'టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జాలు'
–సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బయ్య
నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ నేతల భూ కబ్జాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు విడవలూరు వెంకటేశ్వర్లునాయుడు మరి కొంత మంది దళితుల భూములను ఆక్రమించుకున్నారని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందిటి సుబ్బయ్య పేర్కొన్నారు. అలాగే ఈ విషయంలో కలుగజేసుకోవద్దంటూ తనపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
నెల్లూరులోని అంబేడ్కర్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత వ్యక్తితో కలసి సుబ్బయ్య మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని నాగాయగుంట గ్రామానికి చెందిన పోలూరు మాధవి, పోలూరు జయమ్మకు సర్వే నంబరు 835–1లో య.4.91 సెంట్లు భూమిని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరులు అక్రమంగా గ్రావెల్ తవ్వకం జరుపుతూ ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు.
బాధితుల నుంచి బలవంతంగా ఇటీవల పలు పేపర్లమీద సంతకాలు కూడా తీసుకున్నారన్నారు. ఈ విషయంపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాగే అక్కడ ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మార్వో స్పందిస్తూ ఆక్రమించుకున్న భూమిని తిరిగి బాధితులకు ఇచ్చే విధంగా చూడాలని స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా రాశారన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా ఎమ్మెల్యే ఒత్తిడితో పట్టించుకోలేదని వాపోయారు. తక్షణమే మా మాదిగలకు రావాల్సిన భూమిని ఆక్రమణదారుల నుంచి ఇప్పించక పోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.