ప్రియుడి ఇంటి ఎదుట యువతి దీక్ష
భీమదేవరపల్లి : నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు మాట మార్చి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలియడంతో ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్ష చేపట్టింది. ఈ సంఘటన భీమదేవరపల్లిలో శనివారం జరిగింది. భీమదేవరపల్లికి చెందిన యువతి గుండేటి రవీష్ణా (22), ఇదే గ్రామానికి చెందిన పచ్చునూరి సురేందర్(26) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రవీష్ణా ప్రస్తుతం పీజీ చదువుతోంది. సురేందర్ ధర్మపురిలో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. నాలుగు నెలలుగా తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించి సురేందర్పై కేసు పెట్టినట్లు రవీష్ణా తెలిపింది. ఇటీవల ఓ యువతితో పెళ్లి ఖరారైందని, ఈ నెల 10న నిశ్చితార్థం కూడా జరిగిందని పేర్కొంది. గత్యంతరం లేక తాను మౌన దీక్ష చేపట్టినట్లు చెప్పింది.
విషయం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య, ముల్కనూర్ ఎస్సై సతీశ్ సంఘటన స్థలానికి చేరుకుని నాలుగు నెలల క్రితమే సురేందర్పై కేసు నమోదు అయిందని దీక్ష విరమించాలని సూచించారు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడి దీక్ష విరమింపజేశారు. ఈ విషయమై సురేందర్ సోదరుడు సురేశ్ విలేకరులతో మాట్లాడుతూ తన సోదరుడికి సదరు యువతికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.