breaking news
Iron yard
-
తుక్కు డబ్బుల గొడవతోనే గుర్తు తెలియని వ్యక్తి హత్య
శంషాబాద్: తుక్కు సామాన్లు విక్రయించిన డబ్బుల పంపకంలో జరిగిన గొడవే కొత్తూరులో చోటు చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి(55) హత్యకు కారణంగా తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, రాయచూర్కు చెందిన తెలుగు నాగప్ప ఇరవై రోజుల కిందట కాచిగూడకు వచ్చి అక్కడే నివాసముంటున్నాడు. ఇనుప సామాన్లు, తక్కు ఏరుకుని వాటిని విక్రయించేవాడు. ఈ నెల 23న రాత్రి అతడికి కొత్తూరులో గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి చేగూరు సమీపంలోని స్క్రాప్ దుకాణంలో తాము సేకరించిన తుక్కును విక్రయించారు. డబ్బుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. అప్పటికే ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి నాగప్పను కట్టెతో కొట్టడమేగాక డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కొత్తూరు సమీపంలోని మెగాఫ్లోర్ మిల్ వద్ద అతను మరోమారు నాగప్పపై కర్రతో దాడి చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన నాగప్ప అతడి వద్ద ఉన్న కర్ర లాక్కుని చితకబాదాడు. అనంతరం తలపై రాయితో మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆదివారం రాత్రి శంషాబాద్ పాలమాకుల వద్ద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా మృతుడి వివరాలు గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అంతా మాయ
♦ ఉక్కు కొంటే బుక్కయినట్టే.. ♦ భవానీపురం ఐరన్ యార్డులో మాయామశ్చీంద్రుల హల్చల్ ♦ దళారుల ఉచ్చులో పడితే జేబుకు చిల్లే.. ♦ తూకంలో భారీ మోసాలు : వినియోగదారులకు కుచ్చుటోపీ ♦ ముడుపుల మత్తులో తూనికలు, కొలతల శాఖ అధికారులు భవానీపురం : రాష్ట్రంలోనే అతిపెద్దదిగా పేరొందిన భవానీపురం ఐరన్ యార్డులో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఐరన్ వ్యాపారుల్లోని కొందరు మాయామశ్చీంద్రలు బరితెగించి వ్యాపారం సాగిస్తున్నారు. ఇనుము కొనేందుకు వచ్చిన వారిని తక్కువ తూకంతో బురిడీ కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రధాన సూత్రధారి సుమారు 30మంది యువకులకు లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి, ద్విచక్ర వాహనాలను ఏర్పాటుచేసి తన షాపుల తరఫున దళారులుగా నియమించుకోవడం విశేషం. వీరంతా ఐదు బృందాలుగా విడిపోయి వారికి అనుకూల షాపుల్లో ఏదో ఒక దానికి ఐరన్ కొనిచ్చి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. ఈ దళారుల బృందం పుణ్యమా అంటూ అనతికాలంలోనే వ్యాపారంలో విజృంభించిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయలతో ‘నరసింహా’వతారం ఎత్తాడు. ఎలా మోసం చేస్తారంటే... ఇనుము కొనేందుకు వచ్చే వారిని యార్డులోకి వెళ్లకుండా బైపాస్ రోడ్డులోనే ఈ బృందంలోని కొందరు చుట్టుముడతారు. ఉదాహరణకు ఆ రోజు టన్ను ఇనుము ధర రూ.40వేలు ఉంటే వీరు నాలుగైదు వేలు తక్కువ చెబుతారు. వినియోగదారుడికి నమ్మకం కలిగాక కొంచెం ముందుకు వెళితే, అక్కడా అతనిని చుట్టేస్తారు. మొత్తంమ్మీద ఈ బృందంలోని వారంతా కలిసి ఇతర షాపుల్లోకి వెళ్లకుండా వారిని పోషించే షాపునకు వినియోగదారులను మళ్లిస్తుంటారు. కాటాలో బురిడీ కొనుగోలు చేసిన ఇనుమును తరలించేందుకు అవసరమైన ఖాళీ లారీని కాటా దగ్గరకు తీసుకువెళతారు. లారీ టన్ను బరువు ఉందనుకుంటే దళారుల సూచనల మేరకు అరటన్ను మైనస్ చూపిస్తారు. ఆ మేరకు కాటా నిర్వాహకులు బిల్లూ ఇస్తారు. ఇనుమును లారీలో లోడ్ చేశాక మళ్లీ కాటాకు తీసుకువెళ్లి బరువు చూస్తారు. అప్పుడు మైనస్ అరటన్ను బరువును తీసేసి ఇనుముతో కలుపుకొని మొత్తం మూడు టన్నుల బరువు చూపిస్తారు. వాస్తవానికి లారీలో లోడ్ చేసేది టన్నున్నర ఇనుమే. అంటే.. అర టన్ను ఇనుమును తేలిగ్గా దోపిడీ చేసేస్తారు. ఆ రోజు టన్ను ఇనుము ధర రూ.40వేలు ఉంటే వినియోగదారుడు రూ.20వేలకు మోసపోయినట్టే. ఆనక.. అదనంగా వచ్చిన డబ్బును దళారులు, షాపు యజమాని పంచుకుంటారు. కాటాలో వ్యత్యాసం చూపించినందుకు కాటా నిర్వాహకులకు కిలోకు రూ.3 ఇస్తారు. అంతులేని ఆగడాలు ఈనెల మూడో తేదీన పరిటాల గ్రామ సర్పంచి తంగిరాల పద్మావతి ఈ తరహా మోసాన్ని వెలికితీసి షాపు యజమానితో గొడవకు దిగారు. పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. కొందరు ఐరన్ వ్యాపారులు మోసాలు చేస్తున్నా విజయవాడ ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చంట్స్ అసోసియేషన్ నిస్సహాయ స్థితిలో ఉండడంపై మిగిలిన వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయపార్టీల లావాదేవీలను చూసే కొందరు న్యాయవాదులు అక్రమార్కులకు బంధువులు కావడంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తూనికలు, కొలతల అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఐరన్ కాంప్లెక్స్లోని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.