అది కేసీఆర్ అల్లిన పిట్టకథ
స్టీఫెన్సన్ వాంగ్మూలంపై ‘ఓటుకు కోట్లు’ కేసు నిందితుడు మత్తయ్య
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ నాంపల్లి కోర్టులో ఇచ్చిన వాంగ్మూ లం సీఎం కేసీఆర్, ఏసీబీ కలసి నేర్పించిన పిట్టకథ అని ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడైన జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఏపీలో తలదాచుకున్న మత్తయ్య స్వదస్తూరితో రాసిన ప్రకటనను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసు అంతా తప్పుల తడక అని, రేవంత్ను ఇరికించేందుకు స్టీఫెన్సన్తో కేసీఆర్ నాటకం ఆడించారని ఆరోపించారు. ఒక క్రైస్తవ మత కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరేందుకు తాను స్టీఫెన్సన్ను కలిశానన్నారు. ఆ సమయంలో కేసీఆరే రూ.80 లక్షలు తీసుకొని మోసం చేసినట్లుగా స్టీఫెన్ చెప్పారని మత్తయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుల పాలైన స్టీఫెన్సన్ తక్కు వ వడ్డీకి డబ్బులు ఇప్పించాలని తనను కోరాడన్నారు.
స్టీఫెన్సన్ కేసీఆర్ కుట్రలో పావుగా మారారని, మెజిస్ట్రేట్ ముందు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తానెక్కడికీ పోలేదని, తన అత్తగారి ఊరు గుంటూరుకు వెళ్లానన్నారు. తనపై టీఆర్ఎస్, ఏసీబీ, పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.