్పినట్లు తెలిపారు. అక్తర్ను అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించామని, అతడిపై ఏ అధికారి కూడా చేయి చేసుకోలేదని, పాక్ చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమే అని అన్నారు. ఇప్పటికే అక్తర్ కు సహాయం చేసిన పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలను సదరు ఉద్యోగులు దొంగిలించి అక్తర్కు అందించినట్లు తెలుస్తోంది.


