breaking news
jalalitha
-
మిస్టరీగానే జయలలిత మరణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. మిస్టరీనీ చేదించేందుకు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్, అపోలో యాజమాన్యం మధ్య పోరు సాగుతోంది. విచారణ కమిషన్ను అపోలో అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, అడ్డుకునే చర్యల వెనుక దురుద్దేశం, వాస్తవాలను దాచిపెట్టే ధోరణి దాగి ఉందని కమిషన్ ఆరోపిస్తోంది. అన్నాడీఎంకేను 2011 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చిన జయలలిత ఆ తరువాత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయభేరీ మోగించారు. అయితే సీఎం అయిన కొద్ది నెలలకే దురదృష్టవశాత్తు అస్వస్థతకులోనై అదే ఏడాది సెప్టెంబరు 22న అపోలో ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. కేవలం జ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతున్న ఆమె కొద్దిరోజుల్లోనే డిశ్చార్జి అవుతారని అపోలో వైద్యులు ప్రకటించారు. అన్నాడీఎంకే నేతలు సైతం అదే విషయాన్ని ప్రచారం చేశారు. అయితే అందుకు విరుద్ధంగా అదే ఏడాది డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. జయ ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదన్నట్లుగా సాక్షాత్తు అపోలో వైద్యులే చెప్పినప్పుడు ఆమె ఎలా మరణించారని అందరూ అనుమానించారు. పైగా జయను చూసేందుకు ఎవరినీ అనుమతించకపోవడం, గోప్యం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జయ మరణం ఒక మిస్టరీ అంటూ అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సైతం ప్రకటనలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే డిమాండ్ చేసింది. విచారణకు కమిషన్ నియామకం.. ఆమె మరణంపై అనుమానాలు నెలకొనడంతో ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించింది. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తూ రెండేళ్లుగా విచారణ జరుపుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే నేతలు, శశికళ బంధువులతో పాటు జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని కూడా పలుమార్లు విచారించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాల పనితీరుపై వైద్యులు భిన్నమైన సాక్ష్యం చెప్పారు. ఇదిలా ఉండగా విచారణ కమిషన్ తీరుపై అపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘మా ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది జయకు సంపూర్ణమైన సేవలతో సహకరించారు. జయకు అందించిన చికిత్సపై నివేదికను కమిషన్కు సమర్పించినా కొందరు తప్పుపడుతున్నారు. మేము సమర్పించిన నివేదికపై 21 శాఖలకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వైద్యులు, నిపుణులతో కూడిన బృందాన్ని నియమించి పరిశీలించాలి. అప్పటి వరకు కమిషన్ విచారణపై స్టే విధించాలి. అపోలో వైద్యులకు విచారణ కమిషన్ జారీచేసిన సమన్లను రద్దు చేయాలి’ అని పేర్కొన్నారు. అయితే అపోలో దాఖలు చేసిన పిటిషన్ను ఏప్రిల్ 4న కోర్టు కొట్టివేసింది. మద్రాసు హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు...జయ విచారణ కమిషన్పై మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదికను దాఖలు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్గొగాయ్తో కూడిన బెంచ్కు ఈనెల ఒకటిన మరోసారి విచారణకు వచ్చింది. నివేదిక దాఖలుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ప్రభుత్వ నివేదిక దాఖలయ్యే వరకు విచారణ కమిషన్పై గతంలో విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అడ్డుకోవడం వెనుక అపోలో దురుద్దేశం– ఆర్ముగస్వామి ఇదిలా ఉండగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి సుప్రీంకోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేశారు. జయ మృతిపై విచారణ సరైన దిశగానే సాగుతోందని, జయకు అందించిన చికిత్స విషయంలో అపోలో ఆస్పత్రి నుంచి ఏదైనా తప్పులు బయటపడతాయనే భయంతో ఆస్పత్రి యాజమాన్యం నిషేధాన్ని కోరుతోందని విమర్శించారు. విచారణ కమిషన్ ముందుకు వైద్యులను పంపేందుకు అపోలో నిరాకరిస్తోందని చెప్పారు. అంతేకాకుండా జయ చికిత్స విషయంలో వాస్తవాలను అపోలో దాచిపెడుతోందని పేర్కొన్నారు. విచారణ కమిషన్ యథావిధిగా కొనసాగేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అలాగే అపోలో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని ఆర్ముగస్వామి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
స్క్రీన్ మీద తలైవిని తలపించేది ఎవరు?
అమ్మను బతికుండగా గుండెల్లో పెట్టుకున్నారు తమిళ జనం.ఇప్పుడు తెర మీద చూసి దండం పెట్టుకోవాలనుకుంటున్నారు.స్క్రీన్ తలైవి ఎవరు?స్క్రీన్ మీద తలైవిని తలపించేది ఎవరు?జయలలిత జీవితంపై తయారవనున్న సినిమాలు కుతూహలం రేపుతున్నాయి.ఇప్పుడు తమిళనాడులో అందరి దృష్టి ఒక డేట్ మీదే ఉంది.ఫిబ్రవరి 24, 2019.నిజానికి ఆ తేదీ చాలా దూరం ఉంది. అయినప్పటికీ హడావుడి మొదలైంది.ఎందుకు?ఏదైనా అద్భుతం జరగబోతోందా?అలాంటిదే.ఆ తేదీన ఒకే వ్యక్తి జీవితంతో నలుగురైదుగురు బయోపిక్లు మొదలెట్టాలనుకుంటున్నారు.అర్థమయ్యే ఉంటుంది.అవును.. జయలలిత జీవిత కథను సినిమాగా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే ఎప్పుడూ లేనట్లు విడివిడిగా నలుగురైదుగురు బయోపిక్కి టార్గెట్ పెట్టడం విశేషం.ఇంతకీ ఫిబ్రవరి 24 ప్రత్యేకత ఏంటో చెప్పలేదు కదూ.అది జయలలిత పుట్టినరోజు. మరి.. ఆ రోజు ఆమె జీవిత చరిత్రతో ఎన్ని సినిమాలు మొదలవుతాయో కానీ.. ప్రస్తుతానికి ప్లాన్ చేస్తున్న దర్శక–నిర్మాతల గురించి, ‘జయలలిత బయోపిక్లో నటించాలని ఉంది’ అని ఇప్పటికే తమ ఆసక్తి బయటపె ట్టిన కథానాయికల గురించి తెలుసుకుందాం. 2016 డిసెంబర్ 5. తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన రోజు. ‘అమ్మ’ అస్తమించిన రోజు. ‘కోలుకుంటున్నారు. ఇక డిశ్చార్జ్ అవ్వడమే ఆలస్యం’ అని ప్రకటించిన కొద్ది రోజులకే ‘తుది శ్వాస విడిచారు’ అనే షాకింగ్ న్యూస్. ప్రజల కోసం జీవించారు అని ప్రజలు అనుకోవడం వల్లే వారికి ఆ షాక్. అంతేనా? జయలలిత పట్టుదల ఉన్న మనిషి. పట్టుపట్టారంటే సాధిస్తారు. చదువులో మెరిట్ తెచ్చుకున్నా క్లాసికల్ డాన్స్లో టాప్ అనిపించుకున్నా ఈ పట్టుదల వల్లే. తల్లి సంధ్య సినిమా నటే అయినా కూతుర్ని నటిగా చూడాలనుకోలేదు. ఒకరోజు ఊరికే మేకప్ వేసుకున్నందుకు కుమార్తెను చెడామడా తిట్టారు. అలాంటిది ఆర్థిక పరిస్థితులకు తలవొంచి కూతుర్ని నటిని చేశారు. అయిష్టంగా వచ్చినా వృత్తికి న్యాయం చేయాలన్నది జయలలిత పట్టుదల. సాధించారు. వెండితెరను ఏలారు. ప్రముఖ నటుడు ఎంజీఆర్తో పరిచయం, ఆయన ద్వారా రాజకీయాల్లోకి రావడం, పలు సవాళ్లను ఎదుర్కోవడం.. ఇలా జయలలిత జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అన్ని సవాళ్లను అధిగమిస్తూ ప్రజలతో ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) అనిపించుకున్నారు. ఈ డైనమిక్ లేడీ జీవితంతో ఒక సినిమా అంటే అది సంచలనం. వచ్చే ఏడాది ఆమె జీవితాన్ని వెండితెరపై చూడబోతున్నాం. ఒక సినిమా కాదు.. మూడు నాలుగు సినిమాల రూపంలో. శశికళ దృష్టి కోణంలో వర్మ సినిమా ‘అమ్మ’ చనిపోయాక ఆమె బయోపిక్కి సంబంధించిన ప్రకటన వచ్చింది ముందుగా రామ్గోపాల్ వర్మ నుంచే. జీవిత కథలు తీయడం, వాస్తవ సంఘటనలతో సినిమాలు తీయడం వర్మకు చాలా ఈజీ. ‘రక్తచరిత్ర’, ‘26/11 ముంబై ఎటాక్స్’, ‘వంగవీటి’ వంటి బయోపిక్స్తో ఆయన రాటుదేలి ఉన్నారు. వర్మ తీస్తున్న సినిమాలు వచ్చినవి వచ్చినట్లు వెళ్లిపోతున్న సమయంలో ఈ సినిమాలు ‘స్పెషల్’గా నిలిచాయి. సో.. బయోపిక్స్ తీయడంలో వర్మని కొట్టేవాళ్లు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. జయలలిత బయోపిక్ని ఆమె ఆప్తమిత్రురాలు శశికళ పాయింటాఫ్ వ్యూ నుంచి తీస్తానని వర్మ పేర్కొన్నారు. మరి.. వర్మ మైండ్లో ఉన్న బయోపిక్ కెమెరా ముందుకి వచ్చేదెప్పుడో? వారంలో మూడు అనౌన్స్మెంట్లు జస్ట్ వారం అంటే వారమే అయింది విబ్రీ మీడియా సంస్థ అధినేత విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్ ప్రకటించి. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న విబ్రీ మీడియా జయలలిత జీవిత చరిత్రను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీయనుందని ఈ ప్రకటన సారాంశం. ‘మదరాస పట్టణం’, ‘దైవ తిరుమగళ్’ (తెలుగులో ‘నాన్న’), ‘అభినేత్రి’ తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకుడుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని ప్రారంభించి అదే రోజున టైటిల్ రోల్ చేసే నటి ఫస్ట్ లుక్ని విడుదల చేయబోతున్నారట. విష్ణు ఇందూరి ప్రకటించిన తర్వాత జయలలిత బయోపిక్కి సంబంధించి మరో ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు మిస్కిన్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన దర్శకురాలు ప్రియదర్శిని తాను కూడా జయలలిత బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. ‘‘నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత ఎదుర్కొన్న సవాళ్లని ఫోకస్ చేస్తూ ఈ సినిమా తీయాలనుకుంటున్నాను’’ అన్నారు ప్రియదర్శిని. వచ్చే నెల 20న నటీనటులను ప్రకటించాలనుకుంటున్నారట. ప్రియదర్శినికి అనుభవం తక్కువ. కనుక ఈ సినిమా ఆమెకు ఓ సవాల్గా నిలువనుంది. అయితే ప్రియదర్శిని నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సీనియర్ డైరెక్టర్ భారతీరాజా నుంచి ఓ ప్రకటన వచ్చింది. జయలలిత బయోపిక్ తాను తీయబోతున్నట్టు హల్చల్ సృష్టించారాయన. బాలీవుడ్ నిర్మాత ఆదిత్యా భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెబుతున్నారు. జయలలిత పాత్రకు ఐశ్వర్యా రాయ్, అనుష్కల్లో ఎవరో ఒకర్ని తీసుకోవాలనుకుంటున్నారని ఫీలర్స్ వదులుతున్నారు. ఎంజీఆర్ పాత్రకు కమల్ హాసన్నుగాని, మోహన్లాల్ను గాని సంప్రదించాలనుకుంటున్నారట. ‘అమ్మ–పురట్చి తలైవి’ అనేది టైటిల్. అంటే.. ‘అమ్మ–విప్లవ నాయకురాలు’ అని అర్థం. మొదట డిసెంబర్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. కానీ జయలలిత బర్త్డే నాడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారట. జయ జీవితం... నవరసభరితం ఆమె అందగత్తె. ఎందరికో కలల రారాణి. ఎం.జి.ఆర్ వంటి సూపర్స్టార్కు కో స్టార్. సన్నిహితురాలు. రాజకీయాలలో పురుష సమాజాన్ని ఎదురొడ్డి నిలిచిన ధీశాలి. అసెంబ్లీలో చీర లాగబడి పరాభవంతో ప్రతిజ్ఞ బూనిన అభినవ ద్రౌపది. అదే సమయంలో పేదల పట్ల దయాళువు. సెంటిమెంట్ల పుట్ట. మరో స్త్రీకి నెచ్చెలి. ఇన్ని పార్శా్వలు బహుశా ఏ ఇతర వ్యక్తిలోనూ లేవు. అందుకే జయ జీవితాన్ని ఎన్ని బయోపిక్స్గా తీసినా జనం వాటిని తప్పక చూస్తారు. ఎందుకంటే ఎంత తీసినా ఆమె కథ ఇంకా మిగిలి ఉంటుంది కనుక. జయలలితగా ఎవరెవరు నటించాలని అనుకుంటున్నారు? మన సౌత్లో గడచిన 15 ఏళ్లల్లో తిరుగు లేని తార త్రిష. ఆమె తర్వాత ఎంతోమంది వచ్చినా త్రిష స్టిల్ బిజీ. కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు చేసిన త్రిషకు జయలలితగా నటించాలని ఉందట. ‘‘ఆమె సినిమా కెరీర్ గ్రాఫ్ అద్భుతం. పొలిటికల్ గ్రాఫ్ సూపర్. పవర్ఫుల్ లేడీ. ఆమె బయోపిక్లో నటించే అవకాశం వస్తే హ్యాపీ’’ అని ఓ సందర్భంలో త్రిష పేర్కొన్నారు. అందాల తార నయనతార వచ్చి పదేళ్లు పైనే అయింది. అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అవకాశం వస్తే ఆమెకు కూడా జయలలిత బయోపిక్లో నటించాలని ఉందట. ‘‘జయలలితగారి జీవిత చరిత్రలో ఏ కథానాయికకు మాత్రం నటించాలని ఉండదు. ఆ చాన్స్ నాకు వస్తే చేస్తా’’ అని ఓ సందర్భంలో నయన అన్నారు. ఇక ‘పురట్చి తలైవి’ పాత్రలో నటించడానికి ఉత్సాహంగా ఉన్న మలయాళ నటి ఎవరో తెలుసా? ‘సాహసం శ్వాసగా సాగిపో’లో నటించిన మలయాళ కుట్టి మంజిమా మోహన్ గుర్తున్నారు కదా. ఆమెకు జయలలిత పాత్ర చేయాలని ఉందట. మీరు ఎవరి బయోపిక్లో నటించాలనుకుంటున్నారు? అని నాకు ఆప్షన్ ఇస్తే.. ‘‘నా ఓటు జయలలితగారి జీవితానికి. ఆమె చాలా డేరింగ్ అండ్ బోల్డ్ లేడీ. జయలలితగారి ఆ క్వాలిటీస్కి నేను పెద్ద అభిమానిని. అందుకే ఆవిడ బయోపిక్లో యాక్ట్ చేయాలనుంది’’ అన్నారు. ‘మహానటి’ సావిత్రి పాత్రకు కీర్తీ సురేష్ తప్ప ఎవరూ నప్పేవారు కాదనే విధంగా ఆమె నటించారు. ఆ బయోపిక్కి పూర్తిగా న్యాయం చేసిన కీర్తి ఆ సినిమా ప్రమోషన్స్లో మరో బయోపిక్కి చాన్స్ ఉందని హింట్ ఇచ్చారు. అదే విధంగా ఇప్పట్లో మరో బయోపిక్ అంటే ఆలోచించాలి? వెంటనే మరో జీవిత చరిత్ర అంటే సామాన్యమైన విషయం కాదని కూడా ఆమె అన్నారు. ఇంతకీ కీర్తీ హింట్ ఇచ్చినది జయలలిత బయోపిక్కేనా? వేచి చూద్దాం. విద్యాబాలన్పై అందరి దృష్టి ఒక బయోపిక్ అనౌన్స్ చేయగానే ఎవరు నటిస్తే బాగుంటుంది? అనే చర్చ జరగడం కామన్. ప్రస్తుతం ఇదే చర్చ ఇటు సౌత్ అటు నార్త్లో జరుగుతోంది. మొదటగా సౌత్ నుంచి నార్త్కి వెళ్లి కథానాయికగా సెటిలైన ‘విద్యాబాలన్’ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్’కి విద్యా ఎంత న్యాయం చేశారో తెలిసిందే. ఆన్సెట్స్లో ఉన్న ‘యన్.టి.ఆర్.’ బయోపిక్లో బసవ తారకం పాత్ర చేస్తున్నారామె. ‘డర్టీ పిక్చర్’ తర్వాత ఏ బయోపిక్ ప్రస్తావన వచ్చినా విద్యాబాలన్ పేరు వినిపిస్తుంటుంది. ప్రముఖ బాలీవుడ్ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా హిందీ దర్శకుడు తిగ్మాన్షు ధూలియా తీయాలనుకున్న సినిమాలో విద్యాబాలన్నే తీసుకున్నారు. ముందు ఒప్పుకున్న విద్యా ఆ తర్వాత తప్పుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంతో సినిమా చేయడానికి బాలీవుడ్లో సన్నాహాలు మొదలైనప్పుడు కూడా విద్యాబాలన్ పేరే వినిపించింది. ఇప్పుడు కూడా జయలలిత బయోపిక్కి ఆమె పేరు వినిపిస్తోంది. – సినిమా డెస్క్ -
తాయ్.. పురట్చి తలైవి
తమిళ రాజకీయాల్లోనే కాదు, సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసి జయకేతనం ఎగురవేశారు జయలలిత. సీయంగా ఆమెను అభిమానులు ఎంత ఆదరించారో దేశం మొత్తం చూసింది. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్ గురించి నిర్మాతల్లో ఒకరైన ఆదిత్య భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘ఓ పబ్లిక్ మీటింగ్లో జయలలితగారిని కలిశా. బయోపిక్ గురించి చెప్పాను. ఈ విషయంపై తర్వాత మాట్లాడదాం అన్నారామె. కానీ, ఆ తర్వాత మాట్లాడే అవకాశం రాలేదు. ఈలోపు ఏవేవో జరిగిపోయాయి. అప్పుడు అనుకున్న స్క్రిప్ట్కి మార్పులు చేశాం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తీయబోతున్నాం. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. జనవరి లేక ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. జయలలిత పాత్రను ఎవరు చేస్తారన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేను’’ అన్నారు. ఈ సినిమాకి ‘తాయ్: పురట్చి తలైవి’ అనే టైటిల్ని ఖరారు చేశారు. అంటే.. అమ్మ: విప్లవ నాయకి’ అని అర్థం. -
జయ కేసుపై సుప్రీంకు..
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని సీఎం తనకు సూచించినట్లు భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. న్యాయశాఖ, ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) బీవీ ఆచార్య, అడ్వొకేట్ జనరల్ ఇప్పటికే అప్పీలుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. సుప్రీంలో కూడా ఎస్పీపీగా ఆచార్య కొనసాగుతారని వివరించారు. 19 ఏళ్లపాటు సాగిన ఈ కేసులో కర్ణాటక హైకోర్టు మే 11న జయను నిర్దోషిగా ప్రకటించడంతో అదేనెల 23న ఆమె మళ్లీ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూడా కర్ణాటకపై ఒత్తిడి తెచ్చింది. తీర్పును సవాలు చేయాలని కర్టాటక తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్, పీఎంకేలు ఆహ్వానించాయి. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇలగోవన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఇంతకుముందే తీసుకుంటే జయ సీఎం పగ్గాలు చేపట్టేవారు కాదని పీఎంకే అధినేత ఎస్.రాందాస్ వ్యాఖ్యానించారు.