ఐదు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
* యూపీకి రామ్నాయక్, గుజరాత్కు ఓపీ కోహ్లీ
* రాష్ట్రపతి భవన్ ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఐదురాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్కు బీజేపీ సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్నాయక్(80)ను నియమించగా, ఢిల్లీకి చెందిన మరో సీనియర్ నేత ఓపీ కోహ్లీ(78)ని గుజరాత్ గవర్నర్గా నియమించారు. అలాగే యూపీ మాజీ స్పీకర్ కేసరీనాథ్ త్రిపాఠీ (79) పశ్చిమబెంగాల్ గవర్నర్గా నియుక్తులయ్యారు. మరో సీనియర్ నేత బల్రామ్దాస్ టాండన్ (87) ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు.
బీజేపీ ఈశాన్యరాష్ట్రాల వర్కింగ్ గ్రూప్ సభ్యుడు పద్మనాభ ఆచార్యకు నాగాలాండ్ బాధ్యతలు అప్పగించారు. త్రిపుర గవర్నర్గా ఉన్న పురుషోత్తమన్ రాజీనామా చేసిన నేపథ్యంలో తాత్కాలికంగా ఆ బాధ్యతలను కూడా పద్మనాభ ఆచార్యకే అప్పగించారు. ఇంతవరకు నాగాలాండ్ బాధ్యతలను కూడా పురుషోత్తమన్ చూసేవారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో అధికారంలోకి రాగానే గతంలో యూపీఏ సర్కార్ నియమించిన పలువురు గవర్నర్ల రాజీనామాకు ఒత్తిడి చేసిన బీజేపీ ప్రభుత్వం స్వంత పార్టీ నేతలకు బహుమతిగా పదవుల పందేరం చేసింది. వీరంతా పార్టీని ఏళ్లతరబడి అంటిపెట్టుకున్న కురువృద్ధులే కావడం గమనార్హం.