breaking news
invistigesan Department
-
ఇల్లాలే హంతకురాలు..
సాక్షి, చీరాల రూరల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ ఇల్లాలు తన భర్తను చంపించింది. తండ్రి చనిపోవడం..తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. ఈ సంఘటన చీరాలలో వెలుగు చూసింది. పట్ట పగలు అంతా చూస్తుండగా ఐదు రోజుల క్రితం మాణిక్యరావు అనే యువకుడిని ఇద్దరు కలసి అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కేసులో చీరాల టూటౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో సీఐ రాజమోహన్రావు ఆధ్వర్యంలో డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చీరాల రంగారెడ్డి నగర్కు చెందిన పాశం మాణిక్యరావు (30), కృష్ణకుమారిలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమారై, కుమారుడు ఉన్నారు. బెస్తపాలెంలో ఆర్యాస్ ఫ్యాషన్ పేరుతో బట్టల షాపు నిర్వహిస్తున్నారు. నిత్యం సెల్ఫోన్తో కాలక్షేపం చేసే కృష్ణకుమారికి ఫేస్బుక్ ద్వారా తమిళనాడు రాష్ట్రం గుడియాట్టానికి చెందిన వెంకట్ నాథన్ శివ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలం పాటు వీరు స్నేహం కొనసాగించారు. అనంతరం వెంకట్ నాథన్ శివతో తెగతెంపులు చేసుకుంది. వెంకట్ నాథన్ శివ స్నేహితుడు మధన్ కుమార్ మనోగరన్తో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ కలిసి కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమారి తన భర్త పాశం మాణిక్యరావుకు మధన్ కుమార్ మనోగరన్ను కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో మధన్ అప్పుడప్పుడూ చీరాల వచ్చి కృష్ణకుమారి ఇంట్లో బస చేసేవాడు. భార్య ప్రవర్తనపై మాణిక్యరావుకు అనుమానం కలిగింది. ఎలాంటి బంధుత్వం లేని తమిళనాడుకు చెందిన యువకుడితో భార్య సన్నిహితంగా ఉంటడం భర్తకు నచ్చలేదు. తప్పుడు ప్రవర్తన మానుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలూ జరిగాయి. భార్య పథకం ప్రకారమే హత్య విసుగు చెందిన ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఇదే విషయాన్ని మధన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి మాణిక్యరావును చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ప్రణాళిక రచించారు. ఏ విధంగా హత్య చేయాలనే విషయంపై మధన్ తన సోదరుడైన దీపక్తో చర్చించాడు. దీపక్ అతని స్నేహితుడైన బ్లేడ్ అనేవ్యక్తి సాయంతో పది రోజుల క్రితం చీరాల చేరుకున్నారు. మాణిక్యరావుపై రెక్కీ నిర్వహించారు. గత నెల 29వ తేదీ ఉదయం వాకింగ్కు వెళ్లిన మాణిక్యరావును కొత్తపేటలోని ఏకేపీ జూనియర్ కళాశాల సమీపంలో దీపక్ అతని స్నేహితుడు బ్లేడు ద్విచక్ర వాహనంపై అనుసరించారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్లు ధరించి మాణిక్యరావును అడ్డుకున్నారు. ఆ వెంటనే దీపక్, అతని స్నేహితుడు బ్లేడు కలిసి మాణిక్యరావు మెడపై కత్తితో తీవ్రంగా పొడిచి పరారయ్యారు. మాణిక్యరావు రక్తమోడుతున్న పరిస్థితిలో సమీపంలోనే ఉన్న టూటౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుని దీపక్ అనే వ్యక్తి తనను పొడిచాడని పోలీసులకు చెప్పి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్పందించిన పోలీసులు ఆయన్ను చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరులోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదులో కదిలిన డొంక తన కుమారుడిని పాత గొడవల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన దీపక్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడనే మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ రాజ మోహనరావు, ఎస్ఐ నాగేశ్వరరావుతో కూడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. మాణిక్యరావు భార్య కృష్ణకుమారిని కూడా తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ తెలిపారు. కేసులో దీపక్, అతని స్నేహితుడు బ్లేడు, మరికొందరిని కూడా అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కేసును ఐదు రోజుల్లో ఛేదించిన సీఐ రాజమోహన్రావు, ఎస్ఐ నాగేశ్వరరావు మరి కొందరు కానిస్టేబుళ్లను డీఎస్పీ నాగరాజు అభినందించారు. -
ఐడీ.. ఆడిందే ఆట!
వేములవాడ, సిరిసిల్ల ఏరియాల్లో ఐడీ పార్టీ సిబ్బందిలోని కొందరు ఇటీవల దసరా మాముళ్లకు దిగడం వివాదస్పదమైంది. జగిత్యాల డివిజన్లోని ఓ సర్కిల్లో ఐడీ పార్టీకి చెందిన సిబ్బంది కొందరు మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అనేక సర్కిళ్లలో ఇసుక అక్రమ రవాణా, గుడుంబా అమ్మకాలు వంటి అంశాల్లోనూ ఐడీ పార్టీ సిబ్బంది అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయన్న ఫిర్యాదులున్నాయి. కొన్ని చోట్ల ఐడీ పార్టీ సిబ్బంది ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ తమకు సరిపడని సిబ్బందిపై చాడీలు చెబుతున్నారన్న అనుమానాలు సిబ్బందిలో నెలకొంటున్నాయి. కోరుట్ల: సాధారణ పోలీసు సిబ్బందిలో కొందరిని ఎంపిక చేసి ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ పేరిట ఐడీ పార్టీలు ఏర్పాటు చేయడం.. సదరు ఐడీ పార్టీల తీరు కొన్ని ప్రాంతాల్లో వివాదస్పదం కావడం తెలిసిందే. ఈ క్రమంలో డీజీపీ అనురాగ్శర్మ అన్ని ఐడీ పార్టీలను రద్దు చేసే యోచన చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయంగా మారింది. ప్రత్యేకమైన నేరాల పరిశోధన కోసం కాస్త చురుకైన సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఐడీ పార్టీలను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ ఐడీ పార్టీల సిబ్బంది కొన్ని సర్కిళ్లలో నేర పరిశోధనలో తమ చాకచక్యాన్ని ప్రదర్శించడం కన్నా.. తాము ప్రత్యేకమన్న రీతిలో ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం సమస్యాత్మకంగా మారింది. దీంతో ప్రజల్లోనూ.. పోలీస్ సిబ్బందిలోనూ ఐడీ పార్టీలు వివాదాస్పదవుతున్నాయి. ఐడీ పార్టీలు అవసరం లేదన్న వాదనలు బలపడుతున్నాయి. పక్కతోవ పడుతున్నాయి.. ఐడీ పార్టీలను ఓ హెడ్కానిస్టేబుల్తో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేస్తుంటారు. జిల్లాలో మొత్తం 68 పోలీస్స్టేషన్లు, 18 సర్కిళ్లు ఉండగా దాదాపు అన్ని సర్కిళ్లలోనూ అక్కడి పోలీసు అధికారులు ఐడీ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో జరిగే భారీ చోరీలు, చైన్స్నాచింగ్లు, హత్యలు తదితర నేరాల విచారణలో ఈ ఐడీ పార్టీలు క్రియాశీలకంగా పనిచేసి నేరస్తులను పట్టుకోవడంపై దృష్టి పెట్టి అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. ఈ విధుల నిర్వహణను పక్కనబెడుతున్న ఐడీ పార్టీ సిబ్బంది జిల్లాలోని చాలా చోట్ల ఆయా సర్కిల్ అధికారులకు మాముళ్లు వసూలు చేసి పెట్టే సొంత పార్టీలుగా మారిపోయాయి. అధికారుల అండ ఉండటంతో ఐడీ పార్టీల సిబ్బంది అదనపు సంపాదనకు అర్రులు చాస్తున్నారు. సిబ్బందిలో విభేదాలు పోలీసు సిబ్బందిలోనే కొందరికి ఐడీ పార్టీ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం అనేక ఠాణాల్లో సిబ్బంది మధ్య విభేదాలకు తావిస్తోంది. జిల్లాలోని కొన్ని సర్కిళ్లలో ఉన్న ఐడీ పార్టీ సిబ్బంది ఆయా సర్కిల్, ఠాణా ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ తమకు సరిపడని పోలీసు సిబ్బందిపై లేనిపోనివి కల్పించి చెబుతున్నారన్న అనుమానాలు సిబ్బందిలో నెలకొంటున్నాయి. ఇటీవల కోరుట్ల సెగ్మెంట్లోని ఓ ఠాణాలో పోలీసు సిబ్బంది ఐడీ పార్టీ తీరుపై అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఇలా అనేక ఠాణాల్లో ఐడీ పార్టీతో సాధారణ సిబ్బందికి విభేదాలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యం. దీంతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది చాలాచోట్ల ఏళ్ల తరబడి పాతుకుపోవడం గమనార్హం. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉండగా ఐడీ పార్టీ సిబ్బందిలో పనిచేస్తున్న చాలామంది కానిస్టేబుళ్లు సర్కిల్ స్థాయి అధికారుల అండతో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీమళ్లీ డెప్యుటేషన్ పేరిట పాత స్థానాలకు వచ్చి చేరుతున్నారు. ఇవన్నీ ఐడీ పార్టీలు వివాదస్పదం కావడానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఐడీ పార్టీలు అవసరం లేదన్న నిర్ణయానికి డీజీపీ రావడం పట్ల పోలీసు వర్గాల్లోనే కొందరు హర్షం వ్యక్తం చేస్తుండటం విశేషం.