జస్టిస్ మంజునాథ అధ్యక్షతన బీసీ కమిషన్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు బీసీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డు జడ్జి జస్టిస్ కేఎల్ మంజునాథ అధ్యక్షతన ఏపీ బీసీ కమిషన్ సభ్య కార్యదర్శితో ఈ బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కాల పరిమితిని మూడేళ్లుగా తాజాగా జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. అయితే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీల్లోకి చేర్చే అంశాన్ని పరిశీలించే ప్రతిపాదనను ఈ ఉత్తర్వుల్లో చేర్చకపోవడం గమనార్హం.
అయితే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించడంతో కాపులు కన్నెర్ర చేసి ఉద్యమబాట పట్టారు. దీంతో బీసీ కమిషన్ను నియమిస్తామని, తొమ్మిది నెలల్లోగా ఆ కమిషన్ నివేదిక ఇస్తుందని, ఆ వెంటనే కాపులను బీసీల్లోకి చేర్చుతామని మూణ్నెళ్ల క్రితం ప్రకటించారు. ప్రస్తుత కమిషన్ కాలపరిమితి మూడేళ్లుగా నిర్ణయించడం కాలయాపనకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన తక్షణమే కాపులను బీసీల్లోకి చేర్చుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. 19 నెలల తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.